Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సైట్ సూపర్వైజర్ ఎర్రమరాజు భానుమూర్తి
రెండు గ్రామాల్లో పురావస్తు శాఖ అధికారుల పర్యటన
బయటపడిన ఆదిమానవు ఆనవాళ్లు
నవతెలంగాణ-నంగునూరు
రాజగోపాల్పేట గ్రామానికి ఎంతో గొప్ప చరిత్ర ఉన్నట్టు శాసనాల ద్వారా తెలుస్తోందని విశ్రాంత పురావస్తు శాఖ ప్రాచీన కట్టడాల ముఖ్య సంరక్షకులు, సైట్ సూపర్వైజర్ ఎర్రమరాజు భానుమూర్తి అన్నారు. ఆదివారం రాజగోపాల్పేట, సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామాల్లో పర్యటించి
ఆది మానవుల ఆనవాళ్లను గుర్తించారు. వెల్కటూరులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో రాకాసిగుండ్లను గుర్తించి వాటిని పరిశీలించారు. అనంతరం రాజగోపాల్పేటలో ఇటీవల బయటపడిన దేవాలయ ఆనవాళ్లను రాతి ఖడ్డీలపై చెక్కిన దేవతా విగ్రహాలను పరిశీలించారు. గ్రామంలోని కోట, పురాతన దేవాలయాలు, చారిత్రాక ఆనవాళ్లను గ్రామ సర్పంచ్ ఏల రాజేంద్ర, జాజాల చందు, స్తానిక రైతులనడిగి తెలుసుకున్నారు. అనంతరం భానుమూర్తి మాట్లాడుతూ నంగునూరు మండలంలోని పాలమాకుల, నర్మేట, సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామాల్లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తవ్వకాల్లో ఆది మానవుల ఆనవాళ్లు, వారి గొప్ప చరిత్ర, లభించిందన్నారు. ఆయా గ్రామాల్లో పరిశీలిస్తే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని, రాజగోపాల్పేట గ్రామంలో అతి పురాతనమైన ఆలయాలతో పాటు రాజుల కాలంలో గొప్ప చారిత్రాత్మక కట్టడాలు నిర్మించినట్టు తెలుస్తోందన్నారు. వీటిని వెలుగులోకి తేవాలని గ్రామస్తులు కోరారని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుమతులు లభించేలా చొరవ తీసుకుంటామన్నారు. ఆయన వెంట చరిత్రకారులు ఆహోబిలం, కరుణాకర్, కస్తూరి హరీశ్, వేముగంటి రఘునందన్ ఉన్నారు.