Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంటల మార్పిడి విజయవంతం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు ఊపిరిలూదాలి. భూసార పరీక్షలు చేసి నీటి లభ్యతనుబట్టి పంటలేయడం, మార్కెట్ కమిటీల ద్వారా సర్కారే విత్తనాలు సరఫరా చేయడం, రైతులకు విరివిగా రుణాల్విడం, రెండో పంట ఏం సాగుచేయాలో ముందే చెప్పడంతోపాటు కనీస మద్దతు ధరనూ అమలుచేసేలా బాధ్యత వహించాలి.
వ్యవసాయం పండుగ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నది. రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామనీ, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సైతం ఇప్పటికే ఖరాఖండీగా చేప్పేశారు. పంటల విధానం మారాలనీ, తోచిన పంటలేస్తే రైతుబంధు, రుణమాఫీ బంద్చేస్తామని ఒకింత బెదిరింపుధోరణిలోనే సీఎం అల్టీమేటమిచ్చారు. వరి పంటను తగ్గించి వాణిజ్య పంటలవైపు దృష్టి పెట్టాలనేది సర్కారు సూచన. వాస్తవానికి ప్రభుత్వాలు ఇలా చెప్పడం కొత్తేమి కాదు. గతం నుంచే ఈ ప్రయాస జరుగుతున్నది. రైతుల విషయంలో సుద్దులు చెప్పడం, ఆ తర్వాత విస్మరించడం ప్రభుత్వాలకు పరిపాటైంది. అవసరమైన ఆర్థిక సహకారం అంతంతే కావడంతో సాగు యేటేటా నిర్వీర్యమవుతున్నది. నిజమే.. పంటల సాగు విధానం మారాల్సిందే. సాధారణ పద్ధతిలో రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. అప్పుల్జేసి పంట చేతికొచ్చేసరికి వాతావరణ పరిస్థితులు అనుకూలించక, గిట్టుబాటు ధర రాక విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారు. మౌలిక వసతులు కల్పించకుండా ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రణాళికలేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈ దుస్థితి నుంచి రైతులకు మేలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ముఖ్యమంత్రి చెప్పినంత సులభంగా వ్యవస్థలో ఒకేసారి మార్పు రాకపోవచ్చు. చిత్తశుద్ధి, అకుంఠిత దీక్షతోకూడిన ప్రణాళికబద్ధమైన కృషితోనే సాధ్యం. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా తాము చెప్పిన పంటలనే సర్కారు సాగుచేయాలనడం కూడా భావ్యం కాదు. దాదాపు 70 ఏండ్లుగా నా భూమి నా ఇష్టం అనేరీతితో వ్యవసాయం నడుస్తున్నది. ఇప్పుడున్న ఈ విధానానికి చరమగీతం పాడాల్సిందే. ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు మద్ధతు ధర రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో రాజకీయ సంకల్పం కావాలి. శాసనవ్యవస్థ ప్రొత్సాహాం ఇంకా పెరగాలి. ఈ తరుణంలో ఆ మార్పు శాస్త్రీయంగా జరగాలని రైతు సంఘాలు, మేధావులు కోరుకుంటున్నారు. అదే నేపథ్యంలో భారీ యజ్ఞమే చేయాల్సి ఉంటుంది. అధికారులు, శాస్త్రవేత్తలతో కొంతమేర సర్కారు చర్చిస్తున్నది. కానీ, రైతు సంఘాలు, ఆయా రాజకీయ పక్షాలను మాత్రం విస్మరిస్తున్నది. వీరితో చర్చిస్తేనే సంపూర్ణ సరికొత్త వ్యవసాయ విధానం ఆవిష్కృతమవుతుంది. అప్పుడే అనుకున్న ఫలితాలొస్తాయి. తొలుత వ్యవసాయశాఖను ప్రక్షాళన చేయడం. అవసరమైన పోస్టులను భర్తీ చేసి రైతులకు సలహాలు, సూచనలు విరివిగా అందేలా చూడటం, ప్రతియేటా భూసారపరీక్షలు నిర్వహించడం, ప్రత్యేకంగా కార్డులు జారీచేయడం అత్యంత కీలకం. రాష్ట్రంలో 4000 ఎఈవోల పోస్టులను భర్తీచేయడం, ప్రతి మండల కేంద్రంలో ఒక భూసార పరీక్షా కేంద్రం నెలకొల్పడం, అంతేగాక భూములను విభజించి పంటలను ఎంపిక చేయాలనే సూచనలు సంఘాల నుంచి వస్తున్నాయి. పామాయిల్కు కేంద్రం నుంచే 90 శాతం సబ్సీడీలొస్తున్నా, వినియోగించుకోలేక ఏడాదికి రూ. 10 నుంచి 20 కోట్ల మేర నష్టపోతున్నాం. చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించడం ద్వారా ఆ పంటను మరింతగా ప్రొత్సహించడం, అలవికానిచోట అధికులమనరాదన్నట్టుగా భూసారం లేనిచోట పత్తిని ప్రొత్సహించరాదు. మొక్కజొన్న ద్వారా బయోడిజీల్, బిస్కెట్లూ ఉత్పత్తవుతాయి. సోయాబిన్ తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంట. విత్తనాలు పండించే రైతులకు ఆదాయం అధికంగానే ఉంటుంది. కూరగాయలు, ముతక, పప్పుధాన్యాలతోపాటు ఇతరాల విత్తనాలను ఇప్పటికే రాష్ట్రం నుంచి రష్యా, ఈజిప్టు, టర్కీ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. నకిలీ, కల్తీ ఎరువులు, క్రిమిసంహారకాల కారణంగా యేటా మూడు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంటలను కోల్పోతున్నాం. బీటీ విత్తనాలతోనే ఈ నష్టమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారు. అమాయకులు, నిరక్షరాస్యులైన రైతులను ప్రయివేటు విత్తన కంపెనీలు మోసం చేస్తున్నాయి. పంటల మార్పిడి విజయవంతం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు ఊపిరిలూదాలి. భూసార పరీక్షలు చేసి నీటి లభ్యతనుబట్టి పంటలేయడం, మార్కెట్ కమిటీల ద్వారా సర్కారే విత్తనాలు సరఫరా చేయడం, రైతులకు విరివిగా రుణాల్విడం, రెండో పంట ఏం సాగుచేయాలో ముందే చెప్పడంతోపాటు కనీస మద్దతు ధరనూ అమలుచేసేలా బాధ్యత వహించాలి. నిజాం కాలం నుంచే కౌలురైతులున్నారు. 12 లక్షల మందిగా ఉన్న వీరిని, వాస్తవసాగుదార్లుగా గుర్తించి ఆదుకోవాలి. అక్కరకురాని చుట్టమెందుకన్నట్టు, ఇప్పుడున్న వ్యవసాయ ప్రణాళికలు ఎందుకు పనికిరాని గుళికలేననే సంగతిని సర్కార్ గుర్తించాలి. గత ఏడాది రుణ ప్రణాళికలో రూ. 48 వేల కోట్లు ఇస్తామనీ చెప్పి, కేవలం రూ. 22 వేల కోట్లు మాత్రమే విదిల్చారు. 60 లక్షల మందికి అందాల్సిన రుణాలు, 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. ఈ దిశగా పూర్తిస్థాయిలో సోమవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించాలి. అందరితో సంప్రదింపులు చేశాకే నూతన వ్యవసాయ విధానాన్ని ఖరారు చేయాలనే సలహాలు, సూచనలు రైతు సంఘాల నుంచి వస్తున్నాయి.