Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సులభ వ్యాపార నిర్వహణలో 100వ స్థానానికి భారత్!
- అయినా పెద్దగా పురోగతి లేని విదేశీ పెట్టుబడులు
- అంతకంతకు తగ్గుతున్న పెట్టుబడుల ప్రతిపాదనలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రపంచ బ్యాంకు తాజాగా వెల్లడించిన సులభ వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ) ర్యాంకింగ్స్ - 2018 జాబితాలో భారత్ ఈ ఏడాది తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. మొత్తం 190దేశాల జాబితాలో ఈ సారి భారత్కు 100వ ర్యాంక్ లభించింది. గతేడాది మన దేశం ఈవోడీబీలో 130వ స్థానంలో ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 30స్థానాలు ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ మొదటిస్థానంలో నిలవగా, తర్వాత స్థానంలో సింగపూర్ నిలిచింది. భారత్తో పోల్చితే చూస్తే మన పొరుగు దేశం చైనా మెరుగైన ర్యాంక్ (78వ స్థానం)ను సాధించింది. ప్రధానంగా లైసెన్సింగ్ వ్యవస్థలో సంస్కణలతో పాటు పెట్టుబడిదారు ప్రయోజనాల పరిరక్షణ, పన్ను నిబంధనలు, దివాలా పరిష్కారాలకు సంబంధించిన అంశాల్లో వేగంగా పురోగమించడం భారత్ మెరుగైన ర్యాంకును అందుకొనేందుకు దోహదం చేసిందని ప్రపంచబ్యాంకు అభిప్రాయపడింది.
పెద్ద నగరాలే ప్రాతిపదికగా ర్యాంకింగ్..
ఈవోడీబీ ర్యాంకింగ్స్నకు గాను ప్రపంచ బ్యాంకు ముంబయి, ఢిల్లీ వంటి పెద్దనగరాలను ప్రాతిపదికగా తీసుకొని ప్రపంచ బ్యాంకు ఈ ర్యాంకులను జారీ చేసింది. అయితే ఏ కాన్పూరో లేదా ఇతర నగరంలో కానీ ఈ సర్వే నిర్వహించి నట్టయితే ఫలితాల ు వేరుగా ఉండేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ర్యాంక్ నేపథ్యంలో దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని అంచనా వేయలేం. దీనికితోడు ప్రసుత్తం భారత్ సాధించిన ఈ ర్యాంక్ అంత గొప్పదేమి కాదు. గతంలోనే అంటే 2006లోనే భారత్ 116వ ర్యాంక్ను సాధించింది. అలాంటప్పుడు ఇప్పుడు వచ్చిన ర్యాంక్కు పెద్దగా పొంగిపోనవసరం లేదన్నది కాదనలేని సత్యం. మరోవైపు ఈ ర్యాంక్ వల్ల కేవలం విదేశీ పెట్టుబడుదారులకే లబ్ది చేకూరుతుంది. తప్ప దేశీయ పెట్టుబడుదారులకు ప్రయోజనం శూన్యం. ఇదిలా వుంటే ఇప్పటికీ స్థానిక పెట్టుబడిదారులకు ఒక వ్యాపారం ప్రారంభించడానికి 12 రకాలైన విధానాలను పాటించాల్సి ఉండటం శోచనీయం.
పదిలో ఆరిటింలో కిందకే..
ప్రపంచ బ్యాంకు మొత్తం పది అంశాలకు చెందిన సూచీలను ప్రాతిపదికగా తీసుకొని ఆయా దేశాలకు ర్యాంకింగ్లను కేటాయించింది. ఇందులో కేవలం నాలుగు అంశాల్లోనే భారత్లో అనుకూలత ఉందని.. మిగతా ఆరింటిలో మన దేశ పరిస్థితి అంతంతగానే అని తేల్చి చెప్పింది. దేశంలో ఇప్పటికే వ్యాపారాన్ని మొదలుపెట్టే అంశంలో మన ర్యాంక్ పడిపోయింది. అంతకు ముందు ఏడాది ఈ అంశంలో భారత ర్యాంక్ 155 వద్ద ఉండగా ఈసారి అది కాస్తా 156కు దిగజారింది. విద్యుత్ కనెక్షన్ అందించే అంశంలో మన ర్యాంక్ 29వ స్థానానికి పడిపోయింది గతేడాది ఈ ర్యాంక్ 26 వద్ద ఉండింది. మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా మన ర్యాంకు 143 నుంచి 146కు కుంగింది. కాగా ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశంలో మన స్థానం 138ర్యాంక్ నుంచి ఏకంగా 154కు కుంగింది. ఈ లెక్కన చూస్తే దేశంలో కంపెనీలు ప్రారంభించడానికి అవసరమైన మొదటి నాలుగు ప్రమాణాల్లో దేశం అంతగా రాణించనప్పుడు..కొత్త కంపెనీలు, పెట్టుబడుల అంశంలో పునరాలోచన చేయాలి. మరో విషయం ఏమిటంటే ప్రపంచబ్యాంకు విధానాలే కార్పొరేట్లకు లబ్ది చేసే విధంగా ఉంటాయి. ఇతర సూచీకలైన పన్నులు చెల్లించే అంశంలో మన ర్యాంకు ఈసారి 119 చేరగా, మరో సూచీక దివాళా ప్రక్రియలో ఈ ర్యాంకు 103కు చేరింది. దివాలా సమస్యల పరిష్కరాలు కేవలం కార్పొరేట్ల ప్రయోజనానికి ఉపయోగపడుతుంది. మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల రక్షణలో 13వ ర్యాంకు నుంచి 4వ ర్యాంక్ సాధించగా.. రుణాలు పొందే విషయంలో 44 నుంచి 29 వద్ద నిలిచింది, నిర్మాణ అనుమతులు పొందడంలో 185 నుంచి 181కు వద్దకు వచ్చింది. కాంట్రాక్టుల అమలులో సూచీకలో 172 నుంచి 154కి మెరుగుపడింది. ఇదిలా ఉంటే కాంట్రాక్టుల అమలు గడువు యథావిధిగా 146 రోజులుగానే ఉంది. ఈ ర్యాంకుల విషయంలో నిజానికి కూడా భారత్ సాధించిన మెరుగుదల ప్రశంసనీయమైనది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే భారత్ ర్యాంక్ మెరుగుపడడానికి దోహదపడిన పలు అంశాలు కూడా బడా పెట్టుబడిదారులకు లబ్ది చేస్తాయి. కార్పొరేట్ల ప్రయోజనాలు, వారికి అనుకూలంగానే ప్రపంచ బ్యాంకు నిర్ణయాలు ఉంటాయనే విషయంలో సంశయం అక్కర్లేదు.
