Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి జీవితంలో పేరుకొనిపోయిన కొన్ని భ్రమల్ని చెరిపేసుకోగలిగితేనే మహోన్నత వ్యక్తిత్వం సంతరించుకుంటుంది. అలాంటి వారే ప్రత్యేకత గల వ్యక్తులుగా ఆవిష్కృతులవుతారు. పరిపూర్ణులుగా ఎదుగుతారు. ఇలా జరుగుతుందో లేదో ఒక్కసారి ఒకే ఒక్కసారి నిజాయితీతో ఆత్మావలోకనం చేసుకుందామా...
ఆటంటే క్రికెట్.. చదువంటే బీటెక్.. ఉద్యోగమంటే అమెరికా ఉద్యోగమేనా..? అంటారు సహస్రావధాని రాళ్లబండి కవితా ప్రసాద్. ఈ మూడింటి మధ్యనే మనిషి పరిభ్రమిస్తూ.. ఇతరులను పరిభ్రమింపజేస్తూ వాటికై నిత్యం ఆరాటపడుతున్నారని వివరిస్తారు. నిజానికి ఎంతోమంది తల్లిదండ్రుల మనసులు కూడా వీటిచుట్టే తిరుగాడుతూ పిల్లలనూ ఆ చట్రంలోకి లాగుతున్న వైనాలు అనేకం. అందుకే సామాజిక విలువలుగానీ, బాధ్యతగానీ, ఆలోచనలుగానీ కొరవడి ఎదుగుదలకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నది.
ఎంసెట్టూ ఈసెట్టూ ఆసెట్టూ.. పేర్లెన్నయినా లక్ష్యం ఒక్కటే! వాటిని పూర్తిచేయాలి. విమానాలెక్కి లక్షల్లో సంపాదన ఉండే ఉద్యోగాన్ని పట్టాలి. ఊహ తెలిసిన నాటినుంచీ డబ్బే ధ్యాసగా పిల్లలను ఈ విధంగా ప్రభావితం చేసే ప్రపంచీకరణ.. సమస్త మానవీయ విలువలను ఏ మాత్రం సహించడం లేదు. సమాజంలో సగటు పౌరుని బాధ్యతను తెలియజెప్పకపోవడం.. సామాజిక అవగాహన కల్పించకపోవడం.. తెలివిమాలిన పనులుగా మారిపోవడం వైచిత్రి! మెదడుకు పదును పెట్టాల్సిన దశ నుంచే సంపద వలయంలో విద్యార్థులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న సందర్భం.. వెరసి యువకుల ఆలోచనాశక్తి కూడా తమ మస్తిష్క పరిధి దాటి బయటకు రాలేని విషాద పరిణామం. మరి ఇదేనా జీవితానికి కావాల్సింది? ఇంతేనా పెద్దలు కోరే సార్థకత? వాటిని సమకూర్చుకుంటే అన్నీ సాధించినట్టేనా..? కచ్చితంగా కాదు! మరి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? అన్నిరంగాల్లో ప్రభావితం చెందినప్పుడు మాత్రమే అది సమకూరుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తల్లి ఒడినుంచే పరిపూర్ణత మొగ్గలు తొడగాలి. నీతిసూత్రాలైనా, ఇతిహాసాలైనా, కథలైనా ఇంటి గడప నుంచే మొదలవ్వాలి. సమాజంలో ఎలా జీవించాలో గురువు నుంచి అభ్యసించాలి. చదువుకుతోడు క్రీడలు, కళలు, సాంస్కృతిక విషయాల్లో ప్రవేశించి వాటిని ఆస్వాదించే గుణాన్ని అలవర్చాలి. అప్పుడే ఒక వ్యక్తి పరిపూర్ణతనొంది ఇతరుల పట్లగానీ, సంఘంలోగానీ బాధ్యతగా మసులుకుంటాడు.
