Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వంటి బడా ఆర్థిక సంస్కరణల మూలంగా దేశంలోని ప్రధాన ఆర్థిక వ్యవహారాల అధికారుల్లో (సీఎఫ్వో) విశ్వాసం సన్నగిల్లుతూ వస్తోంది. సీఎఫ్వోల్లో విశ్వాసం ఏడాదిన్నర కనిష్టానికి పడిపోయినట్టుగా డూన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ సర్వేలో తేలింది. జులై నుంచి సెప్టెంబర్ కాలానికి గాను చేపట్టిన సర్వేలో ఈ అంశం వెల్లడయ్యింది. ఏడాది ప్రాతిపదికన పోల్చితే 2016-17 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో సీఎఫ్వోల్లో విశ్వాస సూచీ 11 శాతం క్షీణించింది. ఇంతక్రితం త్రైమాసికంతో పోల్చితే విశ్వాసం 5.7 శాతం మేర తగ్గిందని డూన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ సర్వే తెలిపింది. కంపెనీల ద్రవ్య లభ్యతపై కేవలం 41 శాతం మంది సీఎఫ్వోలు మాత్రమే ఆశావాదంతో ఉన్నారు. 57 శాతం మంది సీఎఫ్వోలు ధరల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చర్యల వల్ల ముఖ్యంగా నిర్మాణ రంగం అతి ఎక్కువ విశ్వాసాన్ని కోల్పోయింది. వర్థమాన మధ్యస్థ వస్తువుల రంగంలో విశ్వాసం బాగానే ఉంది. దేశంలోని కంపెనీల స్థూల ఆర్థికాంశాలు, వాటి పరిస్థితి, వ్యాపార రిస్కు వాతావరణం, సూక్ష్మ ఆర్ధిక పరిస్థితులను ఈ సర్వేలో పరిగణలోకి తీసుకున్నారు.ప్రధానంగా దేశీయ డిమాండ్లో స్తబ్దత, అంతర్జాతీయ బలహీనతలు కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లపై ప్రభావం చూపాయని డూన్అండ్ బ్రాండ్స్ట్రీట్ మేనేజింగ్ డైరెక్టర్ మనిష్ సిన్హా పేర్కొన్నారు. బ్యాంకింగ్ ఆస్తులు ఒత్తిడికి గురి కావడంతో పాటు పబ్లిక్ ఫైనాన్స్పై ప్రభావం విశ్వాస స్థాయిలను దెబ్బతీశాయన్నారు. కాగా కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు ఇప్పటికే బలహీనంగా ఉన్నాయన్నారు.