Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిబియా భవితవ్యంపై చర్చించటానికి జర్మనీ రాజధాని బెర్లిన్లో గత ఆదివారంనాడు ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. జర్మన్ చాన్స్లర్ అన్జెలా మెర్కెల్ ఆహ్వానం మేరకు అమెరికాతోపాటు ఐరోపాకు చెందిన సామ్రాజ్యవాద దేశాలు, రష్యా, చైనా, ప్రాంతీయ రాజ్యాలైన ఈజిప్ట్, అల్జీరియా, టర్కీలకు చెందిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ దేశాల ప్రతినిధు లతో పాటు లిబియా అంతర్యుద్ధంలో ఘర్షణపడుతున్న ప్రధాని ఫయేజ్ అల్-సర్రాజ్, జనరల్ ఖలీఫా హఫ్తర్, ఆఫ్రికా యూనియన్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. 2018లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం తరువాత జరుగుతున్న సమావేశమిదే. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఇటాలియన్ ప్రధాని జీసెప్పే కాన్టే, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో తదితరులంతా పాల్గొన్నారు.
లిబియాలో సుదీర్ఘకాలంగా సాగుతున్న అంతర్యుద్ధంలో ఘర్షణపడుతున్న వర్గాలకు కాల్పుల విరమణ కాలంలో ఆయుధాల సరఫరా చేయకూడదని లిబియాతో ప్రయోజనాలున్న దేశాలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని జర్మన్ చాన్స్లర్ మెర్కెల్ ప్రకటించింది. ఇందుకోసం ఒక సమగ్ర ప్రణాళిక రచించామని కూడా ఆమె తెలిపారు. రాజకీయ ప్రక్రియ సజావుగా సాగటానికి హఫ్తర్ తన హింసాత్మక కార్యకలాపాలకు స్వస్తి చెప్పాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. అసలే అంతర్యుద్ధంతో సతమతమౌతున్న లిబియాలో సిరియా నుంచి, ఇతర దేశాల నుంచి సైనికులు చేరటంతో సమస్య మరింతగా జటిలమవుతుందని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ అన్నారు.
లిబియాలో శాంతి, సుస్థిరతలను పునరుద్ధరిం చటానికి చేసే తాజా ప్రయత్నమే ఈ సమావేశం అని చెబుతున్నారు. డాలర్ ఆధారిత లావాదేవీలకు అతీతమైన ఒక నూతన ఆఫ్రికా యూనియన్ నిర్మించాలని ప్రయత్నిస్తున్న లిబియా నాయకుడు కర్నల్ గడాఫీని హిల్లరీ క్లింటన్ అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉండగా 2011 అక్టోబర్ 20న హత్యచేశారు. ఆ తరువాత లిబియా రాజకీయార్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రాజకీయ సుస్థిరత లేక దేశం అనేక సాయుధ మూకల ఘర్షణలకు ఆలవాలమైంది. వీటిలో రెండు ప్రధాన పక్షాలను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఒక పక్షం పేరు గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అక్కార్డ్ (జీఎన్ఏ) కాగా మరోపక్షం తూర్పు ప్రాంత నగరమైన తోబ్రక్లో తిష్టవేసిన హఫ్తర్ ది. హఫ్తర్కు యూఏఈ, ఈజిప్ట్, జోర్డాన్, కొంతవరకు ఫ్రాన్స్ మద్దతు ఉంది. హఫ్తర్ తరపున రష్యా కిరాయి సైనికులు కూడా పోరాడు తున్నారు. రాజధాని స్థావరంగా చేసుకున్న జీఎన్ఏకు టర్కీ గట్టి మద్దతునిస్తోంది.
గత ఏప్రిల్లో లిబియా రాజధాని ట్రిపోలీని ఆక్రమించటానికి హఫ్తర్ అనుకూల దళాలు చేసిన ప్రయత్నం విఫలమైంది. కాల్పుల విరమణ ఒప్పందాలను అనేకసార్లు హఫ్తర్ అనుకూల దళాలు అతిక్రమించాయి. ఈ సమావేశం ప్రారంభానికి ముందే హఫ్తర్ ఎజెండాపై అల్-సర్రాజ్ తన సందేహాన్ని వెలిబుచ్చాడు. ఎటువంటి పరిస్థితులలోను ట్రిపోలీ నగరాన్ని కాపాడుకుని తీరతామని ఆయన అన్నాడు. తూర్పు ప్రాంతాన్ని స్థావరంగా చేసుకున్న హఫ్తర్ దళాలు తూర్పు చమురు నౌకాశ్రయాలను మూసివేయగా చమురు ఉత్పత్తి రోజుకు ఎనిమిది లక్షల బ్యారల్స్కి పడిపోయింది. దీనితో ట్రిపోలీ ప్రధాన ఆదాయ వనరు కుదేలవుతుంది. జీఎన్ఏకు మద్దతుగా టర్కీ దళాలను లిబియాకు పంపాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఇది జరిగింది. పశ్చిమ లిబియాలోని సాయుధ బలగాలను నిరాయుధీకరించి జీఎన్ఏకి, టర్కీకి మధ్య చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని హఫ్తర్ డిమాండ్ చేస్తున్నారు.
లిబియాను మరో సిరియా కాకుండా కాపాడటానికే బెర్లిన్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఈ సమావేశం శాంతికి మొదటి అడుగని జర్మన్ విదేశాంగమంత్రి హైకో మాస్ అన్నారు. అల్-సర్రాజ్ ప్రభుత్వానికి ఐరోపా మద్దతు పలకాలని, లిబియా రాజధాని ట్రిపోలీ పతనమయితే అది ఐసీల్ లేక అల్ఖైదా శక్తులు తిరిగి పునరుజ్జీవం కావటానికి ఉపయోగపడే క్షేత్రంగా మారుతుందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. లిబియా అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా, కాల్పుల విరమణపట్ల నిబద్ధత చాటి ఘర్షణ నివారించాలని ఐక్యరాజ్య సమితి అంతిమంగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఈ నెలాఖరులో లిబియా పక్షాలమధ్య జనీవాలో జరగబోయే చర్చలను సఫలమయ్యేలా చూడాలని కూడా ఐక్యరాజ్య సమితి కోరింది. అలాగే లిబియాలో ఉత్పత్తి అయ్యే ముడి చమురును అమ్మటానికి ప్రభుత్వ చమురు కంపెనీ ఎన్ఓసీకి మాత్రమే అధికారం ఉందని, చమురు ఉత్పత్తి క్షేత్రాలపై దాడులకు పాల్పడవద్దని కూడా ఆ ప్రకటన పేర్కొంది. లిబియాలో జోక్యం చేసుకుంటున్న దేశాలు ఆ దేశంలో ఘర్షణపడుతున్న శక్తులకు ఇస్తున్న మద్దతును నిలిపివేసే ఒప్పందానికి రావాలనేదే ఈ సమావేశం లక్ష్యం. హఫ్తర్ విదేశీ మద్దతుదారుపైన ముఖ్యంగా యూఏఈపై ఒత్తిడి తేవటానికి పశ్చిమ దేశాలు సిద్ధంగా లేకపోవటమే సమస్యగా ఉంది. అటువంటి పరిస్థితులలో విదేశీ జోక్యం ఆపాలనే బెర్లిన్ సమావేశ లక్ష్యం నెరవేరదు. యుద్ధం నుంచి లాభపడుతున్న పక్షాల శాంతి ప్రవచనాలు మాటలకే పరిమిత మవుతాయనేది సుస్పష్టం.