Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్
రుణాల ప్రక్రియను వేగవంతం చేసి లబ్దిదారులకు బ్యాంకులు ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో వారి అధ్యక్షతన డీసీసీ, డీఎల్ఆర్సీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలకు రుణాలివ్వడం వల్ల చాలా మందికి ఉపాధి కల్పించినట్టు అవుతుందని వివరించారు. ప్రభుత్వం అందచేస్తున్న రుణాల గురించి వారికి అవగాహన కూడా కల్పించాలని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలోని రైతులకు సంబంధించిన వ్యవసాయ రుణాలను రెన్యూవల్ చేయడంలో వేగం పెంచాలని ప్రతీ బ్యాంకు లక్ష్యానికి అనుగుణంగా రుణాల పంపిణీ పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా అధికారులు బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించిన రుణాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందజేయాలని, కూరగాయలు, పండ్లు, పూల సాగుకు రుణాల మంజూరుకు సంబంధిచిన పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులు ఎక్కువ మందికి రుణాలు అందించే విధంగా చర్యలు చేపట్టి వారి ఆర్థికాభ్యున్నతికి చేయూతనందించాలని కలెక్టర్ కోరారు. అలాగే జిల్లాలో పాల ఉత్పత్తి మరింత పెరిగేలా రైతులకు పాడిగేదెలపై రుణాలు అందించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. అధికారులు రైతుల రుణాల మంజూరీకి సంబంధించిన పూర్తి డేటాను, వివరాలను బ్యాంకు అధికారులు, సిబ్బందితో కలిసి బ్యాంకుల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకొని పని చేయాలని సూచించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ బీసీ రుణాల మంజూరుతో పాటు గ్రౌండింగ్ వివరాలను బ్యాంకుల వారీగా అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్లకు సంబంధించిన రుణాల మంజూరీలో సైతం అధికారులు ఇబ్బందులు కలిగించకుండా త్వరితగతిన బ్యాంకులు తమ వాటాను మంజూరు చేయాలని సూచించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతీ, యువకులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను అందజేస్తుందని వాటి మంజూరుకు బ్యాంకర్లు తమ వాటాను మంజూరు చేసి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని బ్యాంకర్లకు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులకు కూరగాయల సాగు, పెండాల్స్ , ఉద్యానవన పంటలకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా బ్యాంకర్లు తమ తోడ్పాటునందించాలన్నారు. అనంతరం వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ రిలీజ్ చేశారు. లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రామకష్ణారెడ్డి, , డీఆర్డీవో శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కష్ణమూర్తి, జిల్లాలోని ఆయా బ్యాంకుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.