Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్, చైనా మధ్య శాంతి ఈ రెండు దేశాలకే గాక ప్రపంచ ఆర్థికాభివద్ధికి కూడా అత్యంతావశ్యకం. అమెరికా ఉచ్చులో చిక్కుకోకుండా మోడీ ప్రభుత్వం వివేచనతో వ్యవహరించాలి. ఇరు దేశాల ఉన్నత స్థాయి కమాండర్ల సమావేశం నుంచి సానుకూల సంకేతాలు వెలువడడం ఆహ్వానించదగినదే. ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న రీతిలో కాకుండా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు చిత్తశుద్ధితో ముందుకు సాగాలి.
భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆసియా ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్నది అమెరికా వ్యూహం. పుష్కర కాలంగా పట్టి పీడిస్తున్న ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం, నిరుద్యోగం ఇదివరకెన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరుకోవడం, జాతి వివక్షపై హౌరెత్తిన నిరసనలతో దిక్కుతోచని స్థితిలో పడ్డ ట్రంప్ ప్రభుత్వం వీటి నుంచి అమెరికన్ల దృష్టి మళ్లించేందుకు ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడు తున్నది. భారత, చైనా సరిహద్దుల్లో జూన్ 15నాటి ఘర్షణలో అమెరికా ప్రమేయం ఉన్నా, లేకున్నా, దానిని సాకుగా చూపించి దేశమంతటా 'చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టడం వెనుక అమెరికా ప్రోద్బలం లేకుండాపోలేదు. కరోనా మహమ్మారిపై పోరులో అంతర్జాతీయ సహకారం, సంఘీభావం అత్యంతావశ్యకమైన ఈ తరుణంలో అమెరికా మోర విరుచుకుని తన విచ్ఛిన్నకర ఎజెండాతో ముందుకు వస్తున్నది. కరోనాపై పోరులో ప్రపంచ దేశాలు తలమునకలై ఉండగా, అమెరికా మాత్రం వెనెజులా, క్యూబా, ఇరాన్లపై ఆంక్షలు తీవ్రతరం చేస్తూ అక్కడి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. పాలస్తీనా వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయిల్ దురాక్రమణ చర్యలకు బాహాటంగా వంత పాడుతున్నది. కరోనా నుంచి కోలుకుని వడివడిగా అభివృద్ధి వైపు అడుగులేస్తున్న చైనాను దెబ్బ తీసేందుకు అగ్రరాజ్యం వేయని ఎత్తు లేదు. ప్రస్తుతం ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఎక్కడ తనను అధిగమిస్తుందోనన్న భయంతో ఆ దేశానికి వ్యతిరేకంగా ఇండో పసిఫిక్ వ్యూహాన్ని తీసుకొచ్చింది. చైనాను దెబ్బ తీయడమే లక్ష్యంగా చేసుకున్న ఈ వ్యూహంలో భారత్ను అది పావుగా వాడుకుంటున్నది. చైనాకు వ్యతిరేకంగా ఆర్థిక, వాణిజ్య, దౌత్య, సైనికపరమైన దాడులను అమెరికా ముమ్మరం చేస్తున్నది. మూడు యుద్ధ విమాన వాహక నౌకలను పశ్చిమ పసిఫిక్కు పంపడం, హ్యువెయిపై నిషేధం విధించాలని తన మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచడం, హాంకాంగ్లో అల్లర్లను, అరాచకాన్ని ప్రేరేపించడం ఈ వ్యూహంలో భాగమే. భారత్లో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కొన్ని శక్తులు నానా యాగీ చేయడాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. జాతీయ దురభిమానాన్ని ప్రజల్లో రెచ్చగొట్టి దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలనేది హిందూత్వ శక్తుల ఆలోచన. సరిహద్దు సమస్యపై ప్రధాని చేసిన ప్రకటన, అనంతరం పీఎంఓ ఇచ్చిన వివరణ, మంత్రుల ప్రకటనలు పరస్పర విరుద్ధంగాను, గందరగోళానికి దారి తీసేవిగా ఉండడానికి కారణమిదే. పసిఫిక్ వ్యూహం పేరుతో చైనాకు వ్యతిరేకంగా భారత్ను నిలిపేందుకు అమెరికా చేస్తున్న యత్నాలకు నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బాహాటంగానే మద్దతు పలుకుతున్నది. మోడీ ప్రభుత్వం అమెరికాతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవడంపై పెట్టిన శ్రద్ధ ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలను మెరుగుపరచుకోవడంపై పెట్టడంలేదన్నది నిర్వివాదాంశం. ఇటీవల నేపాల్తో తలెత్తిన సరిహద్దు వివాదం సమసిపోకముందే చైనాతో గాల్వాన్లో వివాదం, ఇంతలోనే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య విభేదాలు భగ్గుమనడం, దక్షిణ చైనా సముద్రంలో డయాయూ దీవులపై చైనాతో కయ్యానికి జపాన్ యత్నిస్తుండడం ఇవన్నీ కాకతాళీయంగా జరుగుతున్నాయని అనుకోలేం. అమెరికా ప్రపంచాధిపత్య వ్యూహంలో భాగంగానే ఈ ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నది. ఏ రెండు దేశాలు కలసి సఖ్యతగా ఉండడం అమెరికాకు ఎంతమాత్రమూ ఇష్టముండదు. దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు ఉంటేనే అమెరికా ఆయుధాలు అమ్ముడుపోతాయి. అందుకే అది శాంతికి శత్రువు. అమెరికాకు భారత్ సన్నిహితమవుతున్న కొద్దీ ఇరుగుపొరుగు దేశాలతో దాని సంబంధాలు ఇదివరకెన్నడూ లేనంత అథమ స్థాయికి పడిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే శాంతికి మారు పేరైన ఆసియాలో దీనికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదముంది. అమెరికాతో సంబంధాలు ఉండరాదని ఎవరూ అనరు. కానీ, అమెరికాకు భారత్ను ఉపగ్రహంగా మార్చాలని చూడడమే అభ్యంతరకరం. ఇరుగుపొరుగు దేశాలతో మనకు గల మైత్రిని పణంగా పెట్టి అమెరికా ప్రయోజనాల కోసం పాకులాడడంలో అర్థం లేదు. చైనాతో గాల్వాన్ వద్ద తలెత్తిన సరిహద్దు ఘర్షణను ఆసరాగా చేసుకుని రెండు దేశాల మధ్య అగాథాన్ని పెంచాలని అమెరికా చేస్తున్న యత్నాలకు చెక్ పెట్టాలి. జనాభా పరంగానే గాక, అణ్వస్త్ర పరంగా కూడా కీలకమైన భారత్, చైనా మధ్య శాంతి ఈ రెండు దేశాలకే గాక ప్రపంచ ఆర్థికాభివృద్ధికి కూడా అత్యంతావశ్యకం. అమెరికా ఉచ్చులో చిక్కుకోకుండా మోడీ ప్రభుత్వం వివేచనతో వ్యవహరించాలి. ఇరు దేశాల ఉన్నత స్థాయి కమాండర్ల సమావేశం నుంచి సానుకూల సంకేతాలు వెలువడడం ఆహ్వానించదగినదే. ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న రీతిలో కాకుండా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు చిత్తశుద్ధితో ముందుకు సాగాలి.