Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక ప్రయోజనాల విషయానికొచ్చేసరికి మత ఏకత్వ భావన మొదటి ముద్దాయి. హిందూత్వ నిర్మాణమే ఒక ఆధిపత్య రంగస్థలి. అణగారిన జనాలను మాత్రమే బలి తీసుకునే బలిపీఠం. ఇప్పటికైనా, సకల పీడితులూ కండ్లు తెరవాలి. మతం పేరుతో సాగుతున్న మాయా నాటకానికి తెరదించి, మానవీయత కేంద్రంగా మరో చరిత్రకు శ్రీకారం చుట్టాలి!
పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన వేట తీరు మారదు! - కరోనా నేపథ్యంలో ఇప్పుడు రెండు పాలక విధానాలు మున్నెన్నడూ లేనంతగా చర్చనీయాంశమవుతున్నాయి. అవి: 1. కేంద్ర పాలక విధానం 2. కేరళ పాలక విధానం. కేంద్ర పాలక విధానానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కేరళ పాలక విధానానికి కేరళలోని సీపీఐ(ఎం) సారథ్యంలోని వామపక్ష ప్రభుత్వం ప్రతినిధులుగా ఉన్నాయి. కేంద్ర, కేరళ ప్రభుత్వాలు కరోనా కట్టడి చేసిన వైనం, కట్టడి సమయంలో కష్ట జీవులను ఆదుకున్న తీరు, చేకూరిన ఫలితాలు, సంభవించిన నష్టాలు ఈ రెండు విధానాలలోని తేడాను మాత్రమే కాక, కష్టజీవులకు కమ్యూనిస్టు విధానం యొక్క ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నాయి.
కేంద్రం చర్యలు కరోనా వ్యాప్తినీ, తద్వారా ఎదురవుతున్న సామాజిక, ఆర్థిక సంక్షోభాలనూ కట్టడి చేయకపోగా, మరింత పెంచేందుకే దోహదం చేస్తున్నాయి. 'పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు' ఆరోగ్య సంక్షోభంలోనుంచి ఆకలి సంక్షోభంలోకి జారిపోతున్నది దేశం. సంక్షోభ నివారణకు కేంద్ర పాలకులు తగు చర్యలు తీసుకోవడం లేదు సరికదా, మరింతగా ముదిరేందుకు సహకరి స్తున్నారు. ఇందుకు కారణమేమిటి? దేశ ప్రజల ధన, మాన ప్రాణాలకు పూచీ పడుతామని ప్రమాణం చేసిన పాలకులు ఇంత పాశవికంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? ఒక్క మాటలో సమాధానం చెప్పుకోవాలంటే, - సంక్షోభాలను కూడా ఒక ఆదాయ వనరుగా భావించే బూర్జువా పాలకవర్గ ఆలోచనా విధానమే ఇందుకు కారణం. అవును! బూర్జువా ఆలోచనా విధానం ప్రజల గురించి ఆలోచించదు. ప్రజలకు బాధ్యత వహించదు. అది కేవలం పిడికెడు మంది పెట్టుబడిదారుల గురించే కలవరిస్తుంది. వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పెట్టుబడిదారుల అనుకూల నిర్ణయాలు కచ్చితంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి, ఆ నిర్ణయాల ద్వారా ప్రజలు మరింత దోపిడీకి, పీడనకు, వంచనకు గురికావడం అనివార్యమవుతుంది. నిజంగా ఇది 'పులులు- మేకల' వ్యవహారం. కేంద్రంలో కొలువు దీరిన కాషాయ ప్రభుత్వం పులుల కోసం, పులులతోటి కొలువు దీరిన పులుల ప్రభుత్వం కాబట్టి దాని నిర్ణయాలు ఏకకాలంలోనే కాదు, ఏ కాలంలోనూ ఇరుపక్షాలకూ న్యాయం చేయడం అసంభవం. ఈ సత్యాన్ని ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న మానవ మాతృలు భరించలేని భయంకర అనుభవాలే మనకు చాటి చెబుతున్నాయి.
