Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే దేశం.. ఒకే లైసెన్స్
- త్వరలో నూతన విధానం : మంత్రి సుజనా చౌదరీ వెల్లడి
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
భారత్లో ఒకే లైసెన్స్-ఒకే దేశం విధానం అమలుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సైన్స్, టెక్నలాజీ అండ్ ఎర్త్ సైన్సెస్ శాఖ మంత్రి వై సుజనా చౌదరి అన్నారు. శనివారం హైదరాబాద్లో ది ఇన్స్ట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీిఎస్ఐ)-హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సిఎస్ నావిగేటింగ్ కార్పొరేట్ ఎక్సలెన్స్' సదస్సుకు హాజరైన మంత్రి ఐసిఎస్ఐ మొబైల్ యాప్, సావనీర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా అమలు చేయతలపెట్టిన ఈ విధానం ద్వారా అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్ రిజిస్ట్రేషన్లను ప్రయివేటు వ్యక్తులు, డీలర్లకు ఇచ్చేలా చట్టాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. తద్వారా ఔత్సాహికవేత్తలకు మద్దతు ఇవ్వడం, ప్రయివేటు రంగంలో ఉద్యోగ, ఉపాది అవకాశాలను పెంపొందించడం తమ లక్ష్యమని అన్నారు. ఏ రంగంలో అయినా మార్పు రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. 2022 నాటికి దేశం యువజన భారత్గా ఆవిష్కరించబడుతుందన్నారు. కంపెనీ సెక్రటరీలు, సిఎలు వచ్చే 20,30 ఏళ్లలో ఉపాధి కల్పన అవకాశాలపై అంచనాలు వేసుకోవాలన్నారు.
స్టార్టప్ అండ్ స్టాండప్లో చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. దేశం పారిశ్రామిక, ఆర్ధిక శక్తిగా ఎదగడానికి మరెంతో దూరం లేదన్నారు. యువతరానికి అమితమైన అనుభవం ఉన్న సీనియర్లు తోడైతే అభివృద్ధి మరింత పటుత్వాన్ని, వేగాన్ని, స్థిరత్వాన్ని అందుకుంటుందన్నారు. సమకాలిన రంగంలో ఎదురవుతున్న అనేక సమస్యలను ఇన్ఫర్మేషన్ టెక్నలాజీ రంగం పరిష్కరి స్తోందన్నారు. టెక్నలాజీ కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందన్నారు. నూతన టెక్నలాజీలను అందిపుచ్చుకోడంలో కంపెనీ సెక్రటరీలు, నైపుణ్యవంతులు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు.
సైన్స్ టెక్నలాజీ రంగంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా కంపెనీ సెక్రటరీలు చొరవ తీసుకోవాలన్నారు. ఈ రంగానికి బ్యాంకులు కూడా చౌక రుణాలు అందించాలన్నారు. రియల్ ఎస్టేట్ తరహాలో ఇందులో అప్పటికప్పుడే లాభాలు రాకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. అవినీతిరహిత సమాజం కోసం కేంద్రం ప్రయత్నిస్తుందని, మరింత పారదర్శకత పెంచడానికి కృషి చేస్తుందన్నారు.
సులభ వ్యాపార విధానం తరహా సులభ, మెరుగైన జీవితం కోసం తమ మంత్రిత్వశాఖ ప్రయత్నిస్తుందన్నారు. ఈ సదస్సులో ఐసిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ ఆర్ వెంకట రమణ, కౌన్సిల్ మెంబర్ అహ్లాదరావు, సెక్రటరీ రాహుల్ జైన్, ఐఐసిటి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.