Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టులో 7శాతానికి చేరిక
ముంబయి : దేశంలో అధిక ధరలు సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్నాయి. వరుసగా మూడు నెలలుగా తగ్గినట్టుగానే తగ్గిన వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) మళ్లీ ఆగస్టులో 7 శాతానికి పెరిగింది. ఇంతక్రితం జులై మాసంలో ఇది 6.71శాతంగా నమోదయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఏకంగా 7.79శాతానికి ఎగిసి ఎనిమిదేండ్ల గరిష్ట స్థాయిని తాకింది. హెచ్చు ధరలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఆయినా ధరలు తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళనకరం. దేశంలో ద్రవ్యోల్బణాన్ని 2-6శాతం మధ్య కట్టడి చేయాలనేది ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దీనికి భిన్నంగా గడిచిన ఎనిమిది నెలలుగా ద్రవ్యోల్బణం ఆరు శాతం ఎగువన నమోదవుతూనే ఉంది. దీంతో భవిష్యత్తులో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశాలున్నాయి.
సీపీఐలో దాదాపు సగం వరకు వాటా అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సూచీదే. గడిచిన నెలలో గోదుమలు, బియ్యం, పప్పుల ధరలు భారీగా పెరగడంతో అహారోత్పత్తుల ధరల సూచీ 7.62 శాతానికి ఎగిసింది. ఇంతక్రితం జులైలో ఈ సూచీ 6.69 శాతగా నమోదయ్యింది. వంట నూనెలు, కూరగాయల ధరలు వరుసగా 4.62 శాతం, 13.25 శాతం చొప్పున పెరిగాయి. గడిచిన ఆగస్టులో కూడా సీపీఐ 7 శాతం దిగువన చోటు చేసుకోవచ్చని అనేక ఎజెన్సీలు అంచనాల కంటే అధిక ద్రవ్యోల్బణం నమోదు కావడం ఆందోళనకరం. మధ్యస్థ కాలానికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4శాతానికి కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడంలో వరుసగా గడిచిన 35 నెలల నుంచి విఫలం అవుతూనే ఉంది. ధరల కట్టడిలో ఆర్బీఐ, ప్రభుత్వం విఫలమవుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత హెచ్చు ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యం కాదని ఆర్బీఐనే స్వయంగా పేర్కొంది. ఆగస్టు తొలి వారంలో జరిగిన ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భేటీలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అధిక ద్రవ్యోల్బణ కట్టడి కోసమే రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. అధిక ధరలు ప్రజల పొదుపు శక్తిని హరించివేయడంతో పాటుగా ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.