మరోవైపు కరోనాను కట్టడి చేయడంలో, కరోనా పూర్వ పరిస్థితులను పునరుద్దించడంలో కేరళ ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి, పడిన కఠోర శ్రమ, ప్రదర్శించిన ప్రజల ఎడల ప్రేమతో కూడిన బాధ్యతా ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శమైంది. మహమ్మారికి మందు లేకపోవచ్చు. కానీ కట్టడికి మార్గముందని కేరళ ఆచరణాత్మకంగా రుజువు చేసింది. ఆ కట్టడి మార్గంలో 'ప్రభుత్వం - పార్టీ - ప్రజల'తో కూడిన సామాజిక సైన్యాన్ని ముందుకు నడిపి, మహమ్మారికి ముకుతాడు వేసే మానవీయ పాలన ఎలా ఉంటుందో, కమ్యూనిస్టు విధానంలోని సమానత్వ ఫలితమేమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. మహమ్మారిని అదుపులో పెట్టి మళ్లీ ఎప్పటిలా ప్రజలను జీవన యాత్రలో నిమగం చేయగలుగుతోంది.
నిజానికి కరోనాను కట్టడి చేసేందుకు కావాల్సిన వనరులు, సాధనాలు, అధికారాలు ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో, పార్టీగా భారతీయ జనతా పార్టీ చేతిలో అత్యధికంగా ఉన్నాయి. తమ పార్టీ సభ్యత్వం పది కోట్లకు మించి పోయిందని బీజేపీ ఘణంగా ఊదర గొడుతోంది. మరి అంతటి కార్యకర్తల సైన్యం ఈ కరోనా కాలంలో ఏ కలుగులో దూరింది? ఇక బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు (ఆర్ఎస్ఎస్) ఎందుకని ఇంతటి విపత్తు కాలంలో వెన్ను చూపి మిన్నకుండిపోయింది. చేతిలో 'కర్ర', వంటిపై ఖాకీ, కాషాయ వస్త్రాలు లేకపోయినా దేశం నలుదిక్కులా నడిరోడ్లపై 'మార్చ్' చేస్తున్న వారిలో మెజారిటీ హిందూవులు, గంగ సింధు బిందువులే కదా..! మరి ఎందుకని వేషాన్ని చూసైనా పచ్చి మంచి నీళ్ళతో గొంతులు తడపలేకపోతున్నారు? ఎక్కడికెళ్ళింది హిందూ సమభావం? సామరస్యతా సారం? అసలు, ఇన్ని కష్టాలకూ కారణం వీరి కమల పాలకులే కదా? ప్రజల జీవితాలతో ఇలా ఆడుకొమ్మని వారిని వీరే ఆజ్ఞాపించారా? లేక మీ అనుంగు సోదరులైన పెట్టుబడి దారుల మాట జవదాటకండని ఆదేశించారా? ఏదైతేనేం.. సంఫ్ుపరివార్ సారథ్యంలోనే ఈ సామూహిక దండన యాగం సాగుతున్నదన్నది సత్యం. ఈ దండన యాగంలో సామాన్య హిందువులే మొదటి సమిధలు! బలవంతపు బలిపశువులు. అవును! ఆర్థిక ప్రయోజనాల విషయానికొచ్చేసరికి మత ఏకత్వ భావన మొదటి ముద్దాయి. హిందూత్వ నిర్మాణమే ఒక ఆధిపత్య రంగస్థలి. అణగారిన జనాలను మాత్రమే బలి తీసుకునే బలిపీఠం. ఇప్పటికైనా, సకల పీడితులూ కండ్లు తెరవాలి. మతం పేరుతో సాగుతున్న మాయా నాటకానికి తెరదించి, మానవీయత కేంద్రంగా మరో చరిత్రకు శ్రీకారం చుట్టాలి!