Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ అప్రమత్తత నేపాల్ రాజ్యాంగ సవరణ బిల్లును తేకుండా నిలువరించడంలో చూపి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చిఉండేది కాదు. ఇరు దేశాల వైఖరుల్లోనూ లోపాలున్నాయి. వీటిని సరిదిద్దుకుని ముందుకు సాగడానికి చర్చలే మార్గం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగడం ఉభయులకూ క్షేమకరం కాదు.
భారత్-నేపాల్ సంబంధాల్లో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. నేపాల్ రాజకీయ మ్యాపులో మార్పులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆ దేశ పార్లమెంటు ప్రతినిధుల సభ ఇటీవల ఏకగ్రీవంగా ఆమోదించడంతో ఈ రెండు చిరకాల మిత్ర దేశాల మధ్య వివాదం రాజుకుంది. వివాదాస్పద కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను కొత్త మ్యాపులో నేపాల్ చేర్చడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. 2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ను పునర్విభజన చేస్తూ భారత్ కొత్త రాజకీయ మ్యాపు విడుదల చేసినందుకు ప్రతిగా నేపాల్ ఈ చర్యకు పూనుకుంది. ఈ మూడు వివాదాస్పద ప్రాంతాలపై హక్కు తమకు ఉందంటే, తమకే ఉందని రెండు దేశాలు చాలా కాలంగా వాదించుకుంటున్నాయి. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్)లో సభ్యదేశాలుగా ఉన్న ఈ రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య వాణిజ్య, సహకార విస్తరణకు ఒప్పందాలు ఉన్నాయి. కానీ, సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఎలాంటి ఒప్పందమూ లేదు. 1814 మార్చి4న నేపాల్కు, బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన సుగాలి ఒప్పందం ఉన్నా అది గందరగోళానికి తావిచ్చేదిగా ఉంది. దీంతో ఇరుదేశాల మధ్య సరిహద్దుకు సంబంధించి ఏ చిన్న పొరపొచ్చాలు ఏర్పడినా అది పెను వివాదానికి దారితీసే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో సరిహద్దు వివాదంపై రెండు దేశాలు సంయమనంతో వ్యవహరించాల్సింది పోయి, పోటీ పడి కొత్త రాజకీయ మ్యాపులు విడుదలజేయడం అవాంఛనీయం. రాజకీయ మ్యాపులపై వివాదం మొదలై ఎనిమిది మాసాలు గడిచినా, దీనిపై భారత్, నేపాల్ మధ్య ఒక్కసారి కూడా చర్చలు జరగలేదు. రెండు సార్లు తాము చర్చల తేదీలను ప్రతిపాదించినా భారత్ పట్టించుకోలేదని, భారత విదేశాంగశాఖ కార్యదర్శితో మాట్లాడేందుకు న్యూఢిల్లీలోని తమ రాయబారి ప్రయత్నించగా, కరోనాపై పోరులో తలమునకలై ఉన్నామని, చర్చలకు ఇది సమయం కాదని భారత్ నుంచి సమాధానం వచ్చిందని నేపాల్ అంటోంది. నేపాల్తో చర్చలు, సంప్రదింపులకు తాము సుముఖంగానే ఉన్నామని, నేపాల్ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టడానికి ముందు కూడా చర్చల ప్రతిపాదన చేశామని, ప్రధాని ఓలి ఏకపక్ష ధోరణే ఈ వివాదానికి కారణమని మోడీ ప్రభుత్వం ఆరోపించింది. చర్చలకు ప్రతిపాదించిన తేదీల వివరాలు అడిగితే సమాధానం లేదు. ఇరు దేశాల మధ్య అపోహలు, అనుమానాలు ఏవైనా తలెత్తినప్పుడు ఉభయ దేశాల నేతలు పరస్పరం