Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చీఫ్ కేవీ చౌదరి
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఖాతాల్లో జమ చేసిన డిపాజిట్లపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చీఫ్ కేవీ చౌదరి తెలిపారు. దీనిపై ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు పరిమిత సమయంలో కేటాయించారు. దీంతో బ్యాంకు ఖాతాల్లోకి భారీగా డిపాజిట్లు పెరిగాయి. ఇక 'పెద్దనోట్ల రద్దు తర్వాత ఉద్యోగులు జమ చేసిన నగదంతా వారి ఆదాయం నుంచే చేశారా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టనున్నాం. ఇప్పటికే నోట్ల రద్దు తర్వాత వ్యక్తిగత ఖాతాలను సీబీడీటీ పరిశీలిస్తోంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చౌదరి తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరి ఖాతాలను కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు. ఒకవేళ వారి ఖాతాల్లో జమ అయిన నగదులో ఏమైనా అవకతవకలు కన్పిస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు. బ్యాంకు డిపాజిట్లలో అవకతవకలు జరిగి ఉండొచ్చనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చౌదరి తెలిపారు.