Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ పాలన గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఐఏఎస్లు, ఉన్నతాధికారులకు కలెక్టర్ల సమావేశంలో హితబోధ చేశారు. ప్రభుత్వ ప్రాథమ్యాలే విధులుగా భావించి పనిచేయాలనీ, పంచాయతీరాజ్ సమ్మేళనాలను నిర్వహించాలనీ, వ్యక్తిగత ప్రాధాన్యతలకూ తావులేదంటూ చెప్పుకొచ్చారు. వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా అదనపు కలెక్టర్లను నియమించామంటూ సెలవిచ్చారు. పల్లెల ప్రగతికి ప్రతినెలా రూ.339కోట్లు ఇస్తామని ప్రకటించారు. 25 రోజుల్లో గ్రామాల రూపురేఖలు మారిపోవాలని, లేకుంటే సంబంధిత బాధ్యులపై చర్యలు తప్పవనీ హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు త్వరితగతిన ప్రజలకు చేరడానికీ, మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలుకావడానికి కలెక్టర్ల భేటీలో సీఎం చేసిన దిశానిర్దేశం, హెచ్చరికలూ పరిపాలన కొంత మేర సజావుగా సాగడానికి వీలవుతుంది. అసలూ సమస్యలు క్షేత్రస్థాయిలోనే ఉత్పన్నమవుతున్నాయి. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నుంచే ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సర్కారు అవసరాలకు అనుగుణంగా పనిచేయాలంటూ ఐఏఎస్ల ముందరకాళ్లకు బంధం వేసేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక రకంగా, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మరోలా వ్యవహరించడమే అసలు సమస్య. దీని ప్రభావంతో కలెక్టర్లూ ఇతర ఐఏఎస్ల ఇక్కట్లు అన్నీ, యిన్నీ కావు. చట్టపరిధిలో ప్రజలకు ఏది మంచి అయితే అది చేయాల్సిన కనీస బాధ్యత అఖిల భారత సర్వీసు అధికారులది. శిక్షణా సమయంలోనే వీటిని అవపోసన పట్టిస్తారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తాజాగా తెలుగు రాష్ట్రాలు, కేంద్రంలోని పరిస్థితులు ఒకేలా ఉన్నాయి. రిటైరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకరు తనను కలిసిన రిటైర్డ్ ఐఏఎస్తో 'మీ రోజులు కావివి.. మేం ఏ చొరవా చేయకూడదు.. ఒక్కోసారి సీఎంవో నుంచే డ్రాఫ్ట్ జీవోలు సైతం వచ్చేస్తాయి' అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ అదే జరుగుతున్నదని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి చెప్పారు. పాలకుల తీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదనీ, నియంతృత్వ పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారని ప్రస్తుత ఐఏఎస్లూ ఉన్నతాధికారులూ అసంతృప్తికి లోనవుతున్నారు. ఒకవైపు సర్కారు ప్రాధాన్యతలను అర్థం చేసుకోవాలంటూనే మరోవైపు వ్యక్తిగత పైరవీలతోపాటూ అనుచరగణం పనులు చేయమంటూ ఒత్తిళ్లకు గురిచేస్తారని అంటున్నవారూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఇటీవల ములుగు జిల్లా విషయాన్ని పరిశీలిస్తే నెల రోజుల్లో నలుగురు కలెక్టర్లను ఎందుకు బదిలీ చేసినట్టు? చట్టానికి లోబడి ప్రజలకు ఉపయోగపడే పనులు జరిగేలా చేయడం, వారి ప్రయోజనాలు నెరవేరేలా ఐఏఎస్లు వ్యవహరించాల్సి ఉంటుంది. నిజానికి అలాంటి వ్యవస్థే కావాలి. కానీ, ఆచరణకు వచ్చేసరికి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది ఐఏఎస్ల పరిస్థితి. ఐఏఎస్ల్లోనూ రెండు రకాల మనస్తత్వమున్న వారున్నారు. ప్రభుత్వమేది చెబితే అలా చేసేవారు కొందరైతే, అధికారాలూ స్వేచ్ఛా వాడుకుని పనిచేసేవారు మరికొందరు. తెలుగురాష్ట్రాల్లో జీ హుజూర్ ఐఏఎస్ల సంఖ్యా ఎక్కువే. ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజాకోణంలో విధులు నిర్వర్తించేవారిని ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అప్రధానపోస్టుల్లో నియమిస్తున్నారు. రాజీనామా చేసి ఇటీవల ఏపీకి వెళ్లిన ఆకునూరి మురళి వివాదం కూడా ఈ చర్చకు ఆస్కారమిచ్చింది. ఏపీలో ఏకంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా సెలవులో వెళ్లిన సంగతీ తెలిసిందే. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సహానీ సైతం దీర్ఘకాలిక సెలవులో వెళ్తారనే ప్రచారం ఉంది.
కాశ్మీర్ విషయమై మోడీ సర్కారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా కేరళ యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్, దేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడికి నిరసనగా కర్నాటకకు చెందిన మరో యువ ఐఏఎస్ ఎన్.శశికాంత్ సెంథిల్, అలాగే ఇదే రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి కె.మిట్టల్ సైతం రాజీనామాలు చేశారు. ఇదిలావుండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ధోరణి సరిగ్గా లేదంటూ పీఎంవో ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్ చంద్రశేఖర్ రాజీనామా బాటే ఎంచుకున్నారు. ఆఖరికి ఆర్బీఐ గవర్నర్ సైతం మోడీ ప్రభుత్వ ఒత్తిళ్లకు నిరసనగా వైదొలిగారు. తెలంగాణలో ఈ ఆరేండ్లలో పలువురు ఐఏఎస్ అధికారులు సైతం మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిళ్లూ అవమానాలకూ గురయ్యారు. వరంగల్ అర్బన్, మహబూబాబాద్, నిజామాబాద్, జనగామ, కరీంనగర్ కలెక్టర్లు ఈ తరహా సమస్యల్లో చిక్కుకున్నారు. మహిళా ఐఏఎస్లు సైతం ఇదేరకమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కనీస గౌరవం ఇవ్వకపోవడం, ప్రోటోకాల్ విస్మరించడం, కించపరచడం తదితర చర్యలకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ఫలితంగా ఐఏఎస్ల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వంలో రాజకీయ నాయకత్వమైనా, ఉన్నతాధికారులైనా రాజ్యాంగానికీ చట్టానికీ లోబడి పనిచేయాలి. ఇందుకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలు నియంతృత్వ పోకడలను సూచిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి పెరుగుతున్న ముప్పు. ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయమిది.