Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'లాయిడ్' అందరి బ్రాండ్
- ఆనందాలే హామీగా ముందుకు..
- 'మేక్-ఇన్-ఇండియా'తో మేలే
-రూ.10,000 కోట్ల టర్నోవరే లక్ష్యం
- లాయిడ్ దక్షిణ విభాగం ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ బాబు అల్లాడి
- నవతెలంగాణ వాణిజ్య విభాగం
గత 60 సంవత్సరాలుగా వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ రంగంలో మెరుగైన ఉత్పత్తులతో విశేష సేవలందిస్తున్న లాయిడ్ బ్రాండ్ను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయనున్నట్లు ఆ సంస్థ దక్షిణ విభాగం ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ బాబు అల్లాడి తెలిపారు. కేవలం సమాజంలోని 'ఉన్న'త వర్గాలు, కార్పొరేట్ సంస్థలకు, సంపన్న దేశాల ఎగుమతులకే పరిమితమైన లాయిడ్ ఉత్పత్తులను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరలలో అందించనున్నట్లు ఆయన వివరించారు. 'మేక్-ఇన్-ఇండియా' నినాదాన్ని లాయిడ్ సంస్థ ఎప్పటినుంచో అమలు చేస్తోందని.. ఇటీవలి కాలంలో దీనిని వృద్ధి చేసి మరింత దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో తాము నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని ఆయన తెలిపారు. 'మేక్-ఇన్-ఇండియా' వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని దానిని తాము లాభాలుగా మార్చుకోకుండా వినియోగదారులకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా వారికి చౌక ధరలకే మెరుగైన ఉత్పత్తులను అందించేందుకు వీలవుతుందని అన్నారు. లాయిడ్ ఉత్పత్తులు మంచి నాణ్యమైనవి, మన్నికైనవే కానీ.. ఖరీదైనవన్న భావన వినియోగదారుల నుంచి దూరం చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్ కండీషనర్లు, ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రీజిరేటర్లు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ విభాగాలలో దూసుకుపోతున్న లాయిడ్ బ్రాండ్ను రానున్న రోజుల్లో మరింతగా విస్తరించి రూ.10,000 కోట్ల టర్నోవర్ను సాధించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వివరించారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అంతా జపాన్, కొరియా, చైనా ఉత్పత్తులతో నిండిపోతోందనీ.. అయినా వాయువ్య ఆసియాలో అతిపెద్ద దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ అయిన లాయిడ్ వాటికంటే ఎంతో మెరుగైన బ్రాండ్ అని ప్రజలు గుర్తిస్తున్నారని ఆయన తెలిపారు. దీనికి ప్రతియేటా లక్ష్యాలను మించిన టర్నోవర్ సాధిస్తుండడమే నిదర్శనమని శ్రీకాంత్ బాబు 'నవతెలంగాణ' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
- ఎలక్ట్రానిక్ మార్కెట్ మొత్తం విదేశీ కంపెనీల ఉత్పత్తులతో నిండిపోయింది. ఇలాంటి వేళ మీరు ఎలాంటి విస్తరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు?
జపాన్, కొరియా, చైనా ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ మార్కెట్ను శాసిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనూ నాణ్యతే పరమావధిగా మేము విస్తరిస్తున్నాం. వినియోగదారులకు మేమందించే మెరుగైన ఉత్పత్తులను బాగా ఆదరిస్తున్నారు. మా ఉత్పత్తులతో సంతృప్తి చెందిన వారు ఇచ్చే మౌఖిక ప్రచారమే మమ్మల్ని మార్కెట్లోకి నిలబెడుతోంది.
మా ఉత్పత్తులు కొన్న వినియోగదారుకు 100 శాతం మనశ్శాంతిని అందించడంతో పాటు 'చల్లని' ఆనందాలను అందిచడమే హామీగా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నాం. అదే మా సంస్థకు ఉన్న బలం.
- అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండే లాయిడ్ ఉత్పత్తులు పేదలు, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే ఉంటున్నాయి. వారికి చేరువ కాకుండా మార్కెట్ను ఎలా విస్తరించగలరు?
లాయిడ్ ఉత్పత్తులు సంపన్నులు మాత్రమే కొనగలిగేలా ఖరీదుగా ఉండేవన్నది ఒకప్పటి మాట. మేము మా ఆర్ అండ్ డీ ప్లాంటును పూర్తిస్థాయిలో వినియోగించి వీలైనంత చౌక ధరలకు ఉత్పత్తులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో చాలా వారకు విజయం సాధించాం. మెరుగైన చాలా ఉత్పత్తులను ఇప్పటికే మార్కెట్లో అన్ని వర్గాల వారు కొనుగోలు చేసే ధరలలో అందుబాటులోకి తెచ్చాం. అయితే ఈ క్రమంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. తయారీ ప్లాంటుల విస్తరణతో ఎక్కడికక్కడ లాయిడ్ ఉత్పత్తులను తయారు చేసి అందిస్తున్నందున రవాణా తదితర వ్యయాలు తగ్గుతున్నాయి. దీని వల్ల వాటిని వినియోగదారులకు చౌక ధరకు అందించగలుగుతున్నాం.
