Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిమిటెడ్ ఎడిషన్ వాహనాల ఆవిష్కరణ
- జులై 15 నుంచి రోడ్లపై పరుగులు
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్కు చెందిన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ గురువారం క్లాసిక్-500 ప్రత్యేక ఎడిషన్ బైక్లను ఆవిష్కరించింది. ప్రపంచ యుద్ధాల సమయంలో 'తంతి చోదకుల' (డిస్పాచ్ రైడర్స్) స్ఫూర్తితో సంస్థ ఈ కొత్త బైక్లను రూపొందించింది. వీటి అమ్మకాలను సంస్థ ఈ ఏడాది జులై 15 నుంచి మొదలు పెట్టనుంది. పాత క్లాసిక్ 500 బైక్నకు దీనికి ఇంజిన్ల అమరిక విషయంలో పెద్దగా ఎలాంటి తేడాలు లేవు.అయితే ఈ బైక్ ప్రస్తుతం మూడు ప్రత్యేకమైన రంగులలో అందుబాటులోకి రానున్నాయి. స్క్వాడ్రాన్ బ్లూ డిస్పాచ్, డసర్ట్ స్ట్రోమ్ డిస్పాచ్లతో పాటు లిమిటెడ్ ఎడిషన్ బ్యాచ్తో అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కో వేరియంట్లో 200 క్లాసిక్ 500 బైక్లను మాత్రమే విక్రయించాలని ఎన్ఫీల్డ్ సంస్థ యోచిస్తోంది. వీటి అమ్మకాలున కేవలం తమ స్టోర్ అన్లైన్ ద్వారానే జరపనున్నట్లు సంస్థ తెలిపింది. అన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి జులై 15 నుంచి వాహనాలను అందించనున్నట్లు సంస్థ సీఈఓ సిద్ధార్థ లాల్ తెలిపారు. ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రధాన కేంద్రాలకు పదాతి దళాలకు మధ్య కీలక సమాచారం చేరవేసేందుకు చోదకులు వాడిన బైక్ల స్ఫూర్తితో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. దేశ రాజధానిలో సంస్థ కొత్త బైక్ సంబంధిత దుస్తుల, ఉపకరణాల స్టోర్ను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా తమకు 400 అవుట్లెట్లు ఉన్నాయని ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్యను 500లకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. మధ్యశ్రేణి బైక్ల విభాగంలో విస్తరించేందుకు తాము యోచిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి తోడు వర్ధమాన మార్కెట్లే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు.