Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగవేతదారులెవరైనా ఉపేక్షించం : అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగంలోని డొల్లతనాన్ని బయటపెడుతూ పంజా బ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో వెలుగు చూసిన ఘరానా మోసం పై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎట్టకేలకు మౌనం వీడారు. ఈ స్కామ్పై ఆయన తొలిసారిగా స్పందించారు. ఈ స్కామ్కు ప్రధాన బాధ్యులు ఆడిటర్లు, బ్యాంకర్లేనని ఆయన అన్నారు. పీఎన్బీ జరిగిన రూ.11,400 కోట్ల కుంభకోణానికి వీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. నిర్ణయాలు తీసుకునే అధికారం బ్యాంకు యాజమాన్యానికి ఉంటే, దాన్ని క్షేత్ర స్థాయిలో సమర్థమంతంగా, సరియైన పద్ధతిలో అమలు చేయాల్సి బాధ్యత బ్యాంకర్లదేనని ఆయన అన్నారు. పీఎన్బీఐలో గత ఏడు సంవత్సరాలుగా జరుగుతోన్న మోసాలను గుర్తించడంలో అంతర్గత, బహిర్గత ఆడిటర్లు విఫలమయ్యారంటే అడిట్ నిపుణులు పనితీరును పున:పరిశీలన చేసుకోవాల్సినంత అవసరం ఉందని తాను భావిస్తున్నానన్నారు. ఏడీఎఫ్ఐఏపీ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పీఎన్బీ స్కామ్లోని నిందుతులను ఎట్టి పరిస్థితుల్లోను వదిలేది లేదని పేర్కొన్నారు. నిందుతులను పట్టుకొని..సొమ్ము రికవరీకి విచారణ సంస్థలు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాయని అన్నారు. బ్యాంకింగ్ రంగం బలోపేతానికి దశల వారీగా తాము అన్ని చర్యలు చేపడుతున్నాట్టుగా మంత్రి వివరించారు. పీఎన్బీ స్కామ్ విషయంలో నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ స్కాం వెలుగులోకి వచ్చాక, ఈడీ, సీబీఐ వీరి సంస్థలపై భారీ ఎత్తున్న తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మోసంలో 120 డొల్ల కంపెనీలు పాలుపంచుకున్నట్టు ఈడీ ఆరోపిస్తోంది. వీటిలో 80 కంపెనీలు నీరవ్ మోదీ, చౌక్సి ఆధ్వర్యంలో నడుస్తున్నవేననిపేర్కొంది. ఈ కేసులో భాగమైన మెహుల్ చౌక్సి ప్రమోటర్గా ఉన్న గీతాంజలి జెమ్స్, దాని అసోసియేటెడ్ సంస్థలపై ఐటీ కూడా దాడులు చేసింది. ముంబై, పుణే, సూరత్, హైదరాబాద్, బెంగళూరు వంటి పలు నగరాల్లో ఉన్న కంపెనీల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తోంది.