Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరలి వెళ్లిన 61 వేల మంది
- తొలి స్థానంలో చైనా
- సర్వేలో వెల్లడైన వివరాలు
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యధికంగా మాతృదేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్తున్న ధనిక వలసదారుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. గడచిన 14 ఏళ్లలో (2000 నుంచి 2014వరకు) సుమారు 61 వేల మంది భారత కోటీశ్వర్లు విదేశాల మోజుతో మాతృదేశం విడిచి వెళ్లి అక్కడే స్థిరపడ్డారని సమాచారం. న్యూ వరల్డ్ వెల్త్, లియో గ్లోబల్ అనే రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. విదేశాల్లో పౌరసత్వం పొందిన భారతీయలు స్వదేశంలో నివసించటానికి విముఖత చూపుతున్నారని సర్వే తెలిపింది. భద్రత, పిల్లల చదువులు, ప్రభుత్వం విధిస్తున్న పన్నులను సాకుగా చూపుతూ వారు అక్కడే ఉండిపోతున్నారని చెప్పింది. ఇప్పటి వరకు 61 వేల మంది కోటీశ్వర్లును భారత్ కోల్పోయిందని నివేదిక తెలిపింది. భారతీయులు ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా, అస్ట్రేలియా వెళ్తున్నారు. ఈ నివేదిక ప్రకారం విదేశాలకు తరలి పోయిన వారిలో చైనా తొలిస్థానంలో నిలిచింది. 91 వేల మంది చైనీయులు విదేశాలకు వెళ్లారు. వీరు ఎక్కువగా అమెరికా, హాంగ్కాంగ్, సింగపూర్, బ్రిటన్లకు వెళ్లెందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అత్యధికంగా బ్రిటన్కు 1.25 లక్షల మంది వలస వెళ్లినట్లు సర్వే తెలిపింది. తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్లు నిలిచాయి.