Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100 శాతం వాటా స్వాధీనం
- హోల్సేల్ వ్యాపారంలోకి ఈ-కామర్స్ దిగ్గజం
న్యూఢిల్లీ : ప్రముఖ హోల్సేల్ వ్యాపార సంస్థ వాల్ మార్ట్ ఇండియాను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ గ్రూపు స్వాధీనం చేసుకుంది. వాల్మార్ట్ ఇండి యాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ స్వాధీనం ద్వారా వచ్చే నెలలో సరికొత్త డిజిటల్ ప్లాట్ఫాం 'ఫ్లిప్కార్ట్ హోల్సేల్'ను ప్రారంభించినట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. దీంతో ఆన్లైన్ కిరాణ మార్కెట్లో విస్తరిస్తున్న రిలయన్స్ మార్ట్కు తీవ్ర పోటీ ఇవ్వొచ్చని భావిస్తోంది. అమెరికాకు చెందిన వాల్మార్ట్ గతేడాది దాదాపుగా రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడితో ఫ్లిప్కార్ట్లో 77 శాతం మెజారిటీ వాటా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. బిజినెస్-టు-బిజినెస్ విభాగాన్ని రివర్స్ అక్విజిషన్లో భాగంగా వాల్మార్ట్ ఇండియా హోల్సేల్ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్టు ఫ్లిప్కార్ట్ గురువారం వెల్లడించింది. తద్వారా భారతదేశంలో కిరాణా రిటైల్ వ్యాపార స్వభావాన్ని మార్చి వేయనున్నామని ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాన్ క్రిష్ణమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే నెల ఆగస్టులో 'ఫ్లిప్కార్ట్ హోల్సేల్' ను పైలట్ సేవలను ప్రారంభించనున్నామన్నారు. కొత్త విభాగం కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. భారతదేశ రిటైల్ వ్యాపారంలో కిరణాల దుకాణాలు, ఎంఎస్ఎంఇలు కీలకంగా ఉన్నాయన్నారు. టెక్నాలజీ నైపుణ్యాలు, లాజిస్టిక్ అవసరాలు, ఆర్థికంగా చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడంతోపాటు, వినియోగదారుల అవసరాలను తీర్చడంపై దృష్టి సారిస్తామన్నారు. ఈ విభాగానికి ఫ్లిప్కార్ట్ మాజీ ఉద్యోగి ఆదర్శ్ మీనన్ కీలకంగా వ్యవహారించనున్నారు. అదే విధంగా వాల్మార్ట్ ఇండియా సీఈఓ సమీర్ అగర్వాల్ ఇంకొంత కాలం సంస్థతోనే కలిసి పని చేయనున్నారు. ఇదొక కీలక ముందడుగు అని వాల్మార్ట్ ఇండియా సీఈఓ జుడిత్ మెక్కెన్నా పేర్కొన్నారు.