Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక సేవల శాఖను పూర్తిగా మూసివేయాలి
- అప్పుడే బీబీబీకు స్వతంత్రత
- మరింత స్వయంప్రతిపత్తి తేవాలి : ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్
ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఇందుకు గాను ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యవహారాలను చూస్తున్న పరిపాలన ఆర్థిక శాఖలోని ఆర్థిక సేవల డిపార్టుమెంట్ను మూసివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా బ్యాంకు బోర్డ్సు బ్యూరో సమర్థంగా పని చేయడం మొదలవుతుందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక రాజధానిలో 'ఐ డూ వాట్ ఐ డూ..' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బ్యాంకుల పరిపాలన, నిర్వహణలో ప్రభుత్వం జోక్యం తగ్గించడంతో పాటు అర్థిక నిపుణులకు భాగస్వామం కల్పించేలా బ్యాంక్ బోర్డ్స్ బ్యూరోను (బీబీబీ)ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అధినేతలను నియమించడం, బోర్డు సభ్యులను ఎంపిక చేయడంతో బ్యాంకులు మరింత మెరుగ్గా అభివృద్ధి పథంలో సాగేందుకు అవసరమైన వ్యూహాలను అందించడం బీబీబీ ప్రధాన కర్తవ్యం. బీబీబీ ఏర్పాటై దాదాపు రెండేండ్లు కావస్తున్నప్పటికీ అది క్రియాశీలకంగా పని చేస్తుండక పోవడాన్ని రాజన్ ఈ సందర్భంగా ప్రస్తా వించారు. ఫలితంగా బ్యాంకులు ప్రభుత్వ వర్గాల చెప్పుచేతల్లోంచి బయటకు రాలేకపోతున్నట్టుగా తెలిపారు. ప్రభుత్వానికి బీబీబీకి మధ్య దూరం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దీనికి తోడు బీబీబీని మరింత సమర్థమంతంగా మార్చేందుకు, దాని స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు గాను కొన్ని చర్యలు అవసరమని రాజన్ వివరించారు. దీర్ఘకాలంలో బీబీబీ వాస్తవంగా స్వతంత్య్ర బోర్డుగా ఎదిగి ప్రభుత్వ బ్యాంకుల సీఈవోలను ఎంపిక చేయడం, అవసరమనుకుంటే వారిని తొలగించే సామర్థ్యాన్ని అందుకొనేలా చూడాలని అన్నారు.