Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జియో దెబ్బకు టెల్కోలు విలవిల
- ఉద్యోగులపై వేటు వేస్తున్న సంస్థలు
- ఇప్పటికే 25% ఉద్యోగాలు ఊడాయి
- నియామకాలకు ఇప్పటికే ఫుల్స్టాప్
- రూ.5లక్షల కోట్ల రుణ భారంలో టెల్కోలు
- విలీనాలతో మరింత దిగజారనున్న పరిస్థితి
- ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారత టెలికాం రంగంలో పెను సంచలనంగా దూసుకువచ్చిన రిలయన్స్ జియో సంస్థ సృష్టిస్తున్న ప్రకంపనలకు వేలాది కొలువులు ఊడుతున్నాయి. నియామక సంస్థల అధ్యయన నివేదిక మేరకు జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో పని చేస్తున్న దాదాపు పావు శాతం మంది కొలువులు కొండెక్కినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో జియో పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలను మొదలు పెట్టే నాటికి ఈ రంగంలో మొత్తంగా దాదాపు 3,00,00 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. ఏడాది తిరిగే సరికి ఇందులో దాదాపు 25% మంది తమ కోలువులు కోల్పోయారని తెలుస్తోంది. కొత్త టెలికాం రాక కారణంగా దాదాపు 75,000 మంది కొలువులు కొండెక్కినట్టుగా వివిధ ఉద్యోగ నియామక సంస్థల గణాంకాల ప్రకారం తెలుస్తోంది. కొత్త టెలికాం సంస్థ రాకతో 4జీ విప్లవం, సేవల ధరలు పడిపోవడం, ధరల పోటీ కారణంగా ట్యారిఫ్లు తగ్గిస్తుండడం, టెలికాం రంగంలో విలీనాలు, టవర్ సంస్థలు తమ వ్యాపారాలను విక్రయానికి పెడుతుండడంతో ఆయా సంస్థల్లో ఉద్యోగుల జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యాయి.
కొత్త నియామకాలు అంతంతే..
టెలికాం రంగంలో ఆదాయాలు తగ్గుతుండడంతో ఆయా సంస్థలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగుతున్నాయి. వినియోగదారుల తాకిడి తగ్గుతుండడంతో ఆయా సంస్థలు డిమాండ్ అంతగా లేని చాలా చోట్ల తమ అవుట్లెట్లను మూసివేస్తున్నాయి. మార్కెటింగ్ సిబ్బందిని తొలగిస్తున్నాయి. దీనికి తోడు ఆపరేషన్లు తగ్గడంతో ఆయా సంస్థలు పర్మెనెంట్, కాంట్రాక్టు ఉద్యోగులను తగ్గిస్తూ వస్తున్నాయి. టెలికాం సంస్థల వ్యయంలో ఉద్యోగుల జీత భత్యాల భారం దాదాపు 4-5 శాతం వరకు ఉండనుంది. దేశీయ టెలికాం రంగంలోకి కొత్త సంస్థ భారీస్థాయిలో అడుపెట్టనుందన్న వార్తలు, 4జీ ప్రభంజనం నేపథ్యంలో చాలా టెలికాం సంస్థలు తమ ఉద్యోగులకు గత రెండు మూడేండ్లుగా జీతాల పెంపును నిలిపివేశాయి. సంస్థల్లో ఉద్యోగాలు వదిలి వెళ్లిన వారి స్థానంలో కొత్తవారిని కూడా కొలువుల్లోకి తీసుకోవడం లేదు. దీంతో టెలికాం రంగంలో ఉన్న ఉద్యోగాలు పోతుండడంతో పాటు కొత్త నియామకాలు దాదాపు నిలిచిపోయాయి. కేవలం ఉన్నత స్థాయి, టెక్నాలజీ అప్గ్రెడేషన్కు సంబంధించిన రంగాల్లోనే కొత్త నియామకాలు జరుగుతున్నట్టుగా నియామక సంస్థలు చెబుతున్నాయి. దీంతో ఏడాది తిరిగే సరికి టెలికాం రంగంలో దాదాపు 25% మంది ఉద్యోగులు తమ కొలువులను కోల్పోయినట్టుగా నియామక సంస్థల నివేదికలు ద్వారా తెలుస్తోంది.
విలీనాలతో మరింత ప్రమాదం...
