Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేల కోట్ల పెట్టుబడులకు టెలికాం కంపెనీల ఆసక్తి
- మంచి ఉద్దేశమేనన్న పారిశ్రామికవేత్తలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన 'డిజిటల్ ఇండియా'లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో ముందుకు వచ్చాయి. బుధవారం ఢిల్లీలో మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి భారీగా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. డిజిటల్ ఇండియా అంటే బలమైన భారత్ అని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. మేక్ ఇన్ ఇండియా లేకుండా డిజిటల్ ఇండియా అంసపూర్తిగా మిగిలిపోతుందన్నారు. ఈ ప్రాజెక్టులో పాల్గొనాల్సిందిగా మంత్రి పారిశ్రామికవేత్తలను అహ్వానించారు. దేశంలో 97.5 కోట్ల మంది మొబైల్ వినియోగదారులున్నారని చెప్పారు. ఈ రంగంలో రిలయన్స్ ఇండిస్టీస్ రూ.2.5 లక్షల కోట్లు, ఆదిత్యా బిర్లా గ్రూపు రూ.44,500 కోట్లు, అనీల్ అంబానీ రూ.10,000 కోట్లు, సునీల్ మిట్టల్ లక్ష కోట్ల రూపాయాల చొప్పున పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. కాగా టాటా గ్రూపు 60,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ఉన్న టిసిఎస్ డిజిటల్ టెక్నలాజీలో భాగంగా భారీగా ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. డిజిటల్ ఇండియాలో భాగంగా 60,000 ఉద్యోగాలను కల్పిస్తామని టాటా గ్రూపు ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నారు. డిజిటల్ ఇండియా ఉద్దేశ్యం టెక్నలాజీలో భారీ మార్పులు తెస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రధాని ముందుచూపు ప్రశంసనీయమని మిస్త్రీ అన్నారు.
డిజిటల్ ఇండియా శక్తివంతమైందని భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అన్నారు. భారత్లో ఐటి మౌలిక వసతుల కోసం 16 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతామని చెప్పారు. తాము కూడా ఇ-హెల్త్, ఇ-ఎడ్యూకేషన్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 4జి అందించడానికి కసరత్తు జరుగుతుందన్నారు.
ఇదో గొప్ప ముందడుగు అని రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. రిలయన్స్ జియో మేక్ ఇన్ ఇండియాకు కట్టుబడి ఉందన్నారు. దేశంలో పరికరాలు తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వెళ్లడించారు. ఈ రంగంలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతామని చెప్పారు. అయితే ఆయన కాలపరిమితి వెల్లడించలేదు. దీంతో 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు.
బ్రాడ్బాండ నెట్వర్క్, వైఫై అభివృద్ధిలో ఆదిత్యా బిర్లా గ్రూపు భారీగా పెట్టుబడులు పెడుతుందని ఆదిత్యా బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు. తమ నెట్వర్క్ ఇప్పటికే 16.5 కోట్ల మందిని అనుసంధానం చేస్తుందన్నారు. రానున్న ఐదేళ్లలో ఈ రంగంలో 7 బిలియన్ డాలర్లు (రూ.44వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నామని చెప్పారు.
కేంద్ర ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా ఈ రంగంలో పెను మార్పులు తెస్తుందని భావిస్తున్నామని రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనీల్ అంబానీ అన్నారు. రానున్న కొన్ని ఏళ్లలో డిజిటల్ ఇండియాలో భాగంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామన్నారు. ముఖ్యంగా డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్, టెలికం విభాగాల్లో ఆసక్తిగా ఉన్నామన్నారు. తమ సంస్థ ఇప్పటికే టెలికం రంగంలో నాలుగో స్థానంలో ఉందన్నారు. తమ ఖాతాదార్లకు డిజిటల్ ఖాతాదార్లను అందిస్తున్నామన్నారు.
ఆర్ధిక, వైద్య, పౌర సేవల్లో డిజిటలైజేషన్ నూతన విప్లవాన్ని సృష్టిస్తుందని విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమజీ అన్నారు. ప్రతి గడపకు డిజిటల్ సేలు అందించాలన్న లక్ష్యం ఉన్నతమైందన్నారు.
'డిజిట్'ల్ ఇండియా
- 2,50,000 పాఠశాలలకు వైఫై కనెక్షన్
- 4 లక్ష ప్రాంతాలలో పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ పాయింట్లు
- 2020 నాటికి ఎలక్ట్రానిక్ దిగుమతులను 'సున్నా' స్థాయికి చేర్చడం
- 1.7 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ కల్పన, మరో 8.5 కోట్ల మందికి పరోక్ష ఉపాధి
- 1,50,000 తపాలా కార్యాలయాలను బహుళ సేవాల కేంద్రాలుగా అభివృద్ధి పరచడం
- 42,300 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ
- 2,50,000 గ్రామ పంచాయితీలకు బ్రాడ్బ్యాండ్ సేవలు
- 10 లక్షల మంది గ్రామీణ విద్యార్థులు ఐటీ ఉద్యోగాలను పొందేలా శిక్షణ
- 50,000 మంది గ్రామీణ కార్మికులను సేవల కోసం టెలికాం సంస్థలు నియమించుకోనున్నాయి.