Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడువులోపు రైతులకు సాగునీరు
అందించేందుకు చర్యలు
-శాసన మండలి సభ్యులు కసిరెడ్డి
నారాయణరెడ్డి
నవతెలంగాణ-కల్వకుర్తి
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వ పనులను వేగంగా చేపట్టి గడువు లోపు రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని శాసన మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం తర్నికల్ గ్రామ సమీపంలో ఉన్న సంజాపూర్ వద్ద చేపట్టిన ప్రధాన కాల్వ నిర్మాణ పనులను అధికార పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... గతంలో దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూమిని భూ సేకరణ చేయకుండా నిలిపివేశారని అన్నారు. ఈ భూమికి సంబంధించిన కోర్టు కేసులతో పాటు మామిడి తోటలు సైతం ఉండటంతో కాల్వ పనులు ముందుకు సాగలేదని పేర్కొన్నారు. నర్సింహారెడ్డి, నరేందర్రెడ్డి, పాండుయాదవ్, తిరుపతయ్య, విష్ణువర్దన్రెడ్డి, శేఖర్రెడ్డి, తదితర రైతులతో పలుమార్లు చర్చలు జరిపామని అన్నారు. శుక్రవారం చర్చలు సఫలం కావడంతో మామిడి తోటలో కాల్వల తవ్వకం ప్రారంభించామని పేర్కొన్నారు. సంబంధిత వ్యవసాయ పొలాలకు చెందిన రైతులు తన మాటపై గౌరవంతో కాల్వల తవ్వకాన్ని ఒప్పుకున్నందుకు వారిని అభినందిస్తున్నట్లు చెప్పారు. జంగారెడ్డిపల్లి నుంచి సంజాపూర్ వరకూ ప్రధాన కాల్వకు గతంలో అడ్డంకులు సృష్టించారని దీంతో ఇక్కడ పనులు ముందుకు సాగలేదని ఆయన అన్నారు. కల్వర్ట్లతో పాటు వివిధ రకాల సిమెంట్ పనులను వేగవంతంగా చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వరమ్మ, జెడ్పీటీసీ అశోక్రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్, వైస్ ఎంపీపీ పర్వతాలుగౌడ్, జంగారెడ్డిపల్లి సర్పంచ్ శ్రీనివాసులు, టీఆర్ఎస్ నాయకులు చింతల రమణారెడ్డి, రమాకాంత్రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.