Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుకొచ్చిన సంజీవ్ గోయేంకా గ్రూప్
- తద్వారా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు : మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుగానూ మంత్రి కెటి రామారావు సోమవారం కోల్కతాలో పర్యటించారు. ఈ మేరకు పలువురు బడా పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమాయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.200 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టేందుకు అర్పీ సంజీవ్ గ్రూప్ ముందుకొచ్చినట్టుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ వద్ద సుమారు 20 ఎకరాల్లో పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయనుందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు వెయ్యి మందికి ప్రత్యేక్ష ఉపాధి లభించనుందని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ కంపెనీ తమ ఈ-విటా, టూ-యమ్మీ బ్రాండ్లను ఇక్కడి నుంచి తయారు చేస్తుందని ఆయన వివరించారు. పుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో తెలంగాణ రైతులకు సహాకారం అందించాల్సిందిగా గోయేంకా గ్రూప్ను మంత్రి కోరారు. ఈ సందర్భంగా తమ ఉత్పత్తులను మార్కెట్ ధరకు విక్రయించేందుకు స్థానిక ప్రాంతాల్లోనే రైతుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకుగానూ సంస్థ అంగీకరించిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను, రాష్ట్రానికి ఉన్న బలాలను గుర్తించి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుక వచ్చిన సంజీవ్ గోయేంకా గ్రూప్కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మెన్ హేమంత్ కనోరియాతో మంత్రి భేటీ అయ్యారు. మౌలిక వసతుల రంగంలో భారీ పెట్టుబడులు కలిగిన గ్రూప్.. తెలంగాణలో చేపట్టేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల గురించి వివరాలను మంత్రి అందజేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తమ ప్రభుత్వం పుడ్ పార్కుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని..ఇందుకోసం కూడా ముందుకు రావాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఇండిస్టీయల్ పార్కులకు ఆర్థిక సహాకారం అందించే అవకాశాలను పరిశీలిస్తామని హేమంత్ కనోరియా తెలిపారు. దీనికితోడు మంత్రి సూచనల మేరకు త్వరలో జపాన్, చైనా, కొరియా పెట్టుబడిదారులతో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సహాకరిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశం తర్వాత కోల్కతాలోని ప్రముఖ పెట్టుబడిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే సంపూర్ణ సహాకారం అందిస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.