టెలికాం రంగంలో నెలకొన్న పోటిని తట్టుకొని నిలిచేందుకు గాను పలు టెలికాం సంస్థలు ఇప్పటికే విలీనాల బాట పట్టాయి. వొడాఫోన్- ఐడియా సంస్థలు త్వరలోనే విలీనం కానున్నాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్ సంస్థ టాటా టెలీసర్వీసెస్ను తన ఆధీనంలోకి తీసుకోనుంది. మరోవైపు ఆర్కామ్, ఎయిర్సెల్ సంస్థలు తమ విలీనపు చర్చలు విఫలం అవడంతో కొన్ని సర్కిళ్లలో తమ సేవలను నిలిపివేయనున్నాయి. దీంతో ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. టెలికాం రంగంలో దాదాపు 50% ఉద్యోగులు మధ్యశ్రేణి నిర్వహణ విభాగంలోనే పని చేస్తుంటారు. వీరిలో దాదాపు 25-30% మందిని ఆయా సంస్థల వారు ఉద్యోగాలు వదిలి వెళ్లాలని కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో చాలా మంది కింది స్థాయి ఉద్యోగులపై ప్రభావం పడుతోంది. గత కొంత కాలంగా తమ సంస్థలో పని చేసిన ఉద్యోగుల విషయంలో చాలా సంస్థలు కొంత మానవతా దృక్పథంతోనే వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు 3-6 నెలల జీతాన్ని పరిహారంగా ఇస్తూ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. మరికొని సంస్థలు తమ ఉద్యోగులకు ముందస్తు నోటీసులను జారీ చేస్తూ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వెతుక్కొమ్మని మరీ సూచించి ఇంటికి పంపుతున్నాయి. మరికొని సంస్థలు అత్యాధునిక టెక్నాలజీపై శిక్షణనిచ్చి కొందరిని పెద్ద ఉద్యోగాలకు, ఇతర ప్రత్యామ్నాయ విభాగాల్లోకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వెండార్ కంపెనీలలో ఉద్యోగాల కోత ఎక్కువగానే ఉంది. ఈ రంగంలో దాదాపు 35-40 శాతం మంది ఎంప్లాయిస్ కొలువులను వదులుకొంటున్నారు. విలీనాలు జోరందుకుంటుండడంతో రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కొలువులు పోయిన వారు చాలా మంది ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఉద్యోగ నియామక కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. అయితే టెలికాం రంగంలో పరిస్థితి మరింతగా జటిలమవుతుండడంతో వీరికి మళ్లీ అదే రంగంలో కొలువుల లభించడం కష్టమేనని నియామక సంస్థల వారు చెబుతున్నారు. ఇక ఈ రంగంలో గరిష్టంగా అధ్యయం చేస్తే మరో 20,000కంటే ఎక్కువ మందికి కొత్తగా ఉద్యోగాలు లభించే పరిస్థితి కనిపించడం లేదని వారు చెబుతున్నారు. దీంతో చాలా మంది రిటైల్ చైన్, ఎఫ్ఎంసీజీ, మార్కెటింగ్ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తే మేలని వారు చెబుతున్నారు.
దాదాపు రూ.5 లక్షల కోట్ల అప్పులు..
జియా రాకతో దేశీయంగా టెలికాం సంస్థలు భారీ కుదుపునకు గురయ్యాయి. ఆదాయాలు పడిపోవడంతో రంగపు ఆర్థిక పరిస్థితి మరీ దిగజారింది. ఉమ్మడిగా ఈ రంగంలోని సంస్థలు దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర రుణ భారాన్ని కలిగి ఉన్నాయి. టెలికాం సంస్థలన్నీ దాదాపు స్పెక్ట్రమ్ కొనుగులుకు ఈ నిధులను వినియోగించాయి. టెలికాం సంస్థలు అధిక మొత్తం అప్పులను ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే రుణంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో టెలికాం రంగంలోని అనిశ్చితి క్రమంగా బ్యాంకింగ్ రంగంపై పడుతోంది. ఇప్పుడు ఈ బాకీలు తిరిగి వస్తాయో లేదోనన్న అయోమయంలో బ్యాంకులు కూడా ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు తమ బ్యాంకులకు చెందిన సొమ్ము టెలికాం సంస్థల పెట్టుబడుల రూపంలోని ప్రీజ్ కావడంతో ఇతర చిన్న, మధ్య తరగతి సంస్థలుకు రుణాలు అందించలేని స్థితికి బ్యాంకులు చేరుకున్నాయి.