Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో గల దక్కన్ క్రోమైట్ రసాయనిక కర్మాగారానికి చెందిన రూ.4.79 కోట్ల విలువైన ఆస్తులను ఇడి శుక్రవారం జప్తు చేసింది. ప్రమాదకరమైన విష వ్యర్థాలను అక్రమంగా వినియోగించినందున కాలుష్య నియంత్రణ మండలి దక్కన్ క్రోమైట్ కర్మాగారంపై గతంలో కేసు నమోదు చేసింది. కాలుష్య నియంత్రణ మండలి కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఇడి కర్మాగారానికి చెందిన మిర్యాలగూడలోని రూ.4.79 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. 1998లో ఇక్కడ ఏర్పాటైన కర్మాగారం దాదాపు దశాబ్దకాలం పాటు కొనసాగింది. ఈ కర్మాగారం పెద్ద ఎత్తున కాలుష్యాన్ని వెదజల్లింది. నీరు పూర్తిగా కలుషితమయ్యాయి. పరిశ్రమలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు కూడా అనారోగ్య సమస్యలకు గురయ్యారు. పరిశ్రమ కాలుష్యంపై ఎంతో మంది ఉద్యమాలు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకున్న దాఖలాల్లేవు. పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను హైదరాబాద్లోని వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంటుకు తరలించాల్సి ఉంది. వ్యర్థాల తరలింపుకు అయ్యే ఖర్చు గురించి కక్కుర్తి పడిన యాజమాన్యం పెద్ద ఎత్తున వ్యర్థాలను పరిశ్రమ వద్దనే నిల్వ చేసింది. సుమారు లక్షల టన్నుల విష వ్యర్థాలు పోగవడంతో దిక్కుతోచని యాజమాన్యం చేతులెత్తేసింది. మార్చి 2009లో కర్మాగారాన్ని మూసివేసింది. అనంతరం క్రమక్రమంగా కర్మాగారానికి చెందిన యంత్రాలు, సామగ్రిని తరలించుకొని వెళ్లారు. వ్యర్థాలు మాత్రం అక్కడే వదిలేశారు. అందువల్ల దక్కన్క్రోమైట్ ఆస్తులను ఇడి జప్తు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే వ్యర్థాల తొలగింపుకు కూడా కాలుష్య నియంత్రణ మండలి వారు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.