తిరోగమనంలో పెట్టుబడి ప్రతిపాదనలు
ఈవోడీబీలో భారత ర్యాంకింగ్ మెరుగు పడిన నేపథ్యంలో ఇక దేశంలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందనుకోవడానికి లేదు. ఎందుకంటే గత నాలుగేండ్లుగా మోడీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు తక్కువే. దీనికి తోడు పెట్టుబడుల రాక క్రమంగా క్షీణిస్తోంది. కేర్ రేటింగ్ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం...దేశంలో పెట్టుబడుల ప్రతిపాదనల్లో, వాస్తవ పెట్టుబడుల్లోనూ పతనం చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. 2017 జనవరి నుంచి సెప్టెంబర్ కాలంలో వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడి ప్రతిపాదనలు 14.6 శాతం క్షీణించి 1,528 ప్రతిపాదనలకు పరిమితమయ్యాయి. 2016 ఇదే కాలంలో 1,749 ప్రతిపాదనలు వచ్చాయని కేర్ రేటింగ్స్ అధ్యయనంలో వెల్లడయ్యింది. విలువ పరంగా క్రితం జనవరి నుంచి సెప్టెంబర్ కాలంలో రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో రూ.3.38 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయి. కేర్ రేటింగ్స్ 3,864 కార్పొరేట్ కంపెనీల నుంచి సమాచారం సేకరించి ఈ రిపోర్టును తయారు చేసింది. ఈ క్రమంలో దేశంలో స్థూలంగా పెట్టుబడుల వాతావరణం స్తబ్దతలోనే ఉందని కేర్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. మరోవైపు మోడీ ప్రభుత్వ ప్రచారం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇదిలా ఉంటే భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎస్ఎంఈల) సంస్థల పరిస్థితి మరింత దయనీయంగా తయారు కానుందని నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు దేశీయంగా ఉన్న బడా వ్యాపార సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తున్నాయి. దీన్ని బట్టి దేశ పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఎస్ఎంఈలు ఉద్యోగాల కల్పనకు ఎంతో కీలకమన్న విషయాన్ని మోడీ ప్రభుత్వం విస్మరించడం విచారకరం.
టార్గెట్ 50 లక్ష్యం నెరవేరేనా..
వచ్చే ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదికలో భారత్ 50వ ర్యాంక్నకు చేర్చడమే తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మరీ ఆ లెక్కన చూస్తే భారత్కు ఇది సాధ్యమేనా? అది ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈవోడిబీలోని మొత్తం పది సూచీకల్లో భారత్ ఎంతో మెరుగుదల సాధించాలి. కానీ ప్రస్తుతం దేశంలో కంపెనీల ఏర్పాటు చేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాగా ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలోనూ అంతంతగానే ఉన్నాము. అలాంటప్పుడు భారత్ ఇప్పట్లో 50వ ర్యాంకు సాధించడం కష్టమేనని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో అనూహ్యంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడం వల్ల ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురి అవుతుందని ఇప్పటికే పలు నివేదికలు బహిర్గతం చేశాయి. మరోవైపు జులై నుంచి అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యాపార వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని పెంచింది. ఈ ప్రభావం కూడా వస్తు అమ్మకాలపై పడిందన్న విశ్లేషణలు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది ప్రపంచబ్యాంకు నివేదికలో జీఎస్టీ ప్రభావం ఉండొచ్చునని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాల న్నీ పెట్టుబడులు, పెట్టుబడి ప్రతిపాదనలపై ప్రభావం చూపుతున్నాయని నిపు ణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టార్గెట్ 50 లక్ష్యానికి చేరడం భారత్కు అంత సులభమేమీ కాదన్నది స్పష్టంగా తెలుస్తోంది.