Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిడ్లను ఆహ్వానించిన దీపమ్
- ప్రయివేటుకు 61శాతం వాటా
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ భాగస్వామ్యంలోని ఐడీబీఐ బ్యాంక్ను అమ్మకానికి పెట్టారు. ఈ బ్యాంక్లోని 60.72 శాతం మెజారిటీ వాటా విక్రయానికి గాను దీపమ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి బిడ్లను అహ్వానిస్తున్నట్టు శుక్రవారం డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) ప్రకటన చేసింది. ఈ డిజిన్వెస్ట్మెంట్లో కేంద్రం 30.48 శాతం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 30.24 శాతం చొప్పున మొత్తంగా 60.72 శాతం వాటాలను విక్రయించనున్నాయి. అక్టోబర్ 7నుంచే దరఖాస్తుల స్వీకరణను ప్రారంభిస్తున్నామని.. డిసెంబర్ 16 వరకు ఆసక్తి కలిగిన వారు బిడ్డింగ్ వేయవచ్చని దీపమ్ సెక్రటరీ ఓ ట్వీట్లో తెలిపారు.
ఆరు మాసాల్లో ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు పేర్కొంది. బ్యాంకులు, విదేశీ రుణదాతలు, షాడో బ్యాంకులు, ఆఫ్షోర్ ఫండ్ సంస్థలు బిడ్లు వేయడానికి అనుమతించ బడ్డాయని దీపమ్ పేర్కొంది. కాగా.. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు బిడ్డింగ్లో పాల్గొనడానికి వీలు లేదని స్పష్టం చేసింది. బిడ్లను ఏక సంస్థగా లేదా కన్సోరియంగా సమర్పించవచ్చని పేర్కొంది. ఐడీబీఐ బ్యాంక్లో ప్రస్తుతం కేంద్రానికి 45.48 శాతం వాటా, ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ బ్యాంక్ విక్రయానికి గతేడాది మేలోనే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.