Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్కువ వర్షాలతో ఇబ్బందే
- 7.5 శాతం వృద్ధితోనే సరి
- మూడీస్ అంచనా
నవతెలంగాణ- బ్యూరో
దేశంలో వృద్ధి రేటు పరుగెడుతోందని మోడీ వర్గం చేస్తోన్న ప్రచారం వట్టిదేనని మూడీస్ స్పష్టం చేసింది. భారత ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మల్లా ఉన్న పలెల్లో పరిస్థితి మరీ భిన్నంగా ఉందని ఓ సర్వేలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ స్తబ్దతలోనే కొనసాగుతుందని ప్రముఖ రుణ పరపతి ఎజెన్సీ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ (ఎంఐఎస్) అంచనా వేసింది. ఇందుకు దేశంలో నెలకొన్న సాధారణం కంటే తక్కువ వర్షపాతం ప్రధాన కారణం కాబోతుందని పేర్కొంది. ప్రయివేటు రంగ వినిమయం తగ్గడానికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారే ప్రమాదం ఉందని ఎంఐఎస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ రీసెర్చ్ అనలిస్టు రాహుల్ ఘోష్ అన్నారు. ఎంఐఎస్ తాజా త్రైమాసిక ప్రచురణలో ఈ అంశాన్ని వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వృద్ధి రేటు ఒక్క అంకె స్థాయిలోనే చోటు చేసుకుందని పేర్కొంది. మధ్యకాలిక రుణ పరపతిని ప్రభుత్వ రంగ బ్యాంకులు సమీక్షించుకోవాలని సూచించింది. రానున్న 12 నుంచి 18 మాసాల్లో బ్యాంకులు బలహీన ఆస్తుల నాణ్యత సవాల్ను ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ ప్రభావం మొత్తం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడుతుందని పేర్కొంది.
ఈ నివేదిక ప్రకారం 2015 మధ్యలో గ్రామీణ ఆదాయ వృద్ధి స్తబ్దతలోకి జారుకోవడంతో పాటు ఒక్క అంకె వృద్ధితో సరిపెట్టుకోనుందని అంచనా వేసింది. భారత్కు బిఎఎ3 రేటింగ్ను ఇచ్చింది. ఇది అత్యల్ప పెట్టుబడుల ఆకర్షణ గ్రేడ్ అయినప్పటికీ, భవిష్యత్తులో సానుకూల వృద్ధికి అవకాశాలుంటాయని పేర్కొంది. గ్రామీణ ఆదాయం వృద్ధిలో మాంద్యం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనుందని పేర్కొంది. ఈ క్రమంలో రానున్న త్రైమాసికాల్లో మార్పులు అవసరమని ఎంఐఎస్ తెలిపింది. వృద్ధి రేటుపై గత మే మాసంలో ఓ సర్వే కూడా నిర్వహించింది. ఇందులో 2015-16లో భారత వృధ్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలపై కొన్ని వర్గాలు కినుకు వయించే అవకాశాలున్నాయని ఎంఐఎస్ పేర్కొంది. సంస్కరణల్లో స్తబ్దత సూక్ష్మ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన ఆటంకిగా ఉన్నాయని తెలిపింది. బహుళ పార్టీలు కలిగిన భారత ఫెడరల్ ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణల అమలు కొంత చిక్కుతో కూడిన పని అని, ఇదే సమయంలో మరోవైపు దేశ విత్త సంస్థల పటిష్టతలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయని పేర్కొంది.
అనేక భారత విత్త సంస్థల విధానాలు సానుకూలంగా, బలంగా ఉన్నాయని ఎంఐఎస్ పేర్కొంది. చేపట్టిన కొన్ని సంస్కరణలు ఏళ్ల పాటు ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఉదాహరణకు గతేడాది మోడీ సర్కార్ కార్పొరేటు పన్నులను 30 శాతం నుంచి 25 శాతానికి కుదించింది.
ఈ ప్రభావం వచ్చే నాలుగేళ్లు ఉంటుందని, దీంతో కార్పొరేట్లు తమ పన్నులను తగ్గించుకుంటారని, మరోవైపు వారి మధ్య పోటీతత్వం పెరుగుతుందని పేర్కొంది. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచుతుందని మూడీస్ పేర్కొంది. ప్రధానంగా మౌలిక వసతులు, రక్షణ, బీమా, గనుల రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేత, ఇనుప ఖనిజం మైనింగ్పై నిషేదం ఎత్తివేత వల్ల పలు రంగాల కంపెనీలు లాభపడుతాయని పేర్కొంది. మోడీ సానుకూల వృద్ధి ఎజెండాలో భాగంగా ఇతర రంగాలు లబ్ధి పొందుతాయని అంచనా వేసింది.