Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు తంబూర దీస్కుండు. ఒకసారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు దీస్కోని ఒకసారి కొట్టి జూస్కుండు. గీపారి యాడ్కి బోవాలె. యాడికి బోతె బాగుంటదని జెరసేపు సోంచాయించిండు. ఎప్పుడు యాద్గిరి గుట్టకు బోతున్న. గీపారి వారనాసికి బోతె బాగుంటది. మోది వారనాసి కెల్లే గెల్సిండు. గాడి శంకరునితోని ముచ్చట బెడ్తినే అంటె బిజెపి గురించి అంత ఎర్కైతది అని నారదుడు అనుకుండు. అనుకొని మొగులు మీదికెల్లి ఎల్లిండు.
నడి జాము నాత్రి. యాడ సప్పుడు లేదు. అందరు పండుకున్నరు. కుక్కలు బౌబౌ మంటున్నయి. చెట్లమీద కాకులు, పిట్టలు పండుకున్నయి. పోలీసోల్లు జీపులు గస్తి దిర్గుతున్నరు. నిద్రరాక సత్రాలల్ల ఉన్నోలల్ల కొందరు నిద్రరాక అటిటు బొర్లుతున్నరు. కోతులు అటిటు దుంకుతున్నయి. నారదుడు వారనాసిల దిగిండు. గుడికి తాలమున్నది. నారదుడు మాయమై గుల్లెకు బోయిండు. శివలింగం ముంగట్కి బోయి -
''నారాయణ, నారాయణ'' అన్నడు.
నాతాన్కి వొచ్చెటోల్లు శంబో శంకరా అంటరు. నారాయన, నారాయన అంటున్నది ఎవరా అని లింగంల కెల్లి శంకరుడు ఎల్లిండు. ఎదురుంగ గాయినకు నారదుడు గండ్ల బడ్డడు.
''ఎన్నడు రానోనివి. ఇయ్యాల గదీ నడిజాము నాత్రి ఎందుకొచ్చినవు నారదా'' అని శంకరుడు అడిగిండు.
''మీతోని ముచ్చట బెడ్తె బిజెపి గురించి అంత ఎర్కైతదని''
''గిప్పుడు బిజెపి కొత్త చరిత్ర రాస్తున్నది.''
''బిజెపిల ఎవరు కొత్త చరిత్ర రాస్తున్నరు''
''బిజెపి ఎంపీలు, అనంతకుమార్ హెగ్డే, పర్వేజ్ వర్మ, ప్రగ్నా సింగ్ టాకూర్ మంత్రి అనురాగ్ టాకూర్ కొత్త చరిత్రను రాస్తున్నరు.''
''గాందిని మహాత్మా అని ఎందుకంటున్నరో నాకు సమజైత లేదు. అని బిజెపి ఎంపీ అనంతకుమార్ హెగ్డే అన్నడు. గట్లని కాంగ్రెస్ రాసిన చరిత్రల ఉన్నది గదంత తప్పు అని గాయన జెప్పిండు''
''గాందిని మహాత్మా అని ఎందుకు అనొద్దంట''
''గాంది బూకర్తాల్ సత్యాగ్రహం జెయ్యబట్కె సాతంత్రం వొచ్చిందంటె నా నెత్తురు మస్లుతున్నది. స్వాతంత్రం కోసం అంగ్రేజోల్లతోని విద్దం జేస్తున్న అనుకుంట గాంది డ్రామ ఆడిండు. డ్రామ ఆడినోడు మహాత్మా ఎట్ల అయితడు. గాయిన కన్న మంచిగ డ్రామ ఆడినోట్లు మస్తుమంది ఉన్నరు. గాల్లందరిని మహాత్ములని అంటున్నమా? అని అనంతకుమార్ అడిగిండ్రు''
''మల్ల సాతంత్రం ఎట్ల వొచ్చిందంట''
''మా సన్నాసులు, మునులు, ఆర్ఎస్ఎసోల్లు జెయ్యబట్కె సాతంత్రం వొచ్చింది. సన్నాసులు, మునులు యాగాలు జేసిండ్రు. యాగాలల్ల కెల్లి ఎల్లిన పొగతోని అంగ్రేజోల్ల కండ్లు మండినయి. గీడ ఉంటె దినాం కండ్లు మండుతయనుకొని మన దేసంకు సాతంత్రం ఇచ్చి అంగ్రేజోల్లు గాల్ల దేసం బోయిండ్రు. గిదే నిజం. మేము రాస్తున్న చరిత్రల గిసువంటి నిజాలే ఉంటయి అని అనంతకుమార్ అన్నడు.''
''సాతంత్రం విద్దం విద్దం కాదా?''
''సాతంత్రం కోసం విద్దం జేసిండ్రని కాంగ్రెసోల్లు జెప్తున గాంది గాని కడ్మ లీడర్లు గాని ఒక్కల్లంటె ఒక్కలు గాని లాటిదెబ్బలు దినలేదు. సాతంత్ర విద్దం ఒక డ్రామ. అంగ్రేజోల్ల మదద్తోని గీడ్రామ ఆడిండ్రు. అంగ్రేజోల్లు లాటిలతోని కొట్టినట్లు యాక్టింగ్ జేస్తె గీల్లు దెబ్బలు దిన్నట్టుల యాక్టింగ్ జేసిండ్రు. కుత్కెల దాంక తిని గాంది బూకర్తాల్ జేసినట్లు డ్రామ ఆడిండు. అని జెప్పిండు''
''సాతంత్రం విద్దం డ్రామ ఎట్ల అయితదంట?''
