Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ, కేసీఆర్వి ఒకే విధానాలు
- సెప్టెంబర్లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
నవతెలంగాణ-మెట్టుగడ్డ
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయ సాధన కోసం ఉద్యమించేందుకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అవతరిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు జరిగి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా రైతులు, నిరుద్యోగులు, కార్మికులకు న్యాయం జరగలేదన్నారు. ప్రజా సమస్యల గురించి ప్రశ్నించిన వారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల, మత హింసలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న ప్రధాని మోడీ, లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ విధానాలు ఒకటేనన్నారు. ధర్నా చౌక్నే ఎత్తేసి కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నాడన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు, అక్టోబర్ 5 నుండి డిసెంబర్ 3 వరకు రాష్ట్ర వ్యాప్త ప్రచార జాతాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈర్ల నర్సింహా, జిల్లా కార్యదర్శి కందాల రామకృష్ణ పాల్గొన్నారు.