Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎన్బీతో నీరవ్ బేరసారాలు..
- రూ.1,250 కోట్లు కట్టేందుకు సై..
- కుదరదంటూ పీఎన్బీ సీరియస్
- తాజాగా మరో రూ.954 కోట్ల కేసు
- రూ.13,600 కోట్లకు చేరిన స్కామ్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు (పీఎన్బీ) దాదాపు రూ.12,600 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన వాజ్రాల వ్యాపారి నీరవ్మోడీ ఈ స్కామ్ విషయంలో బ్యాంకింగ్ వార్గలతో రాజీ కుదుర్చుకొనేందుకు యత్నిస్తున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ఆయన పీఎన్బీ అధికారులకు ఒక ఈమెయిల్ సందేశం పంపినట్టుగా తెలుస్తోంది. మొత్తం స్కామ్ విలువ దాదాపు రూ.12,600 వరకు ఉండగా.. అప్పుల కింద రూ. 2000కోట్ల విలువైన నగలు, రూ.200 కోట్ల నగదు, రూ.50 కోట్ల విలువైన స్థిరాస్తులను అప్పు తీర్చి తీర్చేందుకు బ్యాంకునకు అప్పగిస్తానని.. బ్యాంక్ వర్గాలు రాజీకి రావాలని కోరినట్టు ఈ మెయిల్ సారాంశం. అయితే ఈ ప్రతిపాదనపై పీఎన్బీ సీరియస్ అయింది. ఈ కేసు విషయంలో బ్యాంకు ప్రతిష్ట దిగజారిందని.. ఎలాంటి రాజీలు కుదరవని తెగేసి చెప్పింది. వెంటనే బ్యాంకు వద్ద రుణ రూపంలో తీసుకున్న డబ్బు మొత్తాన్ని కట్టాల్సిందేనని తేల్చి చెప్పినట్టు సమాచారం.
మీ బ్రాండ్ మా పుణ్యమే...
నీరవ్మోడీ రాజీ ప్రతిపాదనపై సీరియస్ అయిన పీఎన్బీ ఆయనకు దీటుగా సమాధానమిస్తూ.. 'మీరు ఎంత మొత్తంలో బ్యాంకును మోసం చేశారో మీకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు అందులో కొంత మాత్రమే కడతానంటున్నారు. అంతేగాక మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లేదు. రాజీ కోసం మీరు చెప్పిన ఆస్తుల వివరాల్లో ఎలాంటి విశ్వసనీయత లేదు. మీరు మొత్తం డబ్బు కట్టాల్సిందే. కొన్నేళ్లుగా బ్యాంకును మోసం చేస్తూ మా డబ్బును దుర్వినియోగం చేశారు. అయినప్పటికీ బ్యాంకు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోదు అని మీరు ఎలా అనుకుంటున్నారు. పైగా పీఎన్బీ కేసు పెట్టడం వల్ల, సీబీఐ కేసుల వల్ల మీ బ్రాండ్ చెడిపోతోందని మాపై ఆరోపణలు చేయడం సరికాదు. నిజం చెప్పాలంటే.. నీరవ్మోదీ అనే బ్రాండ్ను నిర్మించుకుంది మా బ్యాంకు డబ్బులతో కదా'అనిఈ ఈ-మెయిల్లో స్పష్టం చేసింది. పీఎన్బీ నుంచి తీసుకున్న మోసపూరిత లెటర్ ఆఫ్ అండర్టేకింగ్(ఎల్వోయూ)లతో నీరవ్మోదీ తదితరులు విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. రుణ ఎగవేతకు సంబంధించి నీరవ్మోదీతో పాటు ఆయన బంధువైన మెహుల్ చౌక్సీ తదితరులపై సీబీఐ, ఈడీలు ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వెలుగులోకి మరో రూ.942 కోట్ల మోసం..
పీఎన్బీలో వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, చౌక్సీలు చేసిన మోసాల విలువ రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా పీఎన్బీ స్కామ్లో కీలక నిందితుడుగా ఉన్న గీతాంజలీ ప్రమోటర్ మెహుల్ చౌక్సీకి సంబంధించిన అదనంగా మరో రూ.942 కోట్ల మోసాన్ని గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీబీఐ వద్ద మరో ఫిర్యాదును నమోదు చేసింది. దీంతో గీతాంజలి జెమ్స్ మొత్తం అక్రమాల విలువ రూ.7 వేలకోట్లకు చేరినట్టయింది. మరోవైపు నీరవ్ మోడీ మోసాల విలువ కూడా తాజా ఫిర్యాదుతో ఏకంగా రూ.13,600 కోట్లకు చేరువైంది.