Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రమాదంలో ఉన్నది తమ ప్రాణాలు మాత్రమే కాదు, ఈ దేశ ప్రజాస్వామ్యమని హెచ్చరిస్తోంది జయరాజ్, బెన్నిక్స్ల బలిదానం. అందుకే మనదాకా వచ్చేదాకా అన్యాయం అన్యాయంగా, అరాచకం అరాచకంగా కనిపించకపోవటం నుంచి బయటపడాలి పౌరసమాజం. అప్పుడే పౌర హక్కులకు రక్షణ, ప్రజాస్వామ్యానికి మనుగడ.
''పుండు చేయటమే కాదు.. నిర్దయగా దానిమీద కారమూ చల్లుతోంది కాలం. జనం ఏమైపోవాలె. ఈ విలవిలల్ని ఎట్లా భరించాలె'' అంటాడు ప్రముఖ కవి, విమర్శకుడు లక్ష్మీ నర్సయ్య. ఈ వ్యాఖ్యలు ఎంత అక్షరసత్యమో నిరూపిస్తోంది తూత్తుకుడి సంఘటన. తమిళనాడులోని తూత్తుకుడిలో జయరాజ్, బెన్నిక్స్ అనే తండ్రీ కొడుకులిద్దరినీ మలద్వారాల్లో లాఠీలు చొప్పించి, రక్తాలు కారేలా చిత్రహింసలు పెట్టి చంపేశారు పోలీసులు. నెత్తురోడుతున్న ఆ బాధితుల దేహాలను చూసి కూడా వారిని ఆస్పత్రికి కాకుండా కారాగారానికి పంపింది న్యాయస్థానం. ఈ మరణాలకు కారణం వారి ఆరోగ్య సమస్యలే తప్ప పోలీసుల చిత్రహింసలు కాదని గుడ్డిగా నిర్ధారించింది ప్రభుత్వం. హృదయవిదాకరమైన ఈ సంఘటన పూర్వాపరాలను చూస్తోంటే.. నిప్పంటుకున్న ఇంటిమీద పిడుగుపడ్డట్టూ, చెదపట్టిన చెట్టుమీద గొడ్డలి వేటు పడ్డట్టూ లేదూ..! అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అనే అనుమానం రాదూ..!!
ఇంతకీ ఆ తండ్రీ కొడుకులు చేసిన నేరమేమిటి? కరోనా కట్టడిలో భాగంగా విధించిన ఆంక్షల నేపథ్యంలో తమ దుకాణాన్ని సకాలంలో మూసివేయలేదనే కారణంగా పోలీసుల చెరజిక్కాడు తండ్రి జయరాజ్. తండ్రికి ఏమైందో తెలుసుకోవడానికి పోలీస్స్టేషన్కు వెళ్లాడు కొడుకు బెన్నిక్స్. అదీ వారు చేసిన నేరం. ఆ మాత్రానికే వారు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంతకు మించిన అవమానాల్నీ, చిత్రహింసల్నీ భరించాల్సి వచ్చింది. ఈ అమానవీయ ఘటన పట్ల తమిళ సమాజం నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నా... ఎమర్జన్సీ చీకటి రోజుల్లో హననమైన మానవహక్కుల గురించి అధికారపీఠాలపై కూర్చుని మననం చేసుకుంటున్న మాన్యులెవ్వరూ స్పందించకపోవడం వారి అసలు స్వరూపానికి అద్దంపడుతోంది. కానీ మరణానికి ముందు ఆ తండ్రీ కొడుకులు అనుభవించిన నరకయాతనకు దేశం చలించిపోతోంది. పోలీసుల అధికారమదానికీ, సామాజిక దురహంకారానికీ ప్రజాస్వామ్యం తలదించుకుంటోంది.
కోవిల్పట్టి సబ్జైలులో బాధితులిద్దరినీ పరీక్షించిన వైద్యుల నివేదిక చూస్తే అర్థమవుతుంది.. వారు మాటల్లో చెప్పలేని హింసను అనుభవించారని. వారు ప్రాణాపాయంలో ఉన్నారనీ, వారి మర్మావయల్లో, మలద్వారాల్లో తీవ్రమైన గాయాలున్నాయనీ ఆ నివేదిక వెల్లడించాకగాని ప్రపంచానికి తెలియలేదు... పోలీసులు ఎంతటి నరరూప రాక్షసులుగా వ్యవహరించారో..! ఆ తరువాత వారిని ఆస్పత్రికి తరలిస్తే మాత్రం ఏం ప్రయోజనం? అప్పటికే చివరి గడియల్లో ఉన్న ఆ తండ్రీ కొడుకులిద్దరూ ఒకరి తరువాత ఒకరు ప్రాణాలొదిలారు.
