Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తలసరి స్థూల జాతీయోత్పత్తి(పీసీజీడీపీ) గణాంకాల్లో భారత్ పరిస్థితి స్వల్పంగా మెరుగు పడింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం పీసీజీడీపీ జాబితాలో భారత్ 127వ స్థానం నుంచి 126వ స్థానానికి ఎగబాకింది. మొత్తం 200ల దేశాల కొనుగోలు శక్తి ప్రాధాన్యత (పీపీపీ) ఆధారంగా ఐఎంఎఫ్ ఈ పీసీజీడీపీ గణాంకాలను వెల్లడించింది. గతేడాది భారత తలసరి జీడీపీ 6,690 డాలర్లు ఉండగా.. తాజాగా ఇది 7,170 డాలర్లకు చేరడం ద్వారా భారత ర్యాంకు కాస్త మెరుగుపడింది. అయితే బ్రిక్స్ దేశాలతో పోలిస్తే ఇంకా వెనకబడే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ విషయంలో అత్యంత ధనిక దేశంగా ఖతార్ నిలిచింది. ఖతార్ తలసరి జీడీపీ 1,24,930 డాలర్లతో మొదటిస్థానంలో నిలవగా.. మకావు 1,14,430 డాలర్లతో రెండో స్థానంలోనూ.. లక్సెమ్బర్గ్ 1,09,190 డాలర్లతో మూడో స్థానంలోను నిలిచింది. బ్రిక్స్ దేశాల్లో భారత్దే అతి తక్కువ తలసరి జీడీపీ కావడం గమనార్హం. రష్యా తలసరి జీడీపీ 27,900 డాలర్లు కాగా చైనా 16,620 డాలర్లు, బ్రెజిల్ 15,550 డాలర్లు, దక్షిణాఫ్రికా 13,400 డాలర్లతో జాబితాలో ముందు నిలిచాయి నిలిచాయి. ఐఎంఎఫ్ విడుదల చేసిన తలసరి జీడీపీ గణాంకాల ప్రకారం సింగపూర్(4), బ్రూనే(5), ఐర్లాండ్(6), నార్వే(7), కువ్కెట్(8), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(9), స్విట్జర్లాండ్(10)లు టాప్ టెన్లో నిలిచాయి. అయితే అగ్ర రాజ్యం అమెరికా మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోయింది. ఆ దేశం తలసరి జీడీపీ 59,500 డాలర్లతో జాబితాలో 13వ స్థానంలో నిలవడం గమనార్హం.