Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు నెలల కనిష్టానికి పడిపోయిన రేట్లు
- భారత్లో మాత్రం కనబడని మార్పులు
- కేంద్రంపై ప్రజల ఆగ్రహం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేట్లు తగ్గాయి. ధరలు ఏడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. చాలా కాలంగా ముడి చమురు బ్యారెల్కు 100 డాలర్ల కంటే తక్కువగానే ఉన్నది. అయినప్పటికీ భారత్లో మాత్రం పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గటం లేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తమ కష్టార్జితాన్ని పెట్రో ధరల రూపంలో ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నెలల ముందు కేంద్రంలోని మోడీ సర్కారు దేశంలో పెట్రో ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచింది. పెట్రో సుంకంతో వాహనదారులు, సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెట్టింది. అలాంటి సమయంలో పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగబాకటమే కారణంగా కేంద్రం చూపించింది. అయితే, ఇప్పుడు చమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గినప్పటికి దానికి అనుగుణంగా భారత్లో పెట్రోల్, డీజీల్ ధరలలో మార్పులు కనబడకపోవటంపై మార్కెట్ నిపుణులు, సామాన్య ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ధరల ప్రకారం దేశంలోని ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్కు రూ. 7,410 (92.84 యూఎస్ డాలర్ల) వద్ద ట్రేడ్ అవుతున్నది. ఇటు భారత్లో 158 రోజుల పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరలను తగ్గించకుండా కేంద్రం ప్రజల నుంచి పరోక్షంగా రెవెన్యూను రాబడుతున్నదని విశ్లేషకులు తెలిపారు.
పెట్రోల్, డీజీల్ ధరలు ఎందుకు తగ్గటం లేదు?
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో చమురు ధరలు తగ్గకపోవటంపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. చమురు కంపెనీలు తమ గత నష్టాలను పూడ్చుకునేందుకు పెట్రోల్, డీజీల్ ధరలను ఇంకా తగ్గించటం లేదని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు గరిష్టంగా ఉన్న సమయంలో మన దగ్గర పెట్రోల్, డీజీల్ ధరలు కనిష్టంగా ఉన్నాయని గుర్తు చేయటం గమనార్హం. అయితే, ముడి చమురు ధరల తగ్గిన తర్వాత కూడా పెట్రోల్, డీజీల్ ధరలు ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. ఏప్రిల్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ముడి చమురు ధర రికార్డు స్థాయిలో ఉన్నదనీ, దీని కారణంగా జాతీయ చమురు కంపెనీలు చాలా నష్టపోయాయని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు చూస్తే.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 96.72గా, ముంబయిలో రూ. 106.31, చెన్నైలో రూ. 102.63, కోల్కతాలో రూ. 106.03గా ఉన్నాయి. అలాగే లీటర్ డీజీల్ ధర ఢిల్లీలో రూ. 89.62, ముంబయిలో రూ. 94.27, చైన్నైలో రూ. 94.24, కోల్కతాలో రూ. 92.76గా ఉన్నది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66గా, డీజీల్ ధర రూ. 97.82గా నమోదైంది.