- సర్వీసింగ్ సౌలభ్యంలో లాయిడ్ ప్రత్యేకత ఎలా ఉంది?
ఇటీవలి కాలంలో తయారీ, విక్రయాలతో పాటు సర్వీసింగ్ విభాగాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాం. తయారీలో రాజీపడని లాయిడ్ బ్రాండ్లో సాంకేతిక సమస్యలు రావడం అనేది చాలా అరుదు. అయినా ఎవైనా నిర్వహణ తప్పిదాల వల్ల వచ్చే సమస్యల పరిష్కారానికి గాను దేశ వ్యాప్తంగా 5000 మంది సర్వీసు సిబ్బందిని, 26 సర్వీసింగ్ హబ్లతో పాటు అన్ని విడిభాగాలు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దీనికి తోడు ఎవరైన వినియోగదారులు ఫిర్యాదు చేయగానే 24 గంటల్లో సర్వీసింగ్ సిబ్బంది దానిని ఎటెంప్ట్ చేసేలా వ్యవస్థను రూపొందించాం. ప్రత్యేక టోల్ ఫ్రీ-నెంబరుతో పాటు మెరుగైన సర్వీసింగ్ కోసం 'టాస్క్ఫోర్స్' టీమ్లను కూడా ఏర్పాటు చేశాం. సర్వీసింగ్ సిబ్బందికి నూతన టెక్నాలజీపై ఎప్పటికప్పుడు ఆధునిక శిక్షణనిస్తున్నాం. ఏ ఇతర కంపెనీ అందించని విధంగా త్వరలోనే 'ఫిజా సర్వీస్'ను ప్రారంభించనున్నాం. ఇందులో భాగంగా వినియోగదారు ఫిర్యాదు చేయగానే కేవలం 4 గంటల్లో కాల్ ఎటెండ్ చేసి సర్వీసింగ్ చేసేలా ప్రణాళికను రూపొందించాం. త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నాం.
- తెలుగు రాష్ట్రాలలో విస్తరిస్తారా?
మార్కెట్ పరంగా దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు మాకు చాలా ముఖ్యం. ఇక్కడ మరింతగా విస్తరించేలా ప్రణాళికలను తయారు చేశాం. లాయిడ్ ఇప్పటికే ఆరు తయారీ ప్లాంటులతో ఆగేయాసియాలో అతి పెద్ద ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కంపెనీగా ఎదిగింది. 2016లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో, తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలో భారీ తయారీ ప్లాంటులను ఏర్పాటు చేసే యోచన ఉంది. సమయానుకూలంగా వీటిని అందుబాటులోకి తెస్తాం.
- రానున్న 'పండుగల సీజన్'కు ఎలా సన్నద్ధమవుతున్నారు?
ఎలక్ట్రానిక్ కంపెనీలకు పండుగల సీజన్ చాలా ప్రధానమైంది. ఇందుకోసం మేము ప్రత్యేకంగా బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నాం. ఇందులో ఒకటి 'కుషియోంకీ ఖజానా' పథకాన్ని ఆలోచిస్తున్నాం. దీనిలో భాగంగా ఇతర కంపెనీల మాదిరిగా ఫేక్ హామీలు కాకుండా మా ఉత్పత్తలను కొన్న వినియోగదారుకు పూర్తిస్థాయి ఆనందాలను అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఉత్పత్తులను బట్టి మెరుగైన వారంటీని, సర్వీసులను అదించడంతో పాటు కొత్త వినియోగదారులను పరిచయం చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా అందించనున్నాం. రెండోసారి లాయిడ్ ఉత్పత్తులు కొనుగోలు చేసే వారికి దాదాపు 30 శాతం వరకు డిస్కౌంట్ను కూడా అందిచేలా పలు కొత్తకొత్త ఆనందాలను అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నాం. పూర్తి వివరాలను త్వరలేనే వెల్లడిస్తాం.
- విస్తరణ టర్నోవర్ లక్ష్యం ఎంత ?
ఈ ఏడాదికి దక్షిణ భారతంలో దాదాపు రూ.300 కోట్ల టర్నోవర్ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఇప్పటికే దాదాపు రూ.290 కోట్లను చేరుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.350 కోట్లను అందుకోగలమని ధీమాగా ఉన్నాం. ఈ దిశగా కృషి చేస్తున్నాం. దేశ వ్యాప్తంగా లాయిడ్ సంస్థ రూ.1000 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే రూ.1,500 కోట్లకు చేరువయ్యాం. రానున్న రోజుల్లో రూ.10,000 కోట్ల టర్నోవరే లక్ష్యంగా కంపెనీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.