కలువలూ తామరలూ పుట్టేది కూడా బురదలోనే. అవి నెమ్మదిగా పైకెదుగుతూ ఉంటే వాటికోసం సూర్యచంద్రులు ఎదురుచూస్తూ ఉంటారు. బయటకు రాగానే సూర్యచంద్రుల కాంతితో అద్భుత పుష్పాలుగా ఎదుగుతాయి. అందంగా వికసిస్తాయి. పరిమళాలు వెదజల్లుతాయి. కానీ మెడలోకి చేరే పూలమాలల్లో ఎక్కడా ఆ పుష్పాల కనువిందు కనబడదు. వాటి మాట వినబడదు. మనిషీ అంతే..! ఎక్కడ పుట్టాడు? ఏ విధంగా పెరిగాడు? అన్నది విషయమే కాదు. ఎక్కడికి చేరాడు.. ఏ శిఖరాన్ని అధిరోహించాడన్నదే ప్రధానం. 'భయంతో ఏ పనిచేసినా సాధించలేము. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్నిస్తుంది' అంటారు స్వామి వివేకానంద. అందుకే మానవునిలో పరిపూర్ణతను వెలికితీసి ప్రకటించే విద్య అవసరమంటారు. పరిపూర్ణ మానిషిగా ఎదగడానికి ఈ తరహా విద్యకు మిక్కిలి ప్రాధాన్యత దక్కినప్పుడే ఏ సమాజమైనా అభివృద్ధి సాధిస్తుంది. ఆ విధంగా ఎదిగితేనే సమాజం పట్ల బాధ్యతతో, సామాజిక స్పృహతో వ్యవహరిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారు. ఇప్పటికే చైనా, రష్యా తదిరత సోషలిస్టు దేశాల్లో యువ సంపద అన్నిరకాల సేవలకు సంసిద్ధమై ఉంటుంది. అటువంటి దేశాల్లో విద్య పుస్తకాలకే పరిమితం చేయకుండా విద్యార్థులను వ్యవసాయ, పారిశ్రామిక క్షేత్రాలకు పంపుతుంటారు. కార్మికుల కష్టాల్ని కండ్లారా చూసి, దాన్ని అనుభవించేలా వారిలో బోధన, అధ్యయనాన్ని తీర్చిదిద్దుతారు. తత్ఫలితంగా చదువుతో పాటు కార్మికుడిగా, కర్షకుడిగా రాటుదేలి దేశాభివృద్ధికీ.. ఒకరకంగా పరిపూర్ణ మానవత్వమూర్తిగా పరిణతి చెందుతాడు. అందుకే కాబోలు! మేధోసంపత్తి దేశాలుగా అవి ప్రపంచకీర్తిని మూటగట్టు కున్నాయి. నలుదిశలా అపార సేవల్ని విస్తరింపజేశాయి.
ఇజ్రాయెల్లాంటి దేశాల్లోనూ ఒక యువకుడిని కొన్నేండ్ల పాటు సైనికుడిగా సరిహద్దులకు పంపుతారు. అందుకే విద్యా ఉద్యోగంతో పాటు సమాజసేవ చేస్తూ సామాజిక బాధ్యతలో కూడా అక్కడి యువత పాలుపంచుకుంటుంది. ఇటువంటి సార్వజనీన విద్యాభివృద్ధిని పాదుగొల్పితేనే యువత పటిష్టంగా రూపుదిద్దుకుంటుంది. అన్నిరంగాల్లో శాస్త్రీయ దృక్పథం, సామాజిక చైతన్యం ప్రతిఫలించాలి. ఈ వివేచన లేకపోతే సాంకేతికంగా ఎంత ఎదిగినా ఆచరణ యోగ్యం కాదు. ప్రతిక్షణం లక్షలాది మంది జన్మిస్తుంటారు. మరణిస్తుంటారు. వారంతా జనన, మరణాల లెక్కల వరకే పరిమితం. కానీ మనిషి జీవితంలో పేరుకొనిపోయిన కొన్ని భ్రమల్ని చెరిపేసుకోగలిగితేనే మహోన్నత వ్యక్తిత్వం సంతరించుకుంటుంది. అలాంటి వారే ప్రత్యేకత గల వ్యక్తులుగా ఆవిష్కృతులవుతారు. పరిపూర్ణులుగా ఎదుగుతారు. ఇలా జరుగుతుందో లేదో ఒక్కసారి ఒకే ఒక్కసారి నిజాయితీతో ఆత్మావలోకనం చేసుకుందామా...