Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత దశాబ్దంలో అంటే 2010 నుంచి 2019 దాకా భూ ఉపరితల తాపాలు అత్యంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్యుఎమ్ఓ), అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలక సంస్థ(ఎన్ఓఏఏ)లు తమ స్వతంత్ర అధ్యయనాల ద్వారా నిర్ధారించాయి. 1960వ దశకం నుంచి ప్రతి దశాబ్దం అంతకు ముందటి దశాబ్దంకంటే ఎక్కువ తాపాన్ని నమోదుచేసింది.
2015-2019 మధ్యనున్న ఐదేండ్లలో చాలా ఎక్కువగా భూ తాపం నమోదైంది. ఎల్ నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు అత్యంతగా పెరిగిన 2016 తరువాత 2019 రెండవ అత్యంత అధికంగా తాపం నమోదయిన సంవత్సరంగా ఉంది. పారిశ్రామిక శకం ముందటి నుంచి ఉపరితల ఉష్ణోగ్రత సగటున 1.1సెల్సియస్ పెరుగుతోంది. వాతావరణంలోకి మానవాళి విడుదలచేసే కార్బన్డయాక్సైడ్, ఇతర గ్రీన్హౌస్ గ్యాస్లవల్ల ఇలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ప్రముఖ శాస్త్రజ్ఞులందరూ అభిప్రాయపడుతున్నారు.
2019లో ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అందువల్ల అడవుల్లో వ్యాపించిన మంటల కారణంగా అటవీ జీవాలకు, పర్యావరణానికి తీవ్రమైన హాని జరిగింది. ఈ ఏడాదే కాదు, రాబోయే దశాబ్దాలలో కూడా మరింత తీవ్రమైన వాతావరణాన్ని మనం చూడబోతున్నాం. వాతావరణంలో వేడిని బంధించే గ్రీన్హౌస్ గ్యాసెస్ కారణంగా ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి. మానవ ప్రేరిత వాతావరణ మార్పు ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్లమంది ప్రజలు అనేకవిధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. 2019లోనే వడగాడ్పులకు, కరువుకాటకాలకు, అగ్నిప్రమాదాలకు, ఉప్పెనలకు, వరదలకు, సముద్రాలలో పెరిగిన ఆమ్లీకరణకు, ఆర్కిటిక్, అంటార్కిటికాల మంచు కరగటానికి, సముద్ర మట్టాలు పెరగటానికి అధిక భూ తాపమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలంటున్నారు.
భూ తాపాన్ని పెరగకుండా అరికట్టటానికి ఏమిచేయాలనే విషయం అందరికీ తెలిసిందే. వాతావరణంలో స్థిరపడిన కర్బనాన్ని గ్రహించే సాంకేతికతను అభివృద్ధి చేస్తూ శిలాజ ఇంధనాలకు కర్బనేతర ప్రత్యామ్నాయాలను పెద్దఎత్తున ఉపయోగించినప్పుడే ఉద్గారాల విడుదల గణనీయంగా తగ్గుతుంది. ఇలా చేయకపోతే ఈ శతాబ్దం చివరికల్లా ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 సెల్సియస్ పెరుగుతాయి. ఇంతటి ప్రమాదం పొంచివున్నా, ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఏర్పడే దుష్ఫలితాల గురించి అవగాహనవున్నా, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తామని ప్రభుత్వాలు, బహుళజాతి కంపెనీలు ప్రకటనలు చేసినప్పటికీ 2019లో వాతావరణంలోకి విడుదలైన కార్బన్ వాయువుల పరిమాణం ఎన్నడూలేనంతగా పెరిగిందని గ్లోబల్ కార్బన్ ప్రోజక్టు అంచనా వేసింది. బొగ్గు ద్వారా విడుదలయ్యే ఉద్గారాల పరిమాణం తగ్గినప్పటికీ (ప్రపంచం మొత్తంలో దాని వాటా ఇప్పటికీ 40శాతంగా ఉంది) చమురు, సహజ వాయువు వినియోగం ఎక్కువ కావటంతో వాతావరణంలోకి విడుదలైన మొత్తం ఉద్గారాల పరిమాణం పెరిగింది.
