Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'క్యాష్లెస్'కు సర్కారు కొత్త ఆలోచన
- బ్యాంకులకు భారం తగ్గించే యోచన
- కార్డు వినియోగాన్ని పెంచడమే లక్ష్యం
- బ్యాంకు చార్జీ భారం ఇక సర్కారుదేనా!
- సబ్సిడీల రూపంలో బ్యాంకులకు సాయం
- 'కార్డు'తిప్పుతున్న అమెరికా కంపెనీలు!
- 'ఒకరికి ఒకే ఖాతా'తో కొత్త భయాలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: సంస్కరణల పేరుతో దేశ ప్రజలు బ్యాంకులు అంటేనే భయపడేలా చేస్తున్న మోడీ సర్కారు.. రానున్న రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కనీస నిల్వలు లేకుంటే చార్జీల మోత మోగియిస్తున్న బ్యాంకులు, డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించేస్తున్నాయి.. దీంతో ప్రజలు బ్యాంకులకు పోయేందుకే జంకే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు సర్కారు బ్యాంకులు అందించే ఇతర సంప్రదాయక బ్యాంకింగ్ సేవలకు కూడా డిజటల్ పేరతో దశల వారీగా మంగళం పాడాలని నిర్ణయించినట్టుగా సమాచారం. క్యాష్లెస్ వ్యవస్థ నిర్మాణం కోసం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే చర్యలో భాగంగా తొలత బ్యాంకులు అందించే చెక్బుక్ సౌకర్యాన్ని ఎత్తివేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
కరెన్సీ కష్టాలు తగ్గించేలా చర్యలు..
వ్యవస్థలో సరిపడా కరెన్సీ నోట్లు అందుబాటులో ఉంచేందుకు.. కొత్త నోట్ల ముద్రణకు గాను సర్కారు దాదాపు రూ.25,000 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. ముద్రించిన నోట్లు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉంచేందుకు గాను అవసరమైన రవాణా, భద్రతకు మరో రూ.6000 కోట్ల వరకు వ్యయం చేస్తోంది. ఇంతటి భారీ వ్యయాన్ని తగ్గించుకొనేందుకు గాను.. క్యాష్లెస్ లావాదేవీలే బెటర్ అన్నది సర్కారు ఆలోచన. ఇందుకోసం కార్డు లావాదేవీలను తప్పనిసరి చేసేలా వాతావారణాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. కార్డు ద్వారా జరిపే లావాదేవీలకు విధించే బ్యాంకు చార్జీలు ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రతిబంధకంగా తయారైంది. దీనిని అధిగమించేందుకుగాను ప్రభుత్వమే వాటిని చెల్లించడం ద్వారా కార్డు వాడకాన్ని ప్రోత్సహించాలన్నది సర్కారు సరికొత్త ఆలోచనగా తెలుస్తోంది . ప్రస్తుతం డెబిట్ కార్డు లావాదేవీలకు 1 శాతం, క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2 శాతం మేర బ్యాంకులు చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ చార్జీలను బ్యాంకులకు సబ్సిడీల రూపంలో అందిస్తే.. కరెన్సీ నోట్ల ముద్రణకయ్యే ఖర్చు కంటే చాలా తక్కువకే దేశంలో ఆర్థిక లావాదేవీలు సులభంగా జరిగిపోతాయన్నది సర్కారు భావన. చార్జీలను నేరుగా భరించడంతో పాటుగా చెక్బుక్ల వ్యవస్థను పూర్తిగా ఎత్తివేస్తే వాటి స్థానంలో కార్డుల వాడకం, ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల చెక్ వ్యవస్థ అమలు వల్ల బ్యాంకులపై పడుతున్న ఉద్యోగుల పని గంటల వ్యయంతో పాటు చెక్బుక్ల ముద్రణ, సరఫరా తదితర ఖర్చులు కూడా తగ్గించవచ్చన్నది సర్కారు ఆలోచన. చెక్బుక్ల ఎత్తివేతతో బ్యాంకుల పని భారం దాదాపు 30% వరకు తగ్గిపోనున్నట్టుగా తెలుస్తోంది.
కార్డులు వాడుతున్నది 5 శాతమే..