''సాతంత్రం విద్దం రొండు తీర్ల ఉంటది. కత్తులు, బానాలు, తుపాకులతోని కొట్లాడేది ఒక విద్దమైతే. దిమాక్ లడాయించి కొట్లాడేది ఇంకొక తీరు విద్దం. గీ రొండు తీర్లే గాకుంట మూడో తీరు విద్దం గూడ ఉన్నది. గదే డ్రామ విద్దం. గీ దాంట్ల ఎట్ల విద్దం జెయ్యమంటరో మీరే జెప్పుండ్రి అని ఆంగ్రేజోల్లను అడుగుతారు. మమ్ములనుజేల్లల బెట్టుండ్రని ఒక తీర్గ బత్మిలాడ్తరు. గసుంటోల్లే సాతంత్ర వీరులను పాత చరిత్రల రాసిండ్రు. గిదంత తప్పు అని మేము కొత్త చరిత్రల రాస్తున్నం. ఇగముంగట మేము రాసిన చరిత్రనే బడులల్ల జెప్తురు అని అనంతకుమార్ అన్నడు.
బిజెపి రాస్తున్న కొత్త చరిత్ర ఎట్లుంటదని ప్రగ్నాసింగ్ టాకూర్ జెప్పింది''
''మన దేసంల అస్లి దేసబక్తుడు గాడ్సేనే. గాయిననే మహాత్మా. గాయిననే అంగ్రేజోల్లతోని కొట్లాడిండు. గాయిన సుంట్రోల్లు సాతంత్రం విద్దం జెయ్యబట్కెనే మన దేసంకు సాతంత్రం వొచ్చింది. ఆకర్కి దోమను గూడ గాయిన సంపెటోడు గాదు. దోమకు జెర్రంత నెత్తురును దానమిస్తె పెయ్యికి ఏమైతదని గాయిన అడిగెటోడు. గసువంటి గాడ్సేమీద కాంగ్రెస్ బుర్ద సల్లింది. గాడ్సే అసువంటి దేస బక్తుని గురించి పాత చరిత్రల చెడ్డగ రాసిండ్రు. గాయిన ఎసుంటోడో మా కొత్త చరిత్రల రాస్తున్నం అని ప్రగ్నాసింగ్ జెప్పింది''
''ఇంకేం రాస్తమని గామె జెప్పింది?''
''తాజ్మహల్, తాజ్మహల్గాదు. గది తేజోమహల్. నిజం జెప్పాలంటె అది సూర్యుని గుడి. సూర్యుని గుడి అయ్యెబట్కె గాదాన్ని తేజోమహల్ అనేటోల్లు. కుతబ్ మినార్, కుతుబ్ మినార్ గాదు. గది ఒక్కటే తబం లెక్క గట్టిన మిద్దె. ఎన్కట పరిక్షితు అనేటి రాజుకు ఒక ముని శాపమిచ్చిండు. వారం దినాలల్ల పాము గర్సి సస్తవని జెప్పిండు. ఇగ దాంతోని పాములు రాకుంట ఉండెతందుకు ఒక్కటే తంబం లెక్క మిద్దె గట్టిపిచ్చి దాంట్ల పరిక్షితు రాజు ఉన్నడు. గా ఒక్కటే కంబ మిద్దెను కుతుబ్ మినార్ అని చరిత్రల రాసిండ్రు. అశ్విని దేవతలు ఎసువంటి రోగంను గూడ తక్వజేసెటోల్లు. మన తాన ఎంతమంది గూసున్నా ఇంకొకలకు జాగ ఉండేటి గాలి మోటర్లు ఉండేటియి. గసువంటి గాలి మోటర్లు గిప్పుడున్నయా? సచ్చినోల్లను గూడ సంజీవితోని బత్కిచ్చెటోల్లు. గిదంత మా కొత్త చరిత్రల రాస్తం అని సాద్వి ప్రగ్నాసింగ్ అన్నది.''
''ఇంకెవ్వలు ఏమన్నరు?''
''మన దేస రాజ్యాంగంను మావోల్లే రాసిండ్రు. అస్లి రాజ్యాంగం మీద రాముడు, కిష్నుడు, హన్మంతుని బొమ్మలుండేటియి. గని కాంగ్రెసోల్లేగా బొమ్మలను మల్పే సిండ్రు. గీ సంగతి జెనంకు ఎర్కజేసె తందుకే కొత్త చరిత్ర రాస్తున్నం అని బిజెపి ఎంపీ పర్వేజ్ వర్మ జెప్పిండు. కిష్నుడు రాయబారంకు బోయినప్పుడు కౌరవులకు ఒక్క తీర్గ జెప్పిండు. గని గాల్లు ఇనలేదు. గప్పుడు కిష్నుడు ఏం జేసిండు పాండవులతోని కౌరవులకు సంపిపిచ్చిండు. మా మాట ఇనలోల్లను తుపాకి గుండులతోని సంపుమంటె తప్పేం లేదు. గిది గూడ మేము కొత్త చరిత్రల రాస్తం అని మంత్రి అనురాగ్ టాకూర్ అన్నడు'' అని శంకరుడు జెప్పిండు.
''గీల్లు పురానాలను గూడ కొత్తగ రాస్తరేమో. గవ్విట్ల ''పరమ శివుడు దొంగరా, విషము మింగలేదురా అని జెప్తరేమో'' అని నారదుడు అన్నడు.
ఇంతల తెల్లారింది. నారదుడు మాయమై మొగులు మీద్కి బోయిండు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491