Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోకి బంగారం దిగుమతులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత ఏడాది తొలి అర్థ భాగంలో బంగారం దిగుమతులు రెండింతలు ఎగిసి తద్వారా 16.95 బిలియన్ డాలర్లకు చేరినట్టుగా వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో బంగారం దిగుమతులు దేశ కరెంటు ఖాతాలోటు(క్యాడ్)కు దారి తీస్తున్నాయి. గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో బంగారం దిగుమతుల విలువ 6.88 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. అంతకు క్రితం ఏడాది సెప్టెంబర్ మాసంతో పోలిస్తే గత నెలలో బంగారం దిగుమతులు 5శాతం మేర తగ్గి 1.80 బిలియన్ డాలర్ల నుంచి 1.71బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ఈ క్రమంలో దేశీయ కరెంటు ఖాతా లోటు ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయితే ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం దిగుమతులు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత పసిడి వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది.