Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 బ్యాంకుల్ని ముంచిన 'కనిష్క్' గోల్డ్ సంస్థ
- పదేండ్ల నుంచి దర్జాగా బ్యాంకుల లూటీ
- ప్రజాప్రతినిధులు, అధికారుల హస్తం!
- అలసత్వంతో ఆలస్యంగా వెలుగులోకి..
- తాపీగా సీబీఐకి ఫిర్యాదు చేసిన ఎస్బీఐ
- బెయిల్పై వచ్చి దేశం దాటేసిన 'డైరెక్టరు'
చెన్నై: బ్యాంకుల్లో జ్యువెల్లరీ సంస్థల మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వేలాది కోట్ల మేర రుణాలు తీసుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టిన గీతాంజలి జ్యువెల్లర్స్, నీరవ్ మోడీ మోసాల కేసులు ఒక కొలిక్కి రాకముందే.. తాజాగా మరో ఆభరణాల సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేజీపీఎల్) సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్తో (ఎస్బీఐ) సహా 14 బ్యాంకుల నుంచి దాదాపు రూ.824.15 కోట్ల మేర రుణాలను తీసుకొని కుచ్చుటోపీ పెట్టింది. ఈ ఉదంతంపై సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని కనిష్క్ గోల్డ్ దుకాణం డైరెక్టర్స్ భూపేష్ కుమార్, ఆయన భార్య నీతా జైన్పై సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. 2008 నుంచి దాదాపు పదేండ్లుగా కేజీపీఎల్ డైరెక్టర్ల నకిలీ ధ్రువపత్రాలు, రికార్డులను బ్యాంకుల్లో దాఖలు చేసి వందల కోట్ల మేర రుణాలను స్వీకరించినట్టుగా తెలుస్తోంది. సరైన స్టాక్స్ చూపకుండా కేవలం రికార్డుల్లో మాయంజాలం చేస్తూ కనిష్క్ ప్రమోటర్లు మోసాని పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. తన బ్యాంకు ఫోరెన్సిక్ ఆడిట్లో భాగంగా కేజీపీఎల్ సమర్పించిన పత్రాలను పరిశీలించి చూస్తే రుణాల నిమిత్తం డైరెక్టర్స్ భూపేష్ కుమార్, ఆయన భార్య నీతా జైన్లు స్టాట్యుటరీ ఆడిటర్లతో కలిసి నకిలీ ధ్రువ పత్రాలను, ఫోర్జర్డ్ డాక్యుమెంట్లతో బ్యాంకులను పెద్దమొత్తంలో రుణాలను స్వీకరించి వాటిని ఇతర అవసరాలకు మళ్లించిన విషయం వెలుగులోకి వచ్చిందని ఎస్బీఐ తన ఫిర్యాదులో పేర్కొంది. వీటిపై వివరణ కోరేందుకు వెళ్లగా రాత్రికి రాత్రే వాళ్లు దుకాణాలన్నింటినీ మూసివేసి, వారు రికార్డులను కూడా మాయం చేసినట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ సీబీఐకిచ్చిన ఫిర్యాదులో తెలిపింది. రుణం మొత్తానికి రావాల్సి వడ్డీ కూడా జతచేసి చూస్తే.. ఎగవేత మొత్తం రూ.1000 కోట్ల వరకు చేరనుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి కనిష్క్ జ్యూయలరీ రుణాలు తీసుకున్న 14 బ్యాంకులకు డబ్బులు కట్టడం నిలిపివేసింది. గతేడాది నవంబరులో ఎస్బీఐ కనిష్క్ గోల్డ్ జ్యూయలరీ యజమానిని రుణ ఎగవేతదారుడిగా ప్రకటించి సదరు రుణాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. ఈ విషయమై ప్రశ్నించేందుకు బ్యాంకు అధికారులు ఆయా దుకాణాల వద్దకు వెళ్లగా అవన్నీ మూసేసి కనిపించాయి. అయితే కనిష్క్ మోసం వెనుక బడా ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్టుగా విచారణ సంస్థలు అనుమానిస్తున్నాయి.. బ్యాంకుల్లో కొందరు అధికారుల లాలూచీ పడ్డ విషయం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోందని విచారణ సంస్థలు చెబుతున్నాయి.
బెయిల్పై వచ్చి.. మారిషస్ ఉడాయించారు..
రుణాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా కనిష్క్ ప్రమోటర్ల ఆచూకీ తెలియడం లేదని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. భూపేష్, నీతా జైన్లు మారిషస్ పారిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మోసంలో కీలక పాత్ర పోషించిన ఆడిటర్లు తేజ్రాజ్, అజరు కుమార్ జైన్, సుమిత్ కేడియాలను కూడా బ్యాంక్ నిందితులుగా ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇది ఇలా ఉంటే 2017 సెప్టెంబరులో కనిష్క్ గోల్డ్ వ్యవస్థాపకుడు భూపేష్ కుమార్ జైన్ను రూ. 20 కోట్ల ఎక్సైజ్ పన్ను మోసం కేసులో అరెస్టు అయ్యాడు. బెయిల్ మీద విడుదలైన భూపేష్ అప్పటి నుంచి భార్యతో సహా పరారీలో ఉన్నాడు. కాగా చెన్నైలోనే కాకుండా హైదరా బాద్, కొచ్చిన్, ముంబైలలో కూడా కనిష్క్ జువెలరీ తన షాపులను విస్తరించింది.
ఎస్బీఐకే అత్యధికం భారం..
మొత్తం రుణంలో ఎస్బీఐ వాటాయే దాదాపు రూ.240 కోట్ల వరకు ఉందని ఆ సంస్థ ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది. బాధిత బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు (రూ.128 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.53 కోట్లు), ఐడీబీఐ (రూ.49 కోట్లు), సిండికేట్ బ్యాంకు (రూ.54 కోటు)్ల, యూకో బ్యాంక్ (రూ.45 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ (రూ.22 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్ (రూ.23 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.32 కోట్లు), తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ (రూ.27 కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.27 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.27 కోట్లు), ఆంధ్రా బ్యాంక్ (రూ.32 కోట్లు) ఉన్నాయి.