చర్చించుకుని, పరిష్కరించుకోవాలని 1950 నాటి ఒప్పందం స్పష్టంగా చెబుతోంది. ఆ ఒప్పందం మౌలిక స్ఫూర్తిని ఇరు పక్షాలు గంగలో కలిపేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. భారత్తో పోల్చితే నేపాల్ చాలా చిన్న దేశం. ఆర్థికంగా కూడా బలహీనమైన దేశం. రెండు దేశాల మధ్య సంబంధాల్లోనూ ఆ అసమానతలు ఏదో ఒక రూపంలో అప్పుడప్పుడూ వ్యక్తమవుతున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో సమతుల్యం ఉండేలా చూడాల్సిన బాధ్యత ఇరు దేశాలపైన ఉన్నప్పటికీ పెద్ద దేశమైన భారత్పై ఇది మరింత ఎక్కువగా ఉందనేది నిర్వివాదాంశం. భారత్లో 80లక్షల మంది నేపాలీయులు నివసిస్తుండగా, నేపాల్లోని తెరాయిలో 40లక్షల మంది దాకా భారత్ నుంచి వలస వెళ్లి స్థిరపడినవారు ఉన్నారు. వీరికి నేపాల్ పౌరసత్వం కూడా లభించింది. పాస్పోర్టులు, వీసాల అవసరం లేకుండానే రెండు దేశాల మధ్య స్వేచ్ఛగా రాకపోకలు సాగించుకునే వీలుంది. భారత్లో నివసించే నేపాలీయులు ఇక్కడి పౌరులతో సమంగా విద్య, వైద్య సదుపాయాలను పొందడంతో బాటు ప్రభుత్వ ఉద్యోగాలు (ఐఎఎస్, ఐఎఫ్ఎస్, ఐపిఎస్ వంటి సివిల్ సర్వీసులు మినహా) పొందే అవకాశం ఉంది. నేపాల్ వాణిజ్యంలో మూడోవంతు భారత్పై ఆధారపడి ఉంది. రెండు దేశాల మధ్య బంధం విడదీయరానిది. అయితే ఈ బంధం ఎప్పుడూ ఏకరీతిన కొనసాగిన దాఖలాలు లేవు. భారత్ పెద్దన్న తరహాలో వ్యవహరిస్తోందనే అసంతప్తి నేపాలీయుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను భారత్ తన అధీనంలోని భూభాగంగా పేర్కొంటూ రాజకీయ మ్యాపును ప్రచురించడంతో ఇరు దేశాల సంబంధాల్లో కొత్త దశ మొదలైంది. కాలాపానీ, సుస్తా ప్రాంతాలపై వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలు జరపాలని 2000, 2014 సంవత్సరాల్లో ఇరు దేశాలు అంగీకరించినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నేపాల్ ఈ వివాదం లేవనెత్తడం వెనక చైనా హస్తం ఉందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ నరవాణే చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. నేపాల్తో దౌత్య సంబంధాలను నెరపడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈ విధమైన నిరాధార ఆరోపణలకు దిగుతోంది. భారత్ ఆరోపించినట్టుగా నేపాల్పై చైనా ప్రభావం పెరుగుతున్నదంటే అది వ్యూహాత్మక దౌత్యంలో మోడీ ప్రభుత్వ వైఫల్యం కాదా? సరిహద్దు వివాదంపై నేపాల్తో చర్చలకు కరోనా అడ్డం వచ్చిందన్న భారత్ ఈ నెలారంభంలో ఆస్ట్రేలియాతో వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకుంది? గత వారం సరిహద్దుల్లో భారతీయ బందంపై నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోవడంతో భారత్ అప్రమత్తమైంది. ఈ అప్రమత్తత నేపాల్ రాజ్యాంగ సవరణ బిల్లును తేకుండా నిలువరించడంలో చూపి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చిఉండేది కాదు. ఇరు దేశాల వైఖరుల్లోనూ లోపాలున్నాయి. వీటిని సరిదిద్దుకుని ముందుకు సాగడానికి చర్చలే మార్గం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగడం ఉభయులకూ క్షేమకరం కాదు.