Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేసవిలో ప్యాక్ చేసిన నీటితో జాగ్రత్త..
- ఐఎస్ఐ మార్క్లేని బాటిల్స్లో నీరు వాడొద్దు..
- ప్రజలు జాగురుకతతో వ్యవహరించాలి..
- ఇంటి ఉక్కు విషయంలోనూ జాగ్రత్త: బీఐఎస్ హైదరాబాద్ శాఖ అధినేత అమీర్ ఉజ్ జమాన్
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వేసవి నేపథ్యంలో కుప్పలుతెప్పలుగా ప్యాక్ చేసిన తాగు నీటి సీసాలు, మినరల్ బాటిల్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగురుకతతతో వ్యవహరించాలని 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' (భారత ప్రమాణాల సంస్థ-బీఐఎస్) హెచ్చరిస్తోంది. తాగు నీటి సీసాలపై తప్పక ఐఎస్ఐ మార్కును చూసి ప్రమాణాలకు తగ్గట్టుగా తయారు చేసిన సీసా నీళ్లనే తాగాలని.. లేదంటే ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉందని బీఐఎస్ హైదరాబాద్ శాఖ అధినేత, శాస్త్రవేత్త అయిన అమీర్ ఉజ్ జమాన్ ప్రజలకు సూచిస్తున్నారు. వేసవి నేపథ్యంలో పలు ప్రయివేట సంస్థలు ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా తాగు నీటిని సీసాల్లో ప్యాక్ చేసి వాటిని మార్కెట్లోకి వదులుతుండడం తమ దృష్టికి వస్తోందని వాటిపై నిఘా ఉంచినట్టుగా ఆయన తెలిపారు. బీఐఎస్ ప్రమాణాలను పాటించకుండా మార్కెట్లోకి సీసాలను తీసుకువచ్చే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్టుగా ఆయన వెల్లడించారు. కొత్తగా మార్కెట్లలోకి తమ ఉత్పత్తులను తీసుకురావాలని యోచిస్తున్న వారు బీఐఎస్ కార్యాలయాన్ని సంప్రదించి ఐఎస్ఐ ధ్రువీకరణను తగిన అనుమతులను పొందాలని ఆయన సూచించారు. కొందరు తమ ఉత్పత్తులకు ఐఎస్ఐ ధ్రువీకరణ లేకున్నా.. తమ సీసాలపై నకిలీ ఐఎస్ఐ మార్క్ను ముద్రించి మార్కెట్లలో అమ్ముతున్నట్టుగా కూడా ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. దీనిని అరికట్టేందకు చర్యలు చేపడుతున్నట్టుగా వివరించారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారి సమాచారం తమ కార్యాలయానికి గానీ.. లేదా 040-27249996/ 97/98 నంబర్లకు ఫోన్ చేసి అందిస్తే తగిన చర్యలు చేపట్టనున్నట్టుగా ఆయన వివరించారు. గ్రామాల్లో సరఫరా చేస్తున్న టిన్ బాటిల్స్ నీళ్లను కూడా ప్రమా ణాల మేరకు తయారు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఉక్కు విషయంలోనూ జాగ్రత్త..
భవన నిర్మాణాలతో సహా ఇతర నిర్మాణ కార్యక్రమాల్లో వినియోగించే స్టీల్ విషయంలోనూ ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని అమీర్ ఉజ్ జమాన్ తెలిపారు. నమ్మకమైన స్టీల్కు ఐఎస్ఐ మార్క్ గుర్తని ఆయన అన్నారు. స్టీల్ రాడ్లపై ఐఎస్ఐ గుర్తింపు లేకుండా వచ్చే ఉక్కును భవన నిర్మాణాలకు వాడొద్దని ఆయన సూచించారు. దీనివల్ల ఆ భవనాలు ఎక్కువ కాలం మన్నకపోవడమే కాకుండా చిన్నచిన్న ప్రమాదాలను కూడా అవి తట్టుకోలేక కుప్పకూలే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో భవన యజమానులు నిర్మాణాలు చేపడుతున్నప్పుడు స్టీల్ విషయంలో ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రజలు కూడా బీఐఎస్ ప్రమాణాల పట్ల కనీస అవగాహనను పెంపొందించుకోవడం ద్వారా వ్యాపారుల చేతుల్లో మోస పోకుండా ఉంటారని అధికారులు చెబుతున్నారు.