Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ సీజన్లో 20-30శాతం ప్రియం
- ప్యానెళ్లపై సుంకం భారం
న్యూఢిల్లీ : వచ్చే పండుగ సీజన్లో టీవీలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అధిక భారం పడొచ్చు. అక్టోబర్ నుంచి టీవీల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. టెలివిజన్ ప్యానెల్స్పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ సెప్టెంబర్ చివరితో నిలిచిపోనుంది. డ్యూటీ రాయితీని పొడిగించకపోతే వినియోగదారులకు అదనపు భారం తప్పదని ఆ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. వివిధ మోడళ్లను బట్టి దాదాపుగా 20-35 శాతం ధరలు పెరగొచ్చని అంచనా వేస్తున్నాయి. మొత్తం టీవీ ఖరీదులో 60 శాతం ప్యానెల్ విలువదే. వీటిని అత్యధికంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న డీలర్ తెలిపారు. గత కొన్ని వారాలుగా వీటి కొరత ఏర్పడిందన్నారు. దీనికి తోడు రాయితీలు ఎత్తివేస్తే వచ్చే పండగ సీజన్లో దాదాపుగా 20-35 శాతం మేర ధరలు పెరుగొచ్చని.. ఈ భారాన్ని వినియోగదారులపై మోపాల్సి రావొచ్చన్నారు.
ఇప్పటికే ఎల్జీ, పానాసోనిక్, థామ్సన్, సాన్సుయ్ కంపెనీలు ధరలు పెంచే యోచనలో ఉన్నాయని పరిశ్రమ వర్గాల సమాచారం. రాయితీలపై గడువు పెంచకపోతే ధరలను పెంచడం తప్పా మరో మార్గం లేదని ఎల్జీ ఇండియా సీనియర్ డైరెక్టర్ రవీందర్ వెల్లడించారు. 32 అంగుళాల టీవీపై 4 శాతం లేదా కనిష్టంగా రూ.600 పెరగొచ్చన్నారు. 42 అంగుళాల టీవీవిలువ రూ.1,200-1,500 ప్రియం కానునాయన్నారు. అధిక ధరల వల్ల వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకునే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే డిమాండ్ లేక పరిశ్రమ ఒత్తిడిలో ఉందనీ, అమ్మకాలు పడిపోతే మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు.