Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారు చౌకగా సమస్త కార్డు సమాచారం
- డార్క్ వెబ్సైట్ల ద్వారా విరివిగా విక్రయిస్తున్న ముఠాలు
- వినియోగదారులకు తెలియకుండానే కార్డులు ఖాళీ
- బ్యాంకుల వద్ద లబోదిబోమంటున్న యూజర్లు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఆన్లైన్ వేదికగా క్రెడిట్ కార్డుల సమాచారాన్ని కారు చౌకగా విక్రయిస్తున్న వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వన్టైమ్ పాస్వార్డ్ (వోటీపీ) అవసరం లేకుండానే ఆన్లైన్ లావాదేవీలు జరుపుకొనే వెసులుబాటునిచ్చే ఈ- కామర్స్ వెబ్సైట్లే లక్ష్యంగా క్రెడిట్ కార్డుల సమాచారాన్ని హ్యాకర్లు దొంగలిస్తున్నారు. ఆ తరువాత ఈ సమాచారాన్ని కేవలం రూ.500 నుంచి రూ.800లకే కారు చౌకగా నెట్లో అమ్మెస్తున్నట్టు తెలుస్తోంది. బిట్కాయిన్ల రూపంలో ఈ డేటా కొన్న ముఠా సభ్యులు ఆన్లైన్లో విమాన టిక్కెట్ల కొనుగోలు, హాలిడే ప్యాకేజీలతో పాటు విలువైన వస్తువులను దొంగ చాటుగా కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీ పూర్తయి.. జరగాల్సి నష్టమంతా జరిగిన తరువాత సంబంధిత యజమానికి కార్డు గుళ్లయినట్టు తాపీగా సమాచారం అందుతోంది. దీంతో వారు సంబంధిత బ్యాంకుల వద్దకు వచ్చి లబోదిబోమంటున్నారు.
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు!
పాకిస్థాన్కు చెందిన అంతర్జాతీయ సైబర్ క్రిమనల్ షేక్ అఫ్జల్ కా షోజీ నేతృత్వంలోని ముఠా ఎక్కువగా క్రెడిట్ కార్డుల సమాచారాన్ని దొంగిలించి అంతర్జాతీయంగా డార్క్ వెబ్సైట్ల ద్వారా కారు చౌకగా విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా ఇండోర్లో ఈ ముఠాతో సంబంధం ఉండి భారీగా దొంగ సమాచారంతో ఆన్లైన్ కొనుగోళ్లు జరుపుతున్న ఇద్దరిని మధ్య మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వివరాలు సేకరించగా డార్క్ వెబ్సైట్ ద్వారా సైబర్ గ్యాంగ్ సభ్యులు క్రెడిట్ కార్డు సమాచారాన్ని వీరికి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తక్కువ సొమ్ముకే ఎక్కువ మొత్తంలో లబ్ది పొందే అవకాశం కలుగుతుండడంతో పెడదోవ పట్టిన యువత ఈ సమాచారాన్ని కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ఓటీపీ అవసరం లేకుండా ఉండే ఈ-కామర్స్ సైట్ల వాడకం విషయంలో కార్డు హోల్డర్లు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.