Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ప్రస్తుతం కొంత ప్రతికూలతను ఎదుర్కొంటున్నప్పటికీ త్వరలోనే తిరిగి కోలుకుంటుందని విప్రో సంస్థ చీప్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగం పనైపోయిందని.. ఈ రంగం దాదాపు అంపశయ్యపైకి చేరుకుందంటూ వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇది వాస్తవ పరిస్థితిని ఎక్కువ చేసి చెప్పేయత్నమని పేర్కొన్నారు. రానున్న మూడు-అయిదేండ్ల కాలంలో పరిశ్రమ మేటిగా రాణించి రెండంకెల వృద్ధిని అందుకోగలదని పేర్కొన్నారు. ఐటీ రంగంతో పాటు తమ సంస్థ కూడా మేటి వృద్ధిని అందిపుచ్చుకోగలదని పేర్కొన్నారు. సంస్థలో తన ప్రస్థానం మొదలై దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన మింట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా ఐటీ పరిశ్రమ ఒక్క అంకె వృద్ధినే నమోదు చేస్తూ వస్తోందని పేర్కొన్నారు. దీనికి కారణం ఇప్పటి వరకు ఐటీ సంస్థలు సంప్రదాయక ఐటీ సేవలను అందిస్తూ వస్తుండడమేనిని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగదారు డిమాండ్లో మార్పునకు తోడు క్లౌడ్ వంటి డిజిటల్ టెక్నాలజీ విభాగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఐటీ కొత్త పుంతలు తొక్కుతూ నూతన వృద్ధి రేటును అందుకోగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.