Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు స్టాక్స్ 10 శాతం మేర పతనం
- గరిష్ట స్థాయిల నుంచి నేల చూపులు
- వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల బెంబేలు
- మార్కెట్లకు మళ్లీ నష్టాలు..
నవ తెలంగాణ - బిజినెస్ డెస్క్
కొన్నేళ్లుగా దూకుడుగా ఉన్న అదానీ గ్రూపు కంపెనీ షేర్లకు గడ్డు కాలం నడుస్తోంది. ఇటీవల వరుస నష్టాలతో భారీ షాక్ తగులుతోంది. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో పలు స్టాక్స్ ఆల్టైం గరిష్ట స్థాయిల నుంచి నేల చూపులు చూస్తోన్నాయి. సోమవారం ఒక్క సెషన్లోనే అదానీ గ్రూపు స్టాక్స్ 4-10 శాతం మేర పతనం అయ్యాయి. ఆ గ్రూపులో అత్యంత కీలకమైన అదానీ ఎంటర్ప్రైజెష్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర క్షీణించాయి. తుదకు బిఎస్ఇలో ఈ సూచీ 8.51 శాతం లేదా రూ.293.85 నష్టపోయి రూ.3,157.15కి పడిపోయింది. ఉదయం రూ.3,454 వద్ద ప్రారంభమైన సూచీ.. ఓ దశలో ఏకంగా రూ.3,105.90 కనిష్టానికి పడిపోయింది. వరుసగా ఏడో సెషన్లోనూ ఈ సూచీ పతనాన్ని చవి చూసింది. ఈ కాలంలో దాదాపుగా 20 శాతం క్షీణించి జీవితకాల గరిష్టాల నుంచి రూ.3,157కు దిగజారింది. ఈ సూచీల వరుస నష్టాలతో మదుపర్లు బెంబేలెత్తుతున్నారు.
అదానీ గ్రీన్ 32 శాతం ఫట్
అదానీ గ్రూపులో మరో కీలక కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఇంట్రాడే లో 10 శాతం కోల్పోయి రూ.2,919కు పడిపోయింది. తుదకు 6.96 శాతం నష్టపోయి రూ.3,104.65 వద్ద నమోదయ్యింది. 2022 ఆగస్టులో రూ.3,816 గరిష్ట స్థాయిని తాకిన ఈ సూచీ నేల చూపులు చవి చూస్తోం ది. అదానీ గ్రీన్ 8.09 శాతం కోల్పోయి రూ.2,076కు పడిపోయింది. ఈ సూచీ 2022 ఏప్రిల్లో రూ.3,050 రికార్డ్ స్థాయిని తాకగా.. ఇటీవల 32 శాతం కుప్పకూలింది. రూ.3,050 వద్ద కొనుగోలు చేసిన మదుపర్లు భారీ నష్టాలను చవి చూసినట్లయ్యింది. అదానీ విల్మర్ 5 శాతం నష్టంతో రూ. 717.55కు దిగజారింది. ఒక్క పూటలోనే ఈ కంపెనీ 4 లక్షల షేర్లు మేర చేతులు మారాయి. గత నెలలో ఈ సూచీ రూ.841.70 గరిష్ట స్థాయిని తాకగా.. ఇటీవల 15 శాతం కోల్పోయింది. అదానీ పవర్ 5 శాతం పతనమై రూ.355 లోహర్ సర్క్యూట్ను తాకింది. అమ్మకానికి పెడితే కొనేవారు లేకుండా పోగా.. 15వేల షేర్లు పెండింగ్లో ఉండి పోయాయి.
అదానీ ట్రాన్స్మీషన్ ఓ దశలో 6.5 శాతం క్షీణించి రూ.3,074 వద్ద నమోదు కాగా.. తుదకు 5.17 శాతం కోల్పోయి 3,120 వద్ద ముగిసింది. అదానీ పవర్, అదానీ ట్రాన్స్మీషన్ సూచీలు వరుసగా ఆల్టైం గరిష్ట స్థాయిలు రూ.4,237, రూ.432 నుంచి ఇటీవల వరుసగా 27 శాతం, 19 శాతం వరకు నష్టపోయాయి. ఇదే బాటలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 4.34 శాతం నష్టపోయి 785 వద్ద ముగిసింది. సెప్టెంబర్లో రూ.988 ఆల్టైం గరిష్ట స్థాయిని తాకిన ఈ సూచీ 20 శాతం నష్టాన్ని చవి చూసింది. అదానీ గ్రూపు హాట్ స్టాక్స్గా భావించే మదుపర్లకు ఈ పరిణామాలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ, జాతీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు అచీతూచీ వ్యవహారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
సెన్సెక్స్కు 638 పాయింట్ల నష్టం
వరుసగా ఏడు సెషన్లలో నష్టాలు చవి చూసిన భారత స్టాక్ మార్కెట్లకు శుక్రవారం లభించిన ఉపశమనం.. తర్వాత సెషన్కు నిలువలేదు. సోమవారం సెషన్లో బిఎస్ఇ సెన్సెక్స్ 638 పాయింట్లు పతనమై 56,788.81కి దిగజారింది. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 207 పాయింట్లు కోల్పోయి 16,887 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచే మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిలో కొనసాగాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్లో డాక్టర్ రెడ్డీస్, ఎన్టిపిసి, భారతీ ఎయిర్టెల్ స్టాక్స్ మాత్రమే స్వల్పంగా రాణించగా.. మిగితా 27 స్టాక్స్ నష్టాలు చవి చూశాయి.