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 80 కోట్ల వరకు ఏటీఎం-డెబిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేవలం 5 శాతం మంది మాతమ్రే కార్డులను సంబంధిత యజమానులు నగదు రహిత లావాదేవీలకు వినియోగిస్తున్నారు. మొత్తం కార్డుల్లో దాదాపు 95 శాతం కార్డులను భారతీయులు నగదు విత్డ్రావల్స్కే వినియోగిస్తున్నట్టుగా ఇటీవల మాస్టర్ కార్డు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో కార్డుల వాడకాన్ని పెంపొందించేందుకు గాను సర్కారు బ్యాంకులు అందిస్తున్న మిగతా డిజిటలేతర లావాదేవీలకు కోత విధించాని యోచిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే మొదట బ్యాంకు చెక్బుక్లకు చెక్ పెట్టాలని నిర్ణయిం చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధ్యయనం ముగిసి.. విధివిధానాల రూపకల్పన జరుగుతున్నట్టుగా బ్యాంకింగ్ రంగ నిపుణుల ద్వారా తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో మోడీ సర్కారు ఈ దిశగా తమ నిర్ణయం వెల్లడించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అమెరికా కంపెనీల అత్యుత్సాహం..
డిజిటల్ లావాదేవీలను పెంపొందించే చర్యల్లో భాగంగా ఇప్పుడున్న సంప్రదాయక బ్యాంకింగ్ విధానాలకు కొత పెట్టాలని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వెనుక మాస్టర్ కార్డ్ వంటి అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సంస్థలు, కార్డు సేవలనందించే సంస్థల ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దేశాన్ని క్యాష్లెస్ సొసైటీగా మార్చేందుకు గాను మాస్టర్ కార్డ్ సంస్థ ఇప్పటికే 'అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య'తో (సీఏఐటీ) కలిసి పని చేస్తుం డటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా మాస్టర్ కార్డు సంస్థ సీఏఐటీతో కలిసి దేశ వ్యాప్తంగా 450 సమావేశాలు నిర్వహించింది. వచ్చే నెలాఖరు నాటికి దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది వర్తకులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడంతో పాటు వారు కేవలం కార్డు లావాదేవీలనే ప్రోత్సహించేలా వారికి తర్ఫీదునిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ సంస్థ ఇప్పటికే భారత్లో క్యాష్లెస్ సమాజ ఏర్పాటు కోసం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేసింది. రానున్న రెండేండ్ల కాలంలో దాదాపు మరో రూ.550 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా తరువాత అత్యధికంగా కార్డులు కలిగిన దేశం భారత్ కావడంతో ఇక్కడ డిజిటల్ లావాదేవీలను విస్తరిస్తే తమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతుందన్నది ఈ సంస్థల ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కాష్లెస్ దిశగా చర్యలు తీసుకొవాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం.
చిన్న బ్యాంకులకు పెద్ద కష్టం..!
దేశంలోని ప్రజలందరికీ ఒక్కొక్కరికి ఒక్క ఖాతా మాత్రమే ఉండేలా నియంత్రించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు గాను ఇప్పటికే తెరవెనుక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. ఖాతాల డూప్లికేషన్ను ఎత్తివేసేందుకు గాను.. నల్లధనం నియంత్రణ పేరుతో బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఒక్కసారి దేశం మొత్తం ఖాతాల అనుసంధానం పూర్తయితే ఆధార్ సంఖ్యతో ఒక్కో వ్యక్తికి ఎన్ని ఖాతాలున్నాయో లెక్క తెలిపోనుంది. ఆ తరువాత ఖాతాదారులు ఏదో ఒక్కటి వాడకంలో ఉంచుకొని.. మిగతా వాటిని మూసివేయాలని బ్యాంకులు కొరనున్నాయి. లేకుంటే ఆ పని దశల వారీగా సర్కారే భుజాన వేసుకోనుంది కూడా. దీంతో బ్యాంకుల్లో కొత్త భయాలు మొదలయ్యాయి. ఇప్పటికే బ్యాంకులంటేనే ప్రజలు భయపడుతున్నారని.. సర్కారు రోజుకో కొత్త నిర్ణయంతో ప్రజలను బెంబేలెత్తిస్తే బ్యాంకులకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు భయపడుతున్నాయి. సర్కారు నిర్ణయంతో ఎక్కువ మంది బ్యాంకు శాఖలు, ఏటీఎంలు ఎక్కువగా ఉన్న పెద్ద బ్యాంకుల్లోనే తమ ఖాతాలను ఉంచుకొని చిన్న బ్యాంకుల్లో ఖాతాలను మూసివేసేందుకే ఆసక్తి చూపే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో చిన్న బ్యాంకుల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది.