Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదరగొట్టే ఫలితాలను ప్రకటించిన రిలయన్స్
- డిసెంబరు త్రైమాసిక ప్రాపిట్ రూ.9,423 కోట్లు
- పెట్రోకెమికల్స్, జియో సంస్థల లాభాల దన్ను..
- ఏకీకృత లాభాల్లో 25.1 శాతం వృద్ధి నమోదు
- వ్యూహాత్మక పెట్టుబడుల ఫలితమే: ముఖేష్
న్యూఢిల్లీ: దేశంలో సంపన్నులు తమ సరికొత్త వ్యూహాలతో వేల కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా రిలయన్స్ ఇండిస్టీస్ (ఆర్ఐఎల్) ఆర్థిక ఫలితాల రూపంలో ఈ విషయంలో మరోమారు వెల్లడైంది. రిలయన్స్ ఇండిస్టీస్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి అదరగొట్టే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. రిలయన్స్ పెట్రోకెమికల్ వ్యాపారం, రిలయన్స్ డిజిటల్, జియో వ్యాపారాల దన్నుతో ఆ సంస్థ అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి దిమ్మతిరిగే లాభాలను ప్రకటించింది. డిసెంబరు త్రైమాసికంలో సంస్థ ఏకీకృత నికర లాభం దాదాపు 25.1 శాతం మేర పెరిగి రూ.9,423 కోట్లకు చేరింది. అంటే ఆ సంస్థ దాదాపు రోజుకు సగటున రూ.102 కోట్ల మేర లాభాలను ఆర్జించిందన్న మాట. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.7,533 కోట్లుగా ఉంది. వ్యూహాత్మకంగా పెట్రొ కెమికల్ వ్యాపారం విస్తరణకు భారీగా నిధులను మళ్లించడం, సకాలంలో ప్రాజెక్టుల పనులను పూర్త చేయడంతో నుంచి ప్రస్తుతం లాభాలు రావడం మొదలయ్యాయని సంస్థ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. రిలయన్స్ సంస్థ పెట్రోకెమికల్ వ్యాపారం ద్వారా డిసెంబరు త్రైమాసికంలో రూ.5,753 కోట్ల మేర లాభాలు (పన్నులు తగ్గించని) ఆర్జించింది. కాగా, చమురు, సహజ వాయువు వ్యాపారం ద్వారా నష్టం రూ.291 కోట్లుగా నమోదు చేసింది. రిటైల్ వ్యాపారం ఇంకా లాభాలను నమోదు చేయాల్సి ఉందని అంబానీ తెలిపారు. చమురు శుద్ధి వ్యాపారం వరుసగా 12వ త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసినట్టుగా ఆయన వెల్లడించారు. మేటి నిర్వహణ, ఆరోగ్యకరమై పరిశ్రమ మూలాల కారణంగానే ఇది సాధ్యమైనట్టుగా ముఖేష్ వివరించారు. కొత్తగా ప్రారంభించిన డిజిటల్ సేవలు జియో బ్రాండ్లు కూడా తమ తొలి లాభాలను నమోదు చేయడం తమకు బాగా కలిసి వచ్చినట్టు ఆయన వెల్లడించారు. కాగా, రిఫైనింగ్ మార్కెటింగ్ వ్యాపారం ద్వారా ఆర్జన స్వల్పంగా తగ్గిందని ఆయన అన్నారు. గత ఏడాది మూడో త్రైమాసికం నందు ఈ విభాగం ద్వారా రూ.6,194 కోట్ల ఆదాయ రాగా ఈ ఏడాది రూ.6,165 కోట్లకు పరిమితమైంది.
రికార్డులే.. రికార్డులు..
అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో సంస్థ పలు రికార్డులను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో సంస్థ చేతిలో నగదు రూ.77,014 కోట్ల నుంచి రూ.78,617 కోట్లకు చేరింది. పన్ను కేటాయింపులకు ముందు సంస్థ లాభం విషయంలోనూ సరికొత్త రికార్డు నమోదు అయింది. డిసెంబరు త్రైమాసికంలో సంస్థ పన్ను కొతకు ముందు లాభం 44.8 శాతం వృద్ధితో రూ.13,789 కోట్లకు చేరుకుంది.
మొదలైన జియో లాభాలు..
దేశంలో టెలికాం సంచలనంగా దూసుకొచ్చిన రిలయన్స్ జియో సంస్థ లాభాల ఖాతాను తెరిచింది. దాదాపు 16 కోట్ల మంది ఖాతాదారులతో ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియో సంస్థ డిసెంబరు త్రైమాసికానికి దాదాపు రూ.504 కోట్ల లాభాలను ఆర్జించింది. వాణిజ్య పరంగా తన కార్యకలాపాలను ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే సంస్థ బంపర్ లాభాలను నమోదు చేయడం విశేషం. సంస్థ తన వాణిజ్య కార్యకలాపాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి మొదలు పెట్టిన సంగతి తెలిసింది. గత త్రైమాసికంలో సంస్థ రూ.271 కోట్ల నష్టాలను నమోదు చేసింది. తాజాగా కేవలం మూడు నెలల కాలంలోనే సంస్థ లాభాల్లోకి మళ్లడం విశేషం. రిలయన్స్ సంస్థ వ్యూహాత్మక చర్యలకు, బలమైన వ్యాపార మూలానికి, మెరుగైన వ్యాపార సామర్థ్యానికి జియో లాభాలు ప్రత్యక్ష నిదర్శనాలని ముఖేష్ వ్యాఖ్యానించారు. జియో లాభాలు తమకు అనందదాయకమని ఆయన అన్నారు.