Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఇన్వెస్ట్ ఇండియా'లో కేటీఆర్ విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణం కల్పిస్తోందని, రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఐటీ, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహాకాలు, మౌలిక వసతులు కల్పిస్తోందని వివరించారు. మేకిన్ ఇండియాలో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 'ఇన్వెస్ట్ ఇండియా' కార్యక్రమంలో రాష్ట్రం తరపున కేటీఆర్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్వెస్ట్ ఇండియా సీఈవో, ఎండీ దీపక్బాగ్లా, వైస్ ప్రెసిడెంట్ దుశ్యంత్ ఠాకూర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. గడిచిన మూడేండ్లలో రాష్ట్రంలో ఏర్పాటైన అంతర్జాతీయ బహుళ కంపెనీలతో పాటు రాష్ట్రం పొందిన పలు అవార్డులను ఈ సందర్భంగా వివరించారు. వ్యాపారం సులభతరంగా మార్చిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా తైవాన్ పారిశ్రామికవేత్తల బృందంతో అరవింద్కుమార్ భేటీ అయ్యారు. టీఎస్-ఐపాస్, టీ హబ్ అమలుతీరుపై ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పెట్టుబడిదారులు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు.
పౌర విమానయాన మంత్రితో కేటీఆర్ భేటీ
కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోకగజపతిరాజును కేటీఆర్ మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి, ప్రాంతీయ అనుసంధానంపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధిలో విమానయానం కీలకమని, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.