భూతాపం పెరిగిన పర్యవసానంగా వినాశకర దుష్ఫలితాలు ఏర్పడకుండా చూడటానికి కావలసిన విధానాలను పాలకవర్గాలు అమలు చేయకపోవటం పట్ల అంతర్జాతీయంగా కార్మికులు, యువత నిరసిస్తోంది. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థకు సహజసిద్ధంగా ఉండే అహేతుకత కారణంగానే ప్రభుత్వాలు, బహుళజాతి కంపెనీలు ఈ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయనే వాస్తవాన్ని గ్రహించగలిగినప్పుడే రాబోయే కాలంలో ఈ విషయంపై జరిగే రాజకీయ పోరాటాలు అర్థవంతంగా ఉంటాయి. ఉత్పత్తి సాధనాలు ప్రయివేటు యాజమాన్యాల చేతిలోవుండటం, లాభాలను కూడబెట్టటమే ధ్యేయంగా ఉత్పత్తి ఉండటం, ప్రపంచం పరస్పరం పోటీలోవుండే జాతి రాజ్యాలుగా విడిపోయి ఉండటంవంటి లక్షణాలుగల పెట్టుబడిదారీ వ్యవస్థకు వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించటానికి కావలసిన అంతర్జాతీయ ప్రణాళికను రూపొందించగలిగే సామర్థ్యంగానీ, అందుకు అవసరమైన వనరులను కేటాయించగలిగే నిబద్ధతగానీ ఉండవు.
రాజకీయ నాయకుల, కార్పొరేట్ కంపెనీల యజమానుల అంతరాత్మ లకు నైతిక బాధ్యతల ఆవశ్యకత గురించి విన్నవించుకోవటంవల్ల 'సాధించింది ఏమీ లేదు' అని వాతావరణ మార్పు క్రియాశీలి గ్రేటా థన్బర్గ్ పేర్కొంది. ప్రపంచాధిపత్యం కోసం యుద్ధాలను, సైనిక దురాక్రమణలను చేసే అమెరికా మిలిటరీనే ఒక దేశం అనుకుంటే అది ప్రపంచంలో అత్యంత ఉద్గారాలను విడుదలచేసే 47వ దేశం అవుతుంది. ప్రపంచ మార్కెట్లపై ఆధిపత్యం కోసం, లాభాలలో వాటాల కోసం జరుగుతున్న పోరు కారణంగా జాతి రాజ్యాలు యుద్ధ సన్నద్ధత కోసం తమ వనరు లను మరింతగా కేటాయిస్తున్నాయి. దీనితో అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా ఉద్గారాల విడుదలకు కారణభూత మౌతు న్నాయి. ప్రపంచంలో 100బహుళ జాతి కంపెనీలు 71శాతం ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. షేర్ హౌల్డర్లకు లాభాలు పంచటం, ఇంధనంపై తక్కువ వ్యయంతో పరిశ్రమలను నడపటంపైన వీరికున్న ఆసక్తి మానవాళి ప్రయోజనాలను కాపాడటంపైన ఉండదు.
కాబట్టి సకల దేశాలలోని కార్మికులు, యువత ఒక్కమాటలో చెప్పాలంటే యావత్ ప్రపంచ ప్రజానీకం వాతావరణ మార్పుల వినాశకర పర్యవసానాలను గుర్తించి పెట్టుబడిదారీ వ్యవస్థ అరాచకాలను అరికడితేనే భూగ్రహం నివాస యోగ్యంగా కొనసాగుతుంది. అలా జరగకపోతే భూ గ్రహంపై మానవాళి భవితే ప్రమాదంలో పడుతుంది.