Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తృతీయ త్రైమాసిక లాభాల్లో 39% క్షీణత
- 13శాతం తగ్గిన రెవెన్యూ
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ మరోమారు ఆర్థిక ఫలితాల్లో మార్కెట్ వర్గాలను నిరాశపర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.305.8 కోట్ల నికర లాభాలతో సరిపెట్టుకుంది. 2016-17 ఇదే త్రైమాసికంలో రూ.504 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే గత త్రైమాసికం లాభాల్లో ఏకంగా 39 శాతం పతనం చోటు చేసుకుంది. ప్రస్తుతం దేశంలో వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలర్, రిలయన్స్ జియోతో ఎయిర్టెల్ తీవ్ర పోటీ పడుతోంది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 13శాతం క్షీణించి రూ.20,319కోట్లకు పరిమితమయ్యింది. 2016 ఇదే డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.23,336 కోట్ల రెవెన్యూ ప్రకటించింది.
దేశీయ ఇంటర్ కనెక్షన్ వాడకం చార్జీలను తగ్గించడంతో ఫలితాలపై ప్రభావం పడిందని భారతీ ఎయిర్టెల్ ఇండియా అండ్ సౌత్ ఏషిియా సీఈవో గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. గత త్రైమాసికంలో డాటా, వాయిస్ ట్రాపిక్ వాడకంలో 544 శాతం వృద్ధి చోటు చేసుకుందన్నారు. ఈ మధ్య కాలంలో ట్రారు అంతర్జాతీయ ఇన్కమింగ్ కాల్స్ రేట్లను తగ్గించిందని, వచ్చే త్రైమాసికాల్లో ఈ ప్రభావం కూడా రెవెన్యూపై ఉండొచ్చన్నారు. గురువారం బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 1.17 శాతం లేదా రూ.5.85 తగ్గి రూ.494.50 వద్ద ముగిసింది.
ప్రస్తుతం 16 దేశాల్లో ఎయిర్టెల్ 39.42 కోట్ల మొబైల్ ఖాతాదారులను కలిగి ఉంది. గతేడాది ఇదే కాలం వినియోగదారులతో పోల్చితే 9.2 శాతం అదనంగా నమోదయ్యారు. ప్రస్తుతం ఈ కంపెనీ రూ.91,714 కోట్ల అప్పులు కలిగి ఉంది.
సైయంట్ లాభాల్లో 15.5% వృద్ధి
ఇంజనీరింగ్, ఐటీ సంస్థ సైయంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో 15.5 శాతం వృద్ధితో రూ.108.8 కోట్ల నికర లాభాలు సాధించింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.94.2 కోట్ల లాభాలు నమోదు చేసింది. గత త్రైమాసికంలో పుర్టో రికోలో నెలకొన్న హరికేన్స్ వల్ల రూ.20.4 కోట్లు, తమ అసోసియేట్ సంస్థలో డిజిన్వెస్ట్మెంట్ వల్ల రూ.5 కోట్ల నష్టం వచ్చినట్టు ఆ సంస్థ పేర్కొంది. క్రితం క్యూ3లో సైయంట్ రెవెన్యూ 7.2 శాతం పెరిగి రూ.983.4 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో తమ అంచనాలకు అనుగుణంగానే ఆర్థిక ఫలితాలు నమోదయ్యాయయని సైయంట్ ఎండీ, సీఈవో క్రిష్ణ బొడనపు పేర్కొన్నారు. సాధారణంగా రెండు, మూడో త్రైమాసికంలో ఎక్కువ సెలవులు ఉంటాయని, అయినా మెరుగైన ఫలితాలు రాబట్టగలిగామన్నారు.
యెస్ బ్యాంకు ఫలితాలు భేష్
ప్రయివేటు రంగ విత్త సంస్థ యెస్ బ్యాంకు 2017 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో 22శాతం వృద్ధితో రూ.1,077 కోట్ల నికర లాభాలు సాధించింది. 2016-17 ఇదే త్రైమాసికంలో రూ.883 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా క్రితం క్యూ3లో నికర వడ్డీపై ఆదాయం 27 శాతం పెరిగి రూ.1,889 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 40 శాతం వృద్ధితో రూ.1,422 కోట్లుగా చోటు చేసుకుంది. మొత్తం ఆస్తులు 36 శాతం పెరిగి రూ.2,65,432 కోట్లకు చేరాయి. కాగా బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 0.85 శాతం నుంచి 1.72 శాతానికి పెరిగాయి. గత త్రైమాసికంలో స్థూల మొండి బాకీలు రూ.254 కోట్లు పెరిగి రూ. 2,974 కోట్లకు చేరాయి. మరో త్రైమాసికంలోనూ సంతృప్తికర ఆర్థిక ఫలితాలు ప్రకటించగలిగామని యెస్ బ్యాంకు ఎండీ, సీఈవో రాణా కపూర్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో గురువారం బీఎస్ఈలో యెస్ బ్యాంకు షేర్ 0.66 శాతం తగ్గి రూ.340.25 వద్ద ముగిసింది.
అల్రాటెక్ సిమెంట్ లాభాల్లో తగ్గుదల..
ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ క్రితం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో రూ.456 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.595 కోట్ల లాభాలు సాధించింది. దీంతో పోల్చితే గత క్యూ3 లాభాల్లో 23 శాతం పతనాన్ని చవి చూసింది. బొగ్గు ధరలు పెరగడంతో కంపెనీ లాభాలు తగ్గాయి. కాగా కంపెనీ నికర అమ్మకాలు మాత్రం రూ.5927 కోట్ల నుంచి రూ.7897 కోట్లకు చేరాయి. గురువారం బీఎస్ఈలో అల్రాటెక్ సూచీ 2.95 శాతం తగ్గి రూ.4,408.55 వద్ద ముగిసింది.