Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల విజయం కోసం ఏంచేసినా తప్పులేదని తీర్మానించుకున్న తరువాత ఇంక వాళ్ళు ఏమైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. పచ్చి అబద్ధాలను పరమ సత్యాలుగా బొంకుతారు. ఎంతటి నీచపదాలనైనా ప్రయోగిస్తారు. ఎంత నీచ ప్రవృత్తికైనా పాల్పడతారు. అనుమానమా మీకు? అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు ప్రయోగించిన పదాలు చూడండి, వినియోగించిన భాష వినండి మనుషులు, ముఖ్యంగా నాయకులు, అందునా పాలకులు ఇంతగా దిగజారి పోతారా?! అని ఆశ్చర్యపోతారు. ఆందోళనకు లోనవుతారు. ఆగ్రహానికి గురవుతారు. అయ్యో నా దేశానికి ఎంతటి దౌర్భాగ్యం పట్టింది అని మౌనంగా రోదిస్తారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం ఖాయమని, కమలనాథులు మట్టికరవడం తథ్యమనీ పలు ఎన్నికల సర్వేలు ఘోషిస్తుం డటంతో కమలం నేతలు కనీవినీ ఎరగనంతగా రెచ్చిపోయారు. ప్రధాని మోడీ సాక్షాత్తూ పార్లమెంటు వేదికగా అయోధ్యలో రామాలయ నిర్మాణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకునేందుకు పూను కున్నారు. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లోనే కమలనాథులకు ఉగ్రవాది కనిపించారు. ప్రజలచేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఉగ్రవాది అని దూషించారంటే ఇక వీరి మానసిక స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? ''ఒక వర్గానికి చెందిన పిరికిపందలైన మగవారు దుప్పటి కప్పుకుని ఇంట్లో కూర్చుని మహిళలను, పిల్లలను సీఏఏపై నిరసనలు తెలిపేందుకు పంపుతున్నారు'' అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ షాహీన్బాగ్ ప్రాంతంలో సీఏఏకు వ్యతిరేకంగా సాహసోపేతమైన, సుదీర్ఘ ఆందోళన చేస్తున్న ముస్లిం మహిళల గురించి వారు ఈ వ్యాఖ్యలు చేశారు. షాహీన్బాగ్ను కేంద్రంగా చేసుకుని మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు కమల నాథులు అన్ని విలువలకూ తిలోదకాలు ఇచ్చారు. అందులో భాగంగానే 'షాహీన్ బాగ్లో సూసైడ్ బాంబర్లకు ట్రయినింగ్ ఇస్తున్నారు' కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పచ్చి అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టారు. మరొక ఎంపీ మరింత ముందుకెళ్లి షాహీన్బాగ్ నిరసనల వెనుక ఉన్న లక్షలాదిమంది మగాళ్ళు మీ ఇండ్లలోకి జొరబడి మీ భార్యలను, చెల్లెళ్లను చెరిచేస్తారని హిందువులను హెచ్చరించారు. ప్రజలను తీవ్ర అభద్రతా భావంలో ముంచడం మీకు భద్రత కల్పించగలిగేది తామేనన్న భ్రమ కల్పించడం వీరి ఎత్తుగడ. భయంలో ఉన్నవాడు అబద్ధాన్ని తొందరగా నమ్మేస్తాడు. తన భద్రత కోసం మోసగాండ్ల మీదే ఆధారపడతాడు.
అధికారం పొందాలనుకునే వారు ఎదుటిపక్షం వారిని రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తారు, కానీ ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నవారు ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా పరిగణిస్తారు. వారి వ్యక్తిత్వ హననానికి, భౌతిక అంతానికి సైతం పాల్పడతారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ విషయంలో బీజేపీ నాయకులు ఇలాగే ప్రవర్తించారు.
''సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్బాగ్లో నిరసనలు చేస్తున్నవారికి కేజ్రీవాల్ బిర్యానీ పంపుతున్నారు. మేము బిర్యానీ కాదు బుల్లెట్లు తినిపిస్తాం'' అని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజల ఆహారపు అలవాట్ల ఆధారంగా ప్రజలను విభజించే కుట్రకు పాల్పడ్డారు. ఇందుకే ఆయనకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయినా, నోటీసులకు జడిసేటంత మర్యాదస్తులు, చట్టానికి లోబడి బతికే బుద్ధిమంతులా కమలనాథులు?! అందుకే ఏమాత్రం జంకూబొంకూ లేకుండా సీఏఏ నిరసనకారులను ఉద్దేశించి 'గోలీమార్ సాలేంకో', అని ఘీంకరించారు. ఢిల్లీ ఎన్నికలను పాక్-ఇండియా క్రికెట్ మ్యాచ్తో పోల్చారు. తాము ఇండియా టీమ్ అయితే ఆప్ పాక్ టీమ్ అన్నమాట. కాబట్టి ఇండియా టీమ్ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే! లేకుంటే మీరంతా దేశ ద్రోహులై పోతారు-అన్నది కమలనాథుల హెచ్చరిక!
మొత్తానికి ప్రజల్ని భావోద్వేగాలలో ముంచి ఢిల్లీ ఎన్నికలలో విజయం సాధించేందుకు పడరాని పాట్లు పడ్డారు. కమలనాథులు ఇలా హద్దులు దాటి ప్రవర్తించేందుకు అనువైన కారణాలే ఉన్నాయి. రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత మోడీగ్రాఫ్ దారుణంగా పడిపోతూ ఉంది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లో ఘోరపరాజయమే ఇందుకు నిదర్శనం. ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై అన్ని వర్గాలలోనూ దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెరిగిపోతూ ఉంది. లక్షలాదిగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులూ వీధుల్లోకి వచ్చి తమ ప్రభుత్వ వ్యతిరేకత చాటుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రజాంగీకారం ఉన్నదని చాటుకోవాల్సిన అనివార్యతలోకి నెట్టబడింది బీజేపీ నాయకత్వం. ఢిల్లీ 70నియోజకవర్గాల చిన్న రాష్ట్రమే అయిన ప్పటికీ, అది దేశ రాజధాని అయినందువల్ల అక్కడ దేశం నలుమూలలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి ఢిల్లీ ప్రజల నిర్ణయం దేశ ప్రజ నిర్ణయంగా పరిగణింపబడుతుంది. కాబట్టి కమల నాథులు ఇంతగా తమ నోళ్లకు పనిచెప్పారు. ప్రజలను మతపరంగా విభజించి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకే పరీక్ష. భావోద్వే గాలకు తలవంచుతారా లేక ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, రాజ్యాంగ బద్ధమైన పాలనకోసం బీజేపీని ఓడిస్తారా? వేచిచూడాల్సిందే.