Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశమంతా కరోనాతో గడగడలాడిపోతుంటే, కేంద్ర ప్రభుత్వం చేతులేత్తేసింది. నిధుల కోసం కేంద్రాన్ని నిలదీయాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం నోరుమెదపడం లేదు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం నేటి ప్రజాస్వామ దుస్థితి. సీఎం ఆరోగ్యంపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు సంబంధించి హెల్త్బులిటెన్ విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసేదాకా వచ్చింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ రేటు విపరీతంగా పెరుగుతున్నది. ప్రజల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. ఉపాధిలేక, పౌష్టికాహారం దొరకక, చికిత్స అందక జనం నానా అవస్థలు పడుతున్న మాట జగమెరిగిన సత్యం. మార్చిలో 97 కేసులు, ఆరు మరణాలు నమోదు కాగా, జూన్కు వచ్చేసరికి 13,642 మందికి పాజిటివ్ రాగా, 178 మంది ప్రాణాలు వదిలారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వైరస్ వ్యాప్తికి కేరాఫ్ అడ్రస్గా మారింది. ఆయా రాష్ట్రాల్లో జూన్ 30లోపు లెక్కలను పరిశీలిస్తే దేశ సగటుతో పొలిస్తే మహారాష్ట్రలో 22శాతం, ఢిల్లీలో 18శాతం, ఒడిశాలో 12.6శాతం దాటాయి. అదే మన రాష్ట్రంలో 27శాతం కాగా, అందులో ప్రతిరోజూ హైదరాబాద్లో 80శాతానికిపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. వారం రోజుల సగటు తీసుకుంటే పాజిటివ్ కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కరోనా దేశంలో సామాజిక వ్యాప్తి చెందుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వ్యాఖ్యానించడం తెలిసిందే. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలోనూ తీవ్ర ఆలస్యం జరుగుతున్నది. సర్కారు ల్యాబ్ల్లో రోజుకు 5వేలు, ప్రయివేటులో 8,400 టెస్టులు చేసే సామర్థ్యమున్నట్టు ఐసీఎంఆర్కు రాష్ట్ర వైద్యశాఖ సెలవిచ్చింది. కానీ, రెండూ కలిపినా చేస్తున్న టెస్టుల సంఖ్య ఏడువేలే. ఆ టెస్టుల ఫలితాలకు మూడు నుంచి నాలుగు రోజులు పడుతున్నది. లక్షణాలున్న ప్రతివ్యక్తికీ పరీక్షలు చేస్తామన్న సర్కారు హామీ నెరవేరడం లేదు. అధికార సౌధం ప్రగతిభవన్ను సైతం వైరస్ తాకింది. దీంతో పెద్దాయనా క్వారంటైన్లోకి వెళ్లినట్టు వార్తలొస్తున్నాయి. రాస్తున్న జర్నలిస్టులపైనా ప్రభుత్వం కత్తిగట్టింది. అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నది. నిరంతరం వార్తలు, విశ్లేషణలు అందిస్తున్న మీడియాపై సర్కారు కక్ష పెంచుకుంటున్నది. ఇంతటి మహావిపత్తు రాష్ట్రంలో విలయతాండవం చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాన్ని కూల్చివేసే పనిలో తీరికలేకుండా ఉండటం ఆశ్చర్యం. ఒక వైపు కరోనాను ఎదుర్కోనేందుకు నిధుల కొరత ఉన్నదని పాలకులే చెబుతున్నారు. వచ్చిన భారీ విరాళాలు, పెట్టిన ఖర్చుపై శ్వేతపత్రం ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, కార్మికుల జీతాలను ఆపి మరీ రైతుబంధు డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని కూడా కేసీఆరే చెప్పారు. ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని కొత్త సచివాలయానికి వందలకోట్లు ఖర్చు చేస్తున్నారు. రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు కొత్తభవనం అవసరంలేదనీ ఏడాదిగా నెత్తీనోరూ కొట్టుకుంటున్నా, తానుపట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా ఉంది గులాబీ సర్కారు వ్యవహారశైలి. గతంలో ఎన్నడూలేనంతగా అయోమయ పరిస్థితులు నేడు రాష్ట్రంలో నెలకొన్నాయి. కరోనా బాధితులను ప్రభుత్వాస్పత్రుల్లో చేర్చుకోవడానికి, అనుమానితులకు విరివిగా పరీక్షలు చేయడానికి సర్కారుకు అస్సలు చేతులు రావడంలేదు. ఆ రోగులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నా కార్పొరేట్ ఆస్పత్రులకు లాభాల యావే తప్ప ప్రజల ప్రాణాలు పట్టడం లేదు. ప్రభుత్వమూ చోద్యం చూస్తున్నది. మందూ, మాకూ లేక, పౌష్టికాహారం అందక కష్టాలకొలిమిలో రోగులు కాపురం చేస్తున్న దుస్థితి. వైరస్ కొత్త ప్రదేశాలకు వ్యాపించకుండా చూడటం, ఆరోగ్య సిబ్బందిని సన్నద్ధం చేయడం, వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టడం, ఆస్పత్రుల్లో బెడ్లు, కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలను భారీగా ఏర్పాటు చేయాలని వైద్యనిపుణులు, మేధావులు సూచిస్తున్నారు. మురికివాడలు, బస్తీల నుంచి లక్షణాలు ఉన్నవారు వస్తే వెంటనే టెస్ట్ చేస్తే ఫలితాలుంటాయని అభిప్రాయ పడుతున్నారు. ప్రతివారం కేసులను సమీక్షించి కొత్త వ్యూహాల ద్వారా ప్రభుత్వం ముందుకెళ్లాలని చెబుతున్నారు. ప్రయివేట్ ఆస్పత్రుల ఘోర, ఘనకార్యాల వార్తలు, కథనాలు టీఆర్ఎస్ సర్కారు చెవికెక్కడం లేదు. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అనే దానిపై స్పష్టత ఇవ్వాలంటూ హైకోర్టు మొట్టికాయలు వేసినా నిర్లక్ష్యమే. ఒకవైపు ప్రభుత్వాస్పత్రుల్లో వందలాది బెడ్లు ఖాళీగా ఉన్నాయంటున్నారు. కానీ, అక్కడ చేరడానికి రోగులు విముఖత చూపడం వెనుక సౌకర్యాలు, చికిత్స లేమినే ప్రధానకారణం. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వ అడుగుజాడల్లో నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతలు మరిచి తప్పటడుగులు వేస్తున్నది. దేశమంతా కరోనాతో గడగడలాడిపోతుంటే, కేంద్ర ప్రభుత్వం చేతులేత్తేసింది. నిధుల కోసం కేంద్రాన్ని నిలదీయాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం నోరుమెదపడం లేదు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం నేటి ప్రజాస్వామ దుస్థితి. సీఎం ఆరోగ్యంపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు సంబంధించి హెల్త్బులిటెన్ విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసేదాకా వచ్చింది. అన్ని పనులూ పక్కనబెట్టి ప్రజల ఆరోగ్యంపైన దృష్టిసారించాల్సిన సమయంలో నిర్మాణాత్మక చర్యలు తీసుకోకపోవడాన్ని జనం గమనిస్తున్నారనే విషయం పాలకులు గుర్తించాలి.