శ్వేత జాత్యహంకారం మోకాలికింద నలుగుతూ 6నిమిషాల నరకయాతనలో ఊపిరొదిలాడు జార్జ్ఫ్లాయిడ్. అణగారిన వర్గాలపై రాజ్యం దౌర్జన్యానికి 6రోజులు చిత్రహింసలు అనుభవించి అశువులు బాసారు ఈ తండ్రీ కొడుకులు. జూన్ 18న ప్రారంభమైన ఈ హింసాకాండ 22 రాత్రి ఒకరు, 23 ఉదయం ఒకరు మరణించడంతో ముగిసింది. దేశమేదైతేనేం? ప్రాంతమేదైతేనేం? పాలకులెప్పుడూ బాధిత ప్రజలపక్షంకాదని ఈ రెండు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. జరిగిన ఉదంతాన్ని అబద్ధాలతో కప్పి పుచ్చడానికీ, సాక్ష్యాలు తారుమారు చేయడానికీ సమస్త అధికార యంత్రాంగం పడుతున్న తాపత్రయమే ఇందుకు ఉదాహరణ. నిజాలు కండ్లముందే కనిపిస్తున్నా నిర్లజ్జగా ఇవి సహజమరణాలని ప్రకటించిన ముఖ్యమంత్రి.. ప్రజగ్రహానికి భయపడి సీబీఐ విచారణకు ఆదేశించారు. నిజానికి హత్యానేరం కింద అభియోగం మోపి దోషులను శిక్షించాలి. కానీ ఇరవైలక్షల పరిహారంతో ప్రజాస్వామ్యానికంటిన నెత్తుటి మరకలను దాచేయాలని చూస్తున్నారు తప్ప దోషులను శిక్షించడానికి మాత్రం ఏలికలు పూనుకోవడం లేదు. ఇది దేనిని సూచిస్తోంది?
వేళకు దుకాణాన్ని మూయక నిబంధనలు ఉల్లంఘించిన నేరానికి కొట్టచంపడం న్యాయమా? పోలీసులకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాలు ఇది న్యాయమే అని చెప్పకనే చెపుతున్నాయి. ఈ ఘటనను కేవలం కస్టడీ మరణంగానే చూస్తే అది పాక్షిక దృక్పథమే అవుతుంది. ఇది భారతీయ పాలనావ్యవస్థలో అణువణువునా నిండిపోయిన ఆధిపత్య సంస్కృతిలో భాగం. ప్రజలను నిత్యం భయబ్రాంతులకు గురిచేయడం ద్వారా ప్రశ్నించకుండా అణచివుంచాలనే నిరంకుశ విధానాలకు సంకేతం. పెట్టుబడిదారీ అనుకూల నయా ఉదారవాద యుగంలో పెరుగుతున్న ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు నిదర్శనం. లేదంటే కేవలం లాక్డౌన్ వేళల్ని అతిక్రమించారన్న చిన్న నేరానికి రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న రాజ్యం దుర్మార్గాన్ని ఏమనాలి? రోజుకు సగటున 5 లాకప్ మరణాలు నమోదవుతున్న దేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ప్రమాదంలో ఉన్న ఆ ప్రాణాలను తెలివిగా జైలుకు పంపి చేతులు దులుపుకున్నారు పోలీసులు! వారికి సహకరించింది న్యాయస్థానం! కానీ ప్రమాదంలో ఉన్నది తమ ప్రాణాలు మాత్రమే కాదు, ఈ దేశ ప్రజాస్వామ్యమని హెచ్చరిస్తోంది జయరాజ్, బెన్నిక్స్ల బలిదానం. అందుకే మనదాకా వచ్చేదాకా అన్యాయం అన్యాయంగా, అరాచకం అరాచకంగా కనిపించకపోవటం నుంచి బయటపడాలి పౌరసమాజం. అప్పుడే పౌర హక్కులకు రక్షణ, ప్రజాస్వామ్యానికి మనుగడ.