Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భవిష్యత్ చరిత్రకారులు ఈ ఆరేండ్లలో ఎమర్జెన్సీ పెట్టకుండానే మన దేశ ప్రజాస్వామ్యం ఏ విధంగా ధ్వంసం చేయబడిందో అధ్యయనం చేస్తే ఇందులో సుప్రీం కోర్టు పాత్ర, మరీముఖ్యంగా చివరి నలుగురి ప్రధాన న్యాయమూర్తుల పాత్ర తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి'' అని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ తాజాగా చెప్పిన అంశం న్యాయవ్యవస్థ దురవస్థను కండ్లకుకడుతోంది.
''కాబోలునిది బ్రహ్మరాక్షస్స మూహంబు...
కాబోలునిది పిశాచి బాంధవశ్రేణి'' ఆహా! జాషువా, ఏమి ఊహించావయ్యా! మోడీ పాలనను!
జూన్ నెలలో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన శక్తులకు ఆ చీకటి రోజులు గుర్తుకు రావడం సహజం. అయితే, తాము స్వయంగా చీకటి దూతలైయుండి, పైగా ధగధగ్గాయమానమైన ధవళకాంతుల్లో నిలబడ్డ బీజేపీ నేతలు 45ఏండ్ల క్రితం 'చీకటి' రోజులపై నిరసనలు తెలపడం 21వశతాబ్దపు జోకేే! ఆనాడు జయప్రకాష్ నారాయణ్తో సహా వివిధ పార్టీల నేతలు, అనుయాయులు లక్షమంది జైళ్ళలో నిర్బంధించబడ్డారు. పెద్ద సంఖ్యలో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. లోక్సభలో సీపీఐ(ఎం) పక్షనేత జ్యోతిర్మయిబాసును సైతం జైల్లో గొలుసులతో బంధించి పెట్టారు. ఆర్టికల్ 14, 21, 22 వంటివి రద్దై ప్రజల ప్రాథమిక హక్కులు హరించివేయబడ్డాయి. పత్రికల గొంతు నులిమారు. 'మీసా'లు 'నాసా'లు పదునుదేలినాయి. భారత ప్రజాస్వామ్యం కరిమింగిన వెలగపండైంది. పై పెంకును మిగిల్చింది ఇంధిరాగాంధీ ఆనాడు.
స్వాతంత్య్రానంతర 28ఏండ్ల పెట్టుబడిదారీ -భూస్వామ్య పాలనలో తన వర్గం నుంచే వచ్చిన సవాలుకు పాలకపార్టీ ప్రతిస్పందనన ఆ ఎమర్సెన్సీ.
నేడు లోక్సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. బోలెడన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలనో, మిత్రుల పాలనో, ''ప్రచ్ఛన్న మిత్రుల'' పాలనో ఉంది. మోడీ కనుసన్నల్లో బతికేందుకు వివిధ రాజకీయపార్టీలు వెంపర్లాడుతున్నాయి. బహుశా ''సూత్రధారి'' వేగంగా వేళ్ళు కదిలించి ''వాషింగ్టన్ ఏకాభిప్రాయ'' సాధనలో భాగంగా 'తోలుబొమ్మలన్నింటి'నీ ఏకతాటిమీదకు తెచ్చినట్టున్నాడు.
ఈ విధానాలను గత ముప్పైయ్యేండ్లుగా ప్రతిఘటిస్తున్న వామపక్షాలు కూడా రాజకీయంగా బలహీనపడ్డాయి. మరి ఏ సవాళ్ళున్నాయని ప్రస్తుత చీకట్లు? ప్రజా ఉద్యమాల నిర్వాహకుల మనసులను తొలుస్తున్న ప్రశ్న ఇది. సరళీకరణ విధానాల అమలులో దేశంలోని పాలకపార్టీలన్నింటి వైఖరి ఒకటే అయినప్పుడు గుత్తపెట్టుబడి లాభాలరేటు తగ్గకుండా అందరూ కలిసి కావలికాయడం వారి ''విద్యుక్తధర్మం''! సర్వశక్తివంతుడైన పాలకుడి కోసం సాగిన వేట సర్వశ్రీ దామోదర్భారు నరేందర్మోడీ దగ్గర ఆగింది. 2014లో ఆయనతో పాటు గుజరాత్ నుంచి చీకట్లు కూడా దిగుమతై దేశంలో విస్తరించాయి.
పాలన ప్రారంభమైన మొదటి రోజు నుంచే కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపే పనిలో ఈ ప్రభుత్వమున్నది. నేడు కరోనా పెట్టుబడిదారుల పాలిట ''అదృష్ట'' దేవతైంది. గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీస్ రెండేండ్ల పాటు ఆ రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్లను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నది. 2018-19లోనే దినసరి వేతనం రూ.178కి తగ్గరాదని మోడీ పెట్టుబడిదార్లకు ''తాఖీదు'' ఇచ్చారు. అంటే నెలకి రూ.4628 వేతనంతో ప్రస్తుత ధరల్లో ఒక మనిషి ఎలా బతుకుతాడో ఆయనకే తెలియాలి. ఇప్పుడు కరోనా మాటున బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కార్మిక చట్టాలన్నింటిని 3ఏండ్లు వారి రాష్ట్రాల్లో అమలు చేయకుండా జీఓలు తెచ్చారు. దాదాపు 40కోట్ల మంది కార్మికుల జీవితాలను చీకట్లపాలు చేసిన చర్యలివి. వీటన్నిటికీ మించి ప్రపంచం విస్తుపోయిన ఘటన మన వలస కార్మికులది. మార్చి 24న నాలుగు గంటల వ్యవధిలో దేశాన్ని అష్టదిగ్బంధనం చేసిన మోడీ సుమారు 11 కోట్ల కార్మికుల జీవితాల్లో నింపింది గాఢాంధకారం తప్ప మరేంటి?
గత ఎమర్జెన్సీలో దేశంలో అనుభవంలోకి రానిది, మోడీ కుర్చీ ఎక్కిన మరుక్షణం నుంచి అమల్లోకొచ్చినది వలసపాలనకు గుర్తుగా మిగిలిపోయిన 1870 నాటి రాజద్రోహ చట్టం. మహాత్మాగాంధీ, తిలక్ వంటి వారిని రాజద్రోహ కేసులో ఇరికించారు. విచారించారు. శిక్షించారు. దానికి కారణాలుండేవి. కానీ, మోడీ యుగంలో కారణాలతో పనిలేదు. 2014 నుంచి 2018 వరకు 233 మందిపై 'రాజద్రోహం' మోపబడింది. పౌరసత్వ సవరణను వ్యతిరేకించిన 3000మందిపై రాజద్రోహం కేసు, భూసమస్యపై పోరాడిన 3300మంది రైతులపై'రాజద్రోహం' కేసు! అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 'రాజద్రోహం'. గుజరాత్ ముఖ్యమంత్రిని మార్చబోతున్నారన్న వార్త ప్రచురించిన పత్రిక సంపాదకుడిపై 'రాజద్రోహం' కేసు! దీంతోపాటు యూఏపీఏ, టాడా, పోటా చట్టాలు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.
ఎమర్జెన్సీ 2.0లో కీలకమైంది మీడియా మీద సంపూర్ణ అజమాయిషీ. ఎమర్జెన్సీ 1.0లో పత్రికలపై నిషేధం. నేడు మీడియా మోడీ-షా ద్వయం కనుసన్నల్లో బతకాల్సిందే. మీడియా మేనేజ్మెంట్లను ఆర్థికంగా లొంగదీసుకుంటున్నారు.
న్యాయవ్యవస్థ ప్రభుత్వ చెప్పుచేతల్లో నడవడం నేటి దుస్థితికి మరో నిదర్శనం. న్యాయమూర్తులతో ప్రభుత్వం నడిపిన 'క్విడ్ ప్రోకో' విధానం గొగోరు వ్యవహారంతో నగంగా బయటపడింది. ''భవిష్యత్ చరిత్రకారులు ఈ ఆరేండ్లలో ఎమర్జెన్సీ పెట్టకుండానే మన దేశ ప్రజాస్వామ్యం ఏ విధంగా ధ్వంసం చేయబడిందో అధ్యయనం చేస్తే ఇందులో సుప్రీం కోర్టు పాత్ర, మరీముఖ్యంగా చివరి నలుగురి ప్రధాన న్యాయమూర్తుల పాత్ర తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి'' అని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ తాజాగా చెప్పిన అంశం న్యాయవ్యవస్థ దురవస్థను కండ్లకుకడుతోంది.
''ది హెల్ ఈజ్ ఎమ్టీ, ఆల్ ది డెవిల్స్ ఆర్ హియర్'' అని 'ది టెంపెస్ట్'లో షేక్స్పియర్ చెప్పింది నేటి మన దేశానికి బాగానప్పుతుంది.