Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిమాణంతో సంబంధం లేకుండా కొన్ని విజయాలు కీలక ప్రభావాన్ని చూపుతాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం కూడా అంతే! ఢిల్లీ కేవలం 70 అసెంబ్లీ స్థానాలు మాత్రమే కలిగిన చిన్న రాష్ట్రమే కావచ్చు. అయినా ఢిల్లీలో ఆఫ్ ఘన విజయం ప్రజాస్వామ్య, లౌకిక విలువలకు గొప్ప విజయం. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వినిపించిన నినాదాలను విని దేశం విస్తుపోయింది. బీజేపీ నేతలు వాడిన భాషా ఉపయోగించిన మాటలూ విని మానవీయత మూర్చబోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే మతపరమైన పునరేకీకరణకోసం బీజేపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. ఏం చేసైనా ఢిల్లీని చేజిక్కించుకుని ఇటీవల తాము తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏలకు ప్రజల మద్దతు ఉన్నదని చెప్పుకోవాలని కమలనాథులు పడరాని పాట్లు పడ్డారు. మోడీ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, తాము అంబానీ, అదానీలాంటి సంపన్నుల సేవలో తరిస్తున్న వాస్తవాన్ని మరిపింప చేసేందుకు, ప్రజల దృష్టి మతంవైపూ, పౌరసత్వం, దేశభక్తివైపూ మళ్లించేందుకు నానాగడ్డీ కరిచారు. అయితే ఢిల్లీ ప్రజలు వివేకవంతమైన తమ తీర్పుతో వారి ప్రయత్నాలను వమ్ము చేశారు. సంఫ్ుపరివారం చెంప ఛెళ్లు మనిపించారు. మత విద్వేషకులకు తీవ్ర హెచ్చరిక పంపారు.
అడ్డదారుల్లో ఎన్నికలలో గెలవడం, ఆ తరువాత తాము తీసుకునే ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయానికీ ప్రజల అంగీకారం, మద్దతూ ఉన్నాయని చెప్పుకోవడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారింది. ఢిల్లీలో కూడా విజయం సాధించి ఇటీవల తాము తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏలకు ప్రజల ఆమోదం ఉన్నదని ప్రచారం చేసుకోవాలని బీజేపీ నాయకత్వం ఉవ్విళ్లూరింది. అందుకే ప్రజల జీవన సమస్యలపై ఏమాత్రం దృష్టిపెట్టకుండా తీవ్రస్థాయిలో భావోద్వేగాలను రెచ్చగొట్టి హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పడింది. ఏకంగా 250మంది ఎంపీలను, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పదుల సంఖ్యలో కేంద్ర మంత్రుల్ని ఢిల్లీ గల్లీలలో మోహరింపజేసింది. డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేసింది. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్నే ఉగ్రవాది అంటూ నిందించారంటే కమల నాయకులు ఏ స్థాయికి తెగించారో అర్థం చేసుకోవచ్చు. అయినా, కమలం నేతలు ఏం చేసినా, ఎంతగా రెచ్చగొట్టినా, ఎన్ని వలలు విసిరినా ఢిల్లీ ప్రజలు ఏమాత్రం చలించలేదు. తమ నిర్ణయంపై పునరాలో చించలేదు. ఆప్నే తిరిగి ఎన్నుకున్నారు. కమలనేతలకు కర్రుకాల్చి వాతపెట్టి తమ విజ్ఞత చాటుకున్నారు.
కేజ్రీవాలేమీ ప్రజలకోసం మరో ప్రపంచాన్ని సృష్టించలేదు. ఈ వ్యవస్థలో, అందునా ఒక సీఎం స్థాయిలో అది ఎవరికీ సాథ్యం కాదు. ఈ సత్యం ప్రజలకూ తెలుసు. అంతటి ఆశలూ వారికి లేవు. ప్రజలు ఏం కోరుకున్నారంటే- నేత నుండి ప్రజలపట్ల నిజాయితీ కోరుకున్నారు. తనకున్న పరిధిలో, తన శక్తి మేరకు ప్రజల సమస్యలు తీర్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించే ఒక నమ్మకమైన నేతను ప్రజలు కోరుకున్నారు. మనిషి కనీస జీవనావసరాలైన విద్య, వైద్యం, కరెంటు, రవాణా సౌకర్యంలాంటి వాటిమీద కేంద్రీకరించిన నేతగా కేజ్రీవాల్ను జనం ఆదరించారు. కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలో విద్యాప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. ప్రయివేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపలేక లక్షలాదిమంది తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు గొప్ప ఊరటనిచ్చాయి. అలాగే ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించలేని పేదలకు కేజ్రీ ప్రారంభించిన మొహల్లా క్లినిక్స్ తమ ఆరోగ్యానికి భరోసా పెంచాయి. విద్యా, వైద్య రంగాలలో చిత్తశుద్ధితో కూడిన కృషి ఆప్కు ప్రజల హృదయాలలో చోటు కల్పించాయి. అలాగే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వారికి గొప్ప వెసలుబాటునిచ్చింది. ముఖ్యంగా సంపన్నుల ఇండ్లలో, నిర్మాణ రంగంలో తమ ఇండ్లకు దూరంగా ఉన్న పనిచోటుకు వెళ్లి వచ్చే మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని గొప్ప వరంగా భావించారు. అందుకే ఆప్కు మరొక్కసారి అధికారం అప్పగించారు.
బీజేపీ నేతలు తాము గొప్ప అభివృద్ధి సాధించామని ఊదరకొడుతున్నా ఆ అభివృద్ధిని తమ జీవితాలలో ప్రజలు పోల్చుకోలేక పోయారు. నిజానికి మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యాల నేపథ్యంలో కమలనాథులు చెబుతున్న అంత గొప్ప అభివృద్ధినీ ప్రజలు నమ్మలేదు. ప్రజలు తమ కనీస అవసరాలు తీర్చే మార్గాన్ని కోరుకుంటున్నారు. ఆ మార్గంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నా నెమ్మదిగానైనా నడిచి గమ్యం చేరాలనుకుంటున్నారు. అందుకే మాటలు తగ్గించి చేతలలో చిత్తశుద్ధి ప్రదర్శించిన కేజ్రీవాల్ వారికి నచ్చారు. కేజ్రీని జనం మెచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే తన శక్తి మేరకు, చేతనైన మేరకు ఒక ముఖ్యమంత్రిగా చేసి చూపించిన చిత్తశుద్ధే ఆప్కు మళ్లీ అధికారాన్ని కట్టబెట్టింది.
ఢిల్లీ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కమలనాథుల కండ్లు తెరిపిస్తుందనుకోవడం మన భ్రమ. వారు మారరు. ప్రజలే వారిని మార్చాలి. నియంతృత్వ పాలనగా రూపాంతరం చెందుతున్న కష్టకాలంలో దేశ ప్రజలకు ఢిల్లీ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదే! వారి సందేశాన్ని శిరసావహిద్దాం. దేశానికి పట్టిన ఈ మతోన్మాద, నియంతృత్వ పాలకుల పీడ తొలగిద్దాం.