Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ సీజన్పైనే దృష్టి
- రుణాలు, కొనుగోళ్లపై రాయితీలు
బిజినెస్ డెస్క్: ప్రస్తుత పండుగ సీజన్ను అందిపుచ్చుకోవడానికి దేశీయ దిగ్గజ బ్యాంక్లు పోటీ పడుతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు రుణాల జారీలో పెరుగుదల లేకపోవడంతో.. అనేక బ్యాంక్లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. ఈ పండుగ సీజన్ డిమాండ్ను ఎలాగైనా అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటించాయి. చౌక రుణాలు అందిస్తున్నట్లు ఇప్పటికే తెలిపాయి. ప్రాసెసింగ్ ఫీజులు రద్దు, వడ్డీలో రాయితీ, సులభంగా రుణాలు, కొనుగోళ్లపై డిస్కౌంట్లు తదితర వాటితో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ముఖ్యంగా రుణాలపై దృష్టి సారించాయి. తొలుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ పోటీకి తెర లేపింది. ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు మరిన్ని బ్యాంక్లు ఈ బాట పట్టాయి. ఏ బ్యాంక్ ఎలాంటి ఆఫర్లను ఇస్తుందో.. ఆ వివరాలు..
ఎస్బీఐ 'యోనో'తో టార్గెట్
ఎస్బీఐ ప్రస్తుత పండగ సీజన్లో తమ వినియోగదారులకు అందించే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఎస్బీఐ యోనో యాప్లో వాహన, పసిడి, వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసే ఖాతాదారులకు ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. ఆమోదం లభించిన ప్రాజెక్టుల్లో నివాసాలు కొనుగోలు చేసేవారి గహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజునూ 100 శాతం రద్దు చేసింది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేసిన రుణగ్రహీతలకు వడ్డీ రేట్లలో 10 బేసిస్ పాయింట్ల వరకూ రాయితీ కల్పిస్తుంది. యోనోపై గహ రుణానికి దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా వడ్డీరేటుపై మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీని కల్పిస్తుంది. సొంత కారు కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి 7.5 శాతం వడ్డీకే అప్పు ఇస్తుంది. కొన్ని ఎంపిక చేసిన వాహనాలపై ఏకంగా 100 శాతం ఫైనాన్స్ సదుపాయం కల్పించినట్లు పేర్కొంది. బంగారం రుణాలకు దరఖాస్తు చేసుకునే వారికి 7.5 శాతం వడ్డీ రేటుతో 36 నెలల్లోగా తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తుంది. ఇక వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం నుంచి వడ్డీ వసూలు చేయనున్నట్టు ఆ బ్యాంక్ ప్రకటించింది.
హెచ్డిఎఫ్సి 'ఫెస్టివ్ ట్రీట్'
పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని హెడిఎఫ్సి బ్యాంక్ 'ఫెస్టివ్ ట్రీట్' పేరుతో పలు రాయితీలతో ముందుకు వచ్చింది. రుణాలు, ఇఎంఐ, క్యాష్బ్యాక్స్, క్రెడిట్ కార్డ్స్, గిఫ్ట్ వోచర్స్, తదితర విభాగాలలో పలు ఆఫర్లను వర్తింప చేయనున్నట్లు ప్రకటించింది. వాహన, వ్యక్తిగత తదితర రుణాలలో ప్రాసెసింగ్ ఫీజు తగ్గించనున్నట్లు ప్రకటించింది. పలు రాయితీలను అందించడానికి పలు దిగ్గజ రిటైల్ బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లు, అదనపు రివార్డ్ పాయింట్లు, ఆన్లైన్ కొనుగోళ్లలో అందిస్తుంది. ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, టాటాక్లిక్, మైంట్రా, పెప్పర్ఫ్రై, స్విగ్గీ, గ్రోఫర్స్ వంటి ఆన్లైన్ విక్రయ సంస్థలతో ఈ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ 'ఫెస్టివ్ బోనంజా'
పండుగ సీజన్ను పురస్కరించుకుని ఐసిఐసిఐ బ్యాంక్ 'ఫెస్టివ్ బొనంజా'ను ప్రకటించింది. ఇందులో పలు బ్రాండ్లు, ఇ-కామర్స్ వేదికలపై వేలాది ఆఫర్లు, రాయితీలు, క్యాష్ బ్యాంక్లను అందిస్తున్నట్లు తెలిపింది. కొన్ని ఆఫర్లు అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి తేగా.. మరికొన్ని వచ్చే పండగ సమయాల్లో లభ్యమవుతాయని తెలిపింది. తాము ఎంపిక చేసిన కొన్ని వినియోగదారుల ఉత్పత్తులు, అమెజాన్, ఫ్లిప్కార్డ్, బిగ్బస్కెట్ తదితర ఇ-కామర్స్ పోర్టలల్లో తమ బ్యాంక్ డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ లాంటివి ఉపయోగించడం ద్వారా 10 శాతం వరకు రాయితీలు పొందవచ్చని తెలిపింది. ఇతర బ్యాంక్ల నుంచి గృహ రుణాల బదిలీ చేసుకుంటే వడ్డీ రేటు 6.90 శాతం ప్రారంభం అవుతుందని తెలిపింది. ప్రాసెసింగ్ ఫీజు రూ.3వేల నుంచి ప్రారంభం అవుతుందని, జీఎస్టీి అదనమని తెలిపింది. సొంత కారు కొనుగోలు చేయాలనుకునే వారు లక్షకు నెల వాయిదా రూ.1554తో 84 నెలల కాలానికి రుణాలు లభిస్తాయని తెలిపింది. ద్విచక్ర వాహన రుణాలపై రూ.999 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగత రుణాలు 10.50 శాతం వడ్డీ రేటుతో లభిస్తాయని.. ప్రాసెసింగ్ ఫీజు 3,999గా ఉంటుందని